నవమ సర్గ శ్లోకం 01
వీక్ష్య రన్తుమనసః
సురనారీరాత్తచిత్రపరిధానవిభూషాః ।
తత్ప్రియార్థమివ యాతుమథాస్తం
భానుమానుపపయోధి లలమ్బే ॥
ప్రతిపదార్థం
అథ = జలక్రీడ ముగిసిన తర్వాత, భానుమాన్ =
సూర్యుడు, ఆత్తచిత్రపరిధానవిభూషాః = ధరించబడిన విచిత్రములైన
వస్త్రములు మరియు ఆభరణములు కలిగినట్టియు, అనగా సురత క్రీడకు
సిద్ధపడినట్టియు, రన్తుమనసః = రమించుటకు కోరిక గల మనస్సు కలిగినట్టి, సురనారీః = దేవతా
స్త్రీలను, వీక్ష్య = చూచి, తత్ప్రియార్థమివ =
వారికి ప్రియమును గూర్చుట కొరకో అన్నట్లు, అనగా వారికి ఏకాంత
సమయాన్ని ఇచ్చే రూపంలో మేలు చేయడానికో అన్నట్లు, అస్తం = అస్తమయమును, యాతుం = పొందుటకు, ఉపపయోధి = సముద్ర
సమీపమునందు, లలమ్బే = వాలెను (క్రిందికి జారెను).
తాత్పర్యం
జలక్రీడలు ముగిసిన అనంతరం దేవతా స్త్రీలు
రమించాలనే కోరికతో విచిత్రమైన వస్త్రాలను, ఆభరణాలను ధరించి
సిద్ధంగా ఉన్నారు. వారిని చూసిన సూర్యుడు, ఆ సురసుందరులకు
ఏకాంత సమయాన్ని ఇచ్చి ప్రియమును చేకూర్చడానికో అన్నట్లు, అస్తమించడానికై
సముద్ర తీరంలో క్రిందికి వాలాడు.
విశేషాలు
మల్లినాథసూరి ఈ శ్లోకానికి ఘంటాపథ
వ్యాఖ్యానంలో అద్భుతమైన వ్యాకరణ విశేషాలను మరియు అలంకారాన్ని వివరించారు. ఇక్కడ
సూర్యుడు అస్తమించడానికి దేవతా స్త్రీలకు ప్రియం చేయడం అనే ఫలాన్ని ఊహించడం వల్ల
ఇది ఫలోత్ప్రేక్షా అలంకారం అవుతుంది. వ్యాకరణ రీత్యా రన్తుమనసః అనే పదం
ఏర్పడేటప్పుడు, సమాన కర్తృకమైన తుమున్ ప్రత్యయం వచ్చినప్పుడు 'లుమ్పెవశ్యం మః
కృత్యే తుంకామమనసోరపి' అనే సూత్రం ప్రకారం తుమ్ లోని మకారానికి లోపం
జరిగి రన్తుమనసః గా మారుతుంది. ఇక్కడ అస్తమ్ అనే పదం మకారాంత అవ్యయం. ఉపపయోధి
అనేది పయోధి సమీపము అనే అర్థంలో అవ్యయీభావ సమాసం. ఈ నవమ సర్గ అంతా స్వాగతా
వృత్తంలో నడుస్తుంది. దీని లక్షణం 'స్వాగతేతి రనభానురుయుగ్మమ్' - అనగా
ప్రతి పాదంలోనూ వరుసగా రగణము, నగణము,
భగణము మరియు రెండు గురువులు (గురు
యుగ్మము) ఉంటాయి.
నవమ సర్గ శ్లోకం 02
మధ్యమోపలనిభే లసదంశావేకతశ్చ్యుతిముపేయుషి
భానౌ ।
ద్యౌరువాహ పరివృత్తివిలోలాం హారయష్టిమివ
వాసరలక్ష్మీమ్ ॥
ప్రతిపదార్థం
మధ్యమోపలనిభే = నాయక మణి (హారము మధ్యలో
ఉండే పెద్ద మణి) తో సమానమైనట్టియు, లసదంశౌ = ప్రకాశించుచున్న కిరణములు కలిగినట్టియు, భానౌ = సూర్యుడు, ఏకతః = ఒక వైపునకు, చ్యుతిం = జారుటను, [ఉపేయుషి
సతి] = పొందుచుండగా, ద్యౌః = ఆకాశము, పరివృత్తివిలోలాం =
కాలచక్రము యొక్క తిరుగుడు చేత (మధ్యాహ్న సమయము దాటిపోవుట చేత) చలించుచున్నట్టియు, శరీరము పక్కకు
తిరుగుట చేత ఊగులాడుచున్నట్టియు, వాసరలక్ష్మీమ్ = పగటి శోభను, హారయష్టిమివ =
ముత్యాల హారమును వలె, ఉవాహ = వహించెను.
తాత్పర్యం
ముత్యాల హారము మధ్యలో ఉండే పెద్ద నాయకమణి
వంటివాడు, ప్రకాశవంతమైన కిరణాలు కలవాడు అయిన సూర్యుడు పశ్చిమ
దిక్కుగా క్రిందికి జారిపోతుండగా, ఆకాశమనే కాంత
మధ్యాహ్న సమయం దాటిపోవడం వల్ల కదలాడుతున్న పగటి శోభ అనే ముత్యాల హారాన్ని
ధరించినట్లుగా ప్రకాశించింది.
విశేషాలు
మల్లినాథసూరి అమరకోశం మరియు వైజంతీ కోశాల
ఆధారంగా పదాలకు అర్థ నిర్ణయం చేశారు. అమరకోశం ప్రకారం నిభ, సంకాశ, నీకాశ, ప్రతిరూప, ఉపమా మొదలైన పదాలు
సాదృశ్యాన్ని (సమానత్వాన్ని) తెలియజేస్తాయి. వైజయం తీ కోశం ప్రకారం ఉపల శబ్దం స్త్రీలింగంలో చక్కెరను, పుంలింగంలో రాయిని
లేదా మణిని సూచిస్తుంది. ఇక్కడ మధ్యమోపల అనగా హారము మధ్యలో ఉండే శ్రేష్ఠమైన మణి
(నాయకమణి). సూర్యుడు పక్కకు జరగడం వల్ల పగటి శోభ కదలడాన్ని, స్త్రీ తన
శరీరాన్ని పక్కకు తిప్పినప్పుడు హారం కదలడంతో పోల్చడం వల్ల ఇక్కడ శ్లేషోత్తాపిత
ఉపమాలంకారం మనోహరంగా వ్యక్తమవుతోంది.
నవమ సర్గ శ్లోకం 03
అంశుపాణిభిరతీవ పిపాసుః పద్మజం మధు భృశం
రసయిత్వా ।
క్షీవతామివ గతః క్షితిమేష్యంలోహితం
వపురువాహ పతఙ్గః ॥
ప్రతిపదార్థం
పతఙ్గః = సూర్యుడు, అతీవ = మిక్కిలి, పిపాసుః = తాగాలనే
కోరిక కలవాడై (దప్పిక గలవాడై), అంశుపాణిభిః = కిరణములనెడి చేతులతో, పద్మజం =
పద్మములందు పుట్టిన, మధు = మకరందమనే మద్యమును, భృశం = ఎక్కువగా, రసయిత్వా =
ఆస్వాదించి (తాగి), క్షీవతాం = మత్తదనమును (మైకమును), గత ఇవ = పొందినవాడో
అన్నట్లు, క్షితిం = భూమిని, ఏష్యన్ =
చేరబోవుచున్నవాడై, లోహితం = ఎర్రనైన, వపుః = శరీరమును, ఉవాహ = వహించెను.
తాత్పర్యం
సూర్యుడు మిక్కిలి దప్పిక
గలవాడై తన కిరణాలనే చేతులతో పద్మాల్లోని మకరందమనే మద్యాన్ని అమితంగా తాగాడు.
దానివల్ల మత్తెక్కినవానిలా ఎర్రబడిన శరీరంతో భూమిపైకి
(అస్తాద్రికి) వాలుతున్నట్లుగా సూర్యబింబం ఎర్రగా ప్రకాశించింది.
విశేషాలు
మల్లినాథుని వ్యాఖ్యానం ప్రకారం పతఙ్గ
అనగా పక్షి మరియు సూర్యుడు అని అమరకోశ నిఘంటువు చెప్తోంది. అలాగే అతీవ అనగా
మిక్కిలి నిబిడంగా అని అర్థం. పిపాసుః అనేది పా ధాతువుకు సన్ ప్రత్యయం చేరగా
ఏర్పడిన రూపం. ఇక్కడ మధు అనే పదానికి మకరందము మరియు మద్యము అనే రెండు అర్థాలు
ఉన్నాయి, కాబట్టి ఇది శ్లిష్ట రూపకం అవుతుంది. అమరకోశం
ప్రకారం మధు అంటే మద్యము మరియు పుష్పరసము అని అర్థాలు ఉన్నాయి. క్షీవతామ్ అనగా
మత్తును పొందడం; మత్త,
శౌణ్డ, ఉత్కట, క్షీవ అనేవి
సమానార్థకాలు. లోకంలో మద్యం తాగినవాడు మత్తెక్కి ఎర్రని
శరీరంతో భూమిపై ఎలా దొర్లుతాడో, సూర్యుడు
కూడా పద్మరసాన్ని తాగి ఎర్రటి బింబంతో భూమిని తాకుతున్నట్లు అస్తమిస్తున్నాడని
భావం. సూర్యుడు భూమిపై వాలడమే అస్తమయమని శాస్త్ర సంప్రదాయం. ఇక్కడ రూపక మరియు ఉత్ప్రేక్ష అలంకారాలు
ఒకదానికొకటి ఆశ్రయమై ఉండడం చేత అంగాంగిభావ సంకర అలంకారం సిద్దించింది.
నవమ సర్గ శ్లోకం 04
గమ్యతాముపగతే నయనానాం లోహితాయతి
సహస్రమరీచౌ ।
ఆససాద విరహయ్య ధరిత్రీం
చక్రవాకహృదయాన్యభితాపః ॥
ప్రతిపదార్థం
సహస్రమరీచౌ = వేయి కిరణములు కల సూర్యుడు, లోహితాయతి సతి =
ఎర్రబడుచుండగా, నయనానాం = కన్నులకు, గమ్యతాం = చూడదగిన
స్థితిని (సౌమ్యత్వాన్ని), ఉపగతే సతి = పొందుచుండగా, అభితాపః = సంతాపము
(వేడి/దుఃఖము), ధరిత్రీం = భూమిని, విరహయ్య =
విడిచిపెట్టి, చక్రవాకహృదయాని = చక్రవాక పక్షుల యొక్క గుండెలను, ఆససాద = చేరెను.
తాత్పర్యం
వేయి కిరణాల సూర్యుడు అస్తమయ సమయాన ఎరుపు
రంగును సంతరించుకుని, కళ్లతో తిన్నగా చూడదగిన సౌమ్య స్థితికి
చేరుకున్నాడు. ఆ సమయంలో అంతవరకు భూమిని దహించిన సూర్యుని వేడి (సంతాపము) భూమిని
విడిచిపెట్టి, ప్రియురాలికి దూరం కాబోతున్న చక్రవాక పక్షుల
హృదయాలలో విరహతాప రూపంలో ప్రవేశించింది.
విశేషాలు
మల్లినాథసూరి వ్యాఖ్యానం ప్రకారం ఇక్కడ వ్యాకరణ
విశేషాలు, అలంకారాలు అద్భుతంగా చర్చించబడ్డాయి. 'సహస్రమరీచౌ' అనగా సూర్యుడు. 'లోహితాయతి' అనే పదం 'లోహితాదిడాజ్భ్యః
క్యష్' అనే సూత్రం ద్వారా క్యష్ ప్రత్యయం వచ్చి, 'వా
క్యషః' అనే సూత్రం చేత పరస్మైపదంలో శతృ ప్రత్యయం రాగా
ఏర్పడింది. 'విరహయ్య' అనే రూపంలో 'ల్యపి లఘుపూర్వాత్' అనే సూత్రం ప్రకారం
అయాదేశం వచ్చి విరహయ్య అని అయింది. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అతనిలో వేడి
తగ్గి, ఎర్రగా మారి కళ్లకు ఇంపుగా కనిపిస్తాడు. అంటే
అప్పటివరకు తన తీవ్ర కిరణాలతో భూమిని దహించిన ఆ 'వేడి' (సంతాపము)
ఇప్పుడు భూమిని విడిచిపెట్టింది.
మరి ఆ వేడి ఎక్కడికి వెళ్ళింది?
సూర్యుడు అస్తమిస్తున్నాడు అనగానే, రాత్రి కాబోతోందని
అర్థం. చక్రవాక పక్షులకు రాత్రిపూట ఒకదానికొకటి కనిపించవు, విడిపోవాల్సిందే
అనేది కవుల సమయం (కవి సంప్రదాయం). కాబట్టి చీకటి పడుతోందన్న బాధతో ఆ పక్షుల
గుండెల్లో విరహతాపం (బాధ/వేడి) మొదలైంది.
దీనిని మల్లినాథసూరి ఒక అద్భుతమైన ఊహతో
వివరిస్తున్నారు: "భూమిపై ఉన్న వేడి తగ్గిపోవడం, అదే సమయంలో చక్రవాక
పక్షులలో విరహతాపం పెరగడం అనే ఈ రెండింటిని చూస్తే, భూమిని
విడిచిపెట్టిన ఆ సూర్యతాపమే నేరుగా వచ్చి ఈ చక్రవాక పక్షుల హృదయాల్లో
ప్రవేశించిందా అన్నట్లుగా ఉంది" అని అభేదాధ్యవసాయం (రెండూ
ఒకటే అని చెప్పడం) చేశారు.
ఇదే 'భేదే అభేదరూప
అతిశయోక్తి అలంకారం' అని ఆయన వివరించారు.
నవమ సర్గ శ్లోకం 05
ముక్తమూలలఘురుజ్ఝితపూర్వః పశ్చిమే నభసి
సంభృతసాన్ద్రః ।
సామి మజ్జతి రవౌ న విరేజే ఖిన్నజిహ్మ ఇవ
రశ్మిసమూహః ॥
ప్రతిపదార్థం
రవౌ = సూర్యుడు, సామి = సగము, మజ్జతి సతి =
అస్తమించుచుండగా (మునుగుచుండగా), ముక్తమూలలఘుః = వదలబడిన మూలస్థానము (ఆశ్రయమైన
సూర్యుడు/స్వామి) కలదగుట చేత అల్పమైనట్టియు, ఉజ్ఝితపూర్వః =
విడవబడిన తూర్పు దిక్కు కలిగినట్టియు (వదలబడిన పూర్వ జనులు కలిగినట్టియు), పశ్చిమే = పడమర
దిక్కునందలి, నభసి = ఆకాశభాగమునందు (నీచ స్థానమునందు), సంభృతసాన్ద్రః =
గుమికూడి దట్టమైనట్టియు, రశ్మిసమూహః = కిరణముల గుంపు (ఆశ్రితులైన జనులు), ఖిన్నజిహ్మః ఇవ =
దుఃఖము చేత దీనుడైన వాని వలె, న విరేజే = ప్రకాశించలేదు.
తాత్పర్యం
సూర్యుడు సగము
అస్తమించినప్పుడు, అతని కిరణాల సమూహం ప్రకాశించలేదు. ఆ
కిరణాలు తమ మూలస్థానమైన సూర్యుడిని వదిలి బలహీనపడ్డాయి, తూర్పు దిక్కును విడిచిపెట్టి పశ్చిమ
ఆకాశంలో ముద్దగా కూడాయి. ఇది ఎలా ఉందంటే, తమ
యజమాని ఆపదలో ఉండి సగం మునిగిపోతుంటే, అతడిని
ఆశ్రయించుకున్న సేవకులు లేదా ఆశ్రిత జనులు తమ పూర్వపు సత్కారాన్ని, స్థానాన్ని కోల్పోయి, దిక్కుతోచక ఏదో ఒక నీచ స్థానంలో
గుమికూడి, దుఃఖంతో దీనులై ముఖాలు
చిన్నబోసుకున్నట్లుగా ఉంది.
విశేషాలు
మల్లినాథుని అమరకోశ వివరణ ప్రకారం 'సామి' అనగా సగము లేదా
జుగుప్స అనే అర్థాలు ఉన్నాయి. ఇక్కడ సగము అని అర్థం. ఈ శ్లోకంలో కిరణ సమూహానికి
మరియు ఆశ్రిత జనులకు (సేవకులకు) మధ్య శ్లేషాత్మకమైన పోలిక ఉంది. 'ముక్తమూల' అనగా కిరణాలకు
ఆశ్రయమైన సూర్యుడు, సేవకులకు స్వామి. 'ఉజ్ఝితపూర్వ' అనగా కిరణాలకు
తూర్పుదిక్కు, సేవకులకు పూర్వమున్న హితులు. 'పశ్చిమ నభస్సు' అనగా పడమటి ఆకాశం, సేవకులకు నీచ
స్థానం. ఇలా ప్రస్తుతమైన కిరణాల విశేషణాల సామ్యం చేత అప్రస్తుతమైన ఆశ్రిత జనుల
వృత్తాంతం స్ఫురించడం వల్ల ఇక్కడ 'సమాసోక్తి అలంకారం' లభిస్తుంది.
అంతేకాక, అచేతనమైన కిరణ సమూహానికి చేతనత్వమును ఆపాదించి, దుఃఖితుడైన వాని
వలె అని ఊహించడం వల్ల 'ఉత్ప్రేక్షా అలంకారం' కూడా ఉంది. ఈ
సమాసోక్తి, ఉత్ప్రేక్షలు ఒకదానికొకటి అంగాంగిభావంతో కలిసి
ఉండడం వల్ల 'అంగాంగిభావ సంకర అలంకారం' అవుతుంది.
నవమ సర్గ శ్లోకం 06
కాంతదూత్య ఇవ కుఙ్కుమతామ్రాః సాయమండనమభి
త్వరయంత్యః ।
సాదరం దదృశిరే వనితాభిః సౌధజాలపతితా
రవిభాసః ॥
ప్రతిపదార్థం
కుఙ్కుమతామ్రాః = కుంకుమ వలె
ఎర్రనైనట్టియు, సాయమండనం అభి = సాయంకాలపు అలంకరణను గూర్చి, త్వరయంత్యః =
తొందరపెట్టునట్టియు, సౌధజాలపతితాః = భవనముల యొక్క కిటికీల గుండా లోపల
పడినట్టి, రవిభాసః = సూర్యకిరణములు, కాంతదూత్యః ఇవ =
ప్రియుల పంపిన దూతికల వలె, వనితాభిః = స్త్రీల చేత, సాదరం = ఆదరముతో
కూడుకొనునట్లుగా, దదృశిరే = చూడబడినాయి.
తాత్పర్యం
కుంకుమ వలె ఎర్రగా ఉండి, భవనాల కిటికీల గుండా లోపలికి
ప్రవేశించిన సాయంకాలపు సూర్యకిరణాలను అక్కడి స్త్రీలు ఎంతో ఆదరంతో చూశారు. ఆ
కిరణాలు వారికి సాయంకాలపు అలంకారాలు త్వరగా ముగించుకోమని తొందరపెడుతున్నట్లుగా, ప్రియుడు పంపిన దూతికల వలె భాసించాయి.
విశేషాలు
మల్లినాథసూరి అమరకోశం మరియు వైజయంతీ కోశాల ఆధారంగా పదాలను స్పష్టం చేశారు. అమరకోశం
ప్రకారం 'సాయం,
సాయే, ప్రగే, ఆతః' అనే పదాలు కాల
విశేషాలను తెలుపుతాయి. వైజంతీ కోశం ప్రకారం 'జాలం గవాక్ష ఆనాయే' - అనగా
జాలము అంటే కిటికీ (గవాక్షము) లేదా వల అని అర్థాలు ఉన్నాయి. ఇక్కడ సౌధజాలము అంటే
భవనపు కిటికీలు. సాయంకాలపు ఎర్రటి సూర్యకిరణాలు కిటికీల గుండా రావడం ప్రసిద్ధం. ఆ
కిరణాలు రాగానే రాత్రి కాబోతుందని గ్రహించి, స్త్రీలు తమ
ప్రియుల సమాగమం కోసం త్వరత్వరగా అలంకరించుకోవడం ప్రారంభిస్తారు. ఆ కిరణాలు ప్రియ సమాగమాన్ని సూచించేవి కావడం వల్లే, స్త్రీలకు ఆ కిరణాల
పట్ల అంతటి ఆదరము, ప్రేమ కలిగాయని మల్లినాథుని వివరణాంశం. ఇక్కడ
కిరణాలను కాంత దూతికలుగా ఊహించడం వల్ల 'ఉత్ప్రేక్షా
అలంకారం' మనోహరంగా కుదిరింది.
నవమ సర్గ శ్లోకం 07
అగ్రసానుషు
నితాంతపితంగైర్భూరుహాన్మృదుకరైరవలంబ్య ।
అస్తశైలగహనం ను వివస్వానావివేశ జలధిం ను
మహీం ను ॥
ప్రతిపదార్థం
వివస్వాన్ = సూర్యుడు, అగ్రే =
ఎదురుగానున్న, అస్తశైల = అస్తమయ పర్వతము యొక్క, సానుషు =
శిఖరములందు, భూరుహాన్ = వృక్షములను, నితాంతపితంగైః =
మిక్కిలి ఎర్రనైనట్టియు, మృదుకరైః = కోమలములైన కిరణములను (చేతులను), అవలంబ్య = లఘువుగా
(సడలిపోయేటట్లు) పట్టుకొని, అస్తశైలగహనం ను = ఆ అస్తమయ పర్వతము యొక్క అడవిలో
ప్రవేశించెనో, జలధిం ను = సముద్రములో ప్రవేశించెనో, మహీం ను = భూమిలో
ప్రవేశించెనో, ఆవివేశ = ప్రవేశించెను (తెలియరాకుండా ఉంది).
తాత్పర్యం
సూర్యుడు అస్తాద్రి శిఖరాలపై ఉన్న చెట్లను
తన ఎర్రని, మృదువైన కిరణాలనే చేతులతో పట్టుకుని క్రిందికి
జారాడు. ఆ జారే వేగం ఎంత త్వరగా జరిగిందంటే, ఆయన ఆ అస్తమయ
పర్వతారణ్యంలో ప్రవేశించాడో, సముద్రంలో మునిగాడో లేదా భూమిలోకి వెళ్ళిపోయాడో
ఎవరికీ తెలియలేదు.
విశేషాలు
మల్లినాథసూరి ఘంటాపథ వ్యాఖ్యానం ప్రకారం
ఇక్కడ సూర్యుని కిరణాలను చేతులుగా వర్ణించడం వల్ల శ్లిష్ట రూపకం ఉంది. అమరకోశం
ప్రకారం 'కరాః'
అనే పదానికి పన్ను, చేయి, కిరణము అనే అర్థాలు
ఉన్నాయి. అలాగే 'అస్తః'
అంటే పడమటి పర్వతం (చరమక్ష్మాభృత్) అని
అమరకోశం చెప్తోంది. సూర్యుడు అస్తమించేటప్పుడు కింద పడటం అనేది స్పష్టంగా
కనిపిస్తోంది కానీ, ఆయన వేగం వల్ల ఆ పతనం అడవిలోనా, సముద్రంలోనా లేక
భూమిపైనా అనేది నిశ్చయించలేకపోతున్నారు. ఇలా ఆరోపించబడే పతనానికి గహనాది అనేక
విషయాలు ఉండడం చేత ఇక్కడ 'సందేహ అలంకారం' సిద్దించింది.
నవమ సర్గ శ్లోకం 08
ఆకులశ్చలపతత్రికూలానామరావైరనుదితౌషసరాగః ।
ఆయయావహరిదశ్వవిపాండుస్తుల్యతాం దినముఖేన
దినాంతః ॥
ప్రతిపదార్థం
దినాంతః = సాయంకాలము, చలపతత్రికూలానాం =
తమ గూళ్ళ వైపునకు కదులుచున్న పక్షుల సమూహముల యొక్క, ఆరావైః = ధ్వనుల
చేత, ఆకులః = వ్యాప్తమైనట్టియు, అనుదితౌషసరాగః =
పుట్టనట్టి సంధ్యా రాగము కలిగినట్టియు (అనగా అస్తమించిపోయిన సంధ్యా రాగము కలదై), అహరిదశ్వవిపాండుః =
సూర్యుడు లేకపోవుట చేత తెల్లబారినట్టియు (చీకటి ఇంకా పూర్తిగా రాకపోవుట చేత పాండుర
వర్ణము కలదై), దినముఖేన = ప్రాతఃకాలముతో, తుల్యతాం =
సమానత్వమును, ఆయయౌ = పొందెను.
తాత్పర్యం
సాయంకాల సమయాన పక్షులన్నీ తమ గూళ్ళకు
చేరుకుంటూ కలకలధ్వనులు చేస్తున్నాయి. ఆ సమయంలో సంధ్యా రాగం అంతరించిపోయింది, సూర్యుడు కూడా
అస్తమించాడు. చీకటి ఇంకా పూర్తిగా ముసురుకోకపోవడం వల్ల ఆకాశం తెల్లగా, వెలవెలబోతూ ఉంది. ఈ
సాయంకాలం, పక్షుల ధ్వనులతో కూడి, సూర్యుడు ఇంకా
ఉదయించక, ఎరుపు రంగు ఇంకా రాక తెల్లగా ఉండే ఉదయకాలంతో
(ప్రాతఃకాలంతో) సమానత్వాన్ని పొందింది.
విశేషాలు
మల్లినాథుని వ్యాకరణ వివరణ ప్రకారం 'ఔషస' అనే పదం ఉషస్సునందు
పుట్టినది అనే అర్థంలో 'సంధివేలా' అనే సూత్రం యొక్క
యోగవిభాగం చేత అణ్ ప్రత్యయం రాగా ఏర్పడింది. లేకుంటే కాలాత్ ఠఞ్ ప్రత్యయం వచ్చేది.
'అనుదితౌషసరాగః' అంటే ఒకచోట సంధ్యా
రాగం నశించడం, ఇంకొకచోట ఇంకా ఉదయించకపోవడం అని అర్థం. 'అహరిదశ్వః' అనగా సూర్యుడు లేని
కాలం. ఇక్కడ సాయంకాలానికి, ప్రాతఃకాలానికి (దినముఖానికి) పక్షి ధ్వనులు, సూర్యుడు లేకపోవడం, ఎరుపు రంగు
లేకపోవడం అనే గుణాల వల్ల స్పష్టమైన పోలిక చెప్పబడింది కాబట్టి ఇది 'ఉపమా అలంకారం' అవుతుంది.
నవమ సర్గ శ్లోకం 09
ఆస్థితః స్థగితవారిదపంక్త్యా సంధ్యయా
గగనపశ్చిమభాగః ।
సోర్మివిద్రుమవితానవిభాసా రంజితస్య జలధేః
శ్రియమూహే ॥
ప్రతిపదార్థం
స్థగితవారిదపంక్త్యా = కప్పబడిన మేఘముల
గుంపు కలిగినట్టియు, సంధ్యయా = సంధ్యా కాలము చేత, ఆస్థితః =
ఆక్రమించబడిన (వ్యాపించబడిన), గగనపశ్చిమభాగః = పశ్చిమ ఆకాశ భాగము, సోర్మివిద్రుమవితానవిభాసా
= తరంగములతో కూడిన ప్రవాళముల (పగడముల) సమూహము యొక్క కాంతి చేత, రంజితస్య =
ఎర్రదనము ఆపాదించబడిన, జలధేః = సముద్రము యొక్క, శ్రియం = శోభను, ఊహే = వహించెను.
తాత్పర్యం
పశ్చిమ ఆకాశం మేఘాల గుంపులతో కప్పబడి, సాయంకాలపు ఎర్రని
సంధ్యతో నిండిపోయింది. ఆ సమయంలో ఆకాశం ఎలా ఉందంటే, ఎగసిపడుతున్న
తరంగాలపై పగడాల సమూహం యొక్క ఎర్రని కాంతులు ప్రతిఫలించడం వల్ల అద్భుతమైన ఎరుపు
రంగును సంతరించుకున్న సముద్రం వలె ప్రకాశించింది.
విశేషాలు
మల్లినాథుని వ్యాఖ్యానం ప్రకారం సంధ్య
అనేది ఎర్రగా ఉండడం వల్ల ఆకాశానికి ఎరుపు రంగు వచ్చింది. 'ఊహే' అనే పదం వహించు
ధాతువుకు కర్తరి లిట్ రూపం, అనగా 'అట్టి శోభను వహించెను' అని అర్థం. ఆకాశం
తన రూపం ద్వారా సముద్రపు శోభను ప్రతిబింబింపజేస్తోంది. ఇలా ఒక వస్తువు యొక్క
ధర్మాన్ని మరొక వస్తువునందు ఆరోపించి,
వాటి పరస్పర సాదృశ్యాన్ని ప్రదర్శించడం
వల్ల ఇక్కడ 'నిదర్శనా అలంకారం' నిరూపించబడింది.
నవమ సర్గ శ్లోకం 10
ప్రాంజలావపి జనే నతమూర్ధ్ని ప్రేమ
తత్ప్రవణచేతసి హిత్వా ।
సంధ్యయానువిదధే విరమంత్యా చాపలేన
సుజనేతరమైత్రీ ॥
ప్రతిపదార్థం
ప్రాంజలౌ అపి = దోసిలి ఒగ్గి
నమస్కరించుచున్నట్టియు, నతమూర్ధ్ని = వంగిన శిరస్సు కలిగినట్టియు, తత్ప్రవణచేతసి = ఆ
సంధ్యపైనే లగ్నమైన మనస్సు కలిగినట్టి,
జనే = జనుల యెడల, ప్రేమ = అనురాగమును, హిత్వా =
విడిచిపెట్టి, విరమంత్యా = అంతరించిపోవుచున్న (తొలగిపోవుచున్న), సంధ్యయా =
సంధ్యాదేవి చేత, చాపలేన = అస్థిరత్వము (చంచలత్వము) చేత, సుజనేతరమైత్రీ =
దుర్జనుని యొక్క స్నేహము, అనువిదధే = అనుకరించబడెను.
తాత్పర్యం
సంధ్యాసమయంలో జనులు చేతులు
జోడించి, తలలు వంచి, ఎంతో భక్తితో ఆ సంధ్యాదేవినే
ధ్యానిస్తున్నారు. అయినా ఆ సంధ్య వారిపై ఉన్న ప్రేమను వదిలేసి చంచలత్వంతో
కొద్దిసేపటికే అంతరించిపోయింది. ఈ ప్రవర్తన ఎలా ఉందంటే, ఎంతో స్నేహంగా ఉంటూ, తలవంచి సేవించే హితులను కూడా క్షణంలో
విడిచిపెట్టి వెళ్ళిపోయే దుర్జనుడి (చెడ్డవాని) స్నేహం వలె ఉంది.
విశేషాలు
మల్లినాథసూరి అమరకోశం ఆధారంగా 'ప్రాంజలి' అనగా చేతులు
జోడించడం (తౌ యుతావంజలిః పుమాన్) అని వివరించారు. వ్యాకరణ రీత్యా 'విరమంత్యా' అనే రూపంలో 'వ్యాపరిభ్యో రమః' అనే సూత్రం ప్రకారం
పరస్మైపదం వచ్చింది. 'చాపలము' అనగా అస్థిరత్వం, ఇది యువాది గణము
నుండి అణ్ ప్రత్యయం రాగా ఏర్పడింది. 'మైత్రీ' అనగా మిత్రుని
యొక్క కర్మ (స్నేహము). ఇక్కడ సంధ్యకు మరియు దుర్జనుడి స్నేహానికి ఉన్న 'చాపలము' (అస్థిరత్వము)
అనే సమాన ధర్మాన్ని బట్టి, సంధ్య దుర్జన మైత్రిని అనుకరించింది అని చెప్పడం
వల్ల ఇక్కడ 'అర్థరూప ఉపమా అలంకారం' వ్యక్తమయింది.
దుర్జనుని స్నేహం ఎలాగైతే ఎంతగా ప్రేమించేవాడినైనా విడిచిపెడుతుందో, సంధ్య కూడా తమ్ము
సేవించే భక్తులను అలాగే విడిచిపెట్టిందని మల్లినాథుని అంతరార్థం.
నవమ సర్గ శ్లోకం 11
ఔషసాతపభయాదుపలీనం వాసరచ్ఛవివిరామపటీయః ।
సన్నిపత్య శనకైరివ నినాదంధకారముదద్వాప
సమాని ॥
ప్రతిపదార్థం
ఔషస-ఆతప-భయాత్ = ఉదయకాలపు ఎండ వలన కలుగు
భయము వలన, ఉపలీనం ఇవ = ఎక్కడో ఒకచోట దాక్కున్నదో
అన్నట్లున్నట్టియు, వాసరచ్ఛవి-విరామ-పటీయః = పగటి కాంతి (ఎండ)
అంతరించుట అనే కారణము చేత మిక్కిలి సమర్థవంతమైనట్టియు (బలపడినట్టియు), అంధకారం = చీకటి, శనకైః =
మెల్లమెల్లగా, సన్నిపత్య = పల్లపు ప్రాంతముల నుండి పైకి వచ్చి, సమాని = సమభూములను
(సమతలములను), ఉదద్వాప = వ్యాపించెను.
తాత్పర్యం
ఉదయకాలపు సూర్యకాంతికి భయపడి ఎక్కడో
గుహల్లోనో, పొదల్లోనో దాక్కున్నదా అన్నట్లున్న చీకటి, సాయంకాలం కాగానే
పగటి కాంతి అంతరించడం వల్ల మరింత బలపడింది. ఆ చీకటి మొదట పల్లపు ప్రాంతాలలో ఏర్పడి, ఆ తర్వాత
మెల్లమెల్లగా పైకి వస్తూ భూమిపై ఉన్న సమతలాలన్నింటినీ పూర్తిగా ముంచెత్తి
వ్యాపించింది.
విశేషాలు
మల్లినాథసూరి ఘంటాపథ వ్యాఖ్యానంలో దీని
అలంకార వైచిత్రిని చక్కగా వివరించారు. అమరకోశం ప్రకారం 'అంధం
కరోతీత్యంధకారమ్' - అనగా కంటికి చూపు లేకుండా చేసేదే అంధకారము లేదా
ధ్వాంతము. 'పటీయః'
అంటే మరింత సమర్థవంతమైనది లేదా
ప్రభావితమైనది అని అర్థం. ఇక్కడ ప్రస్తుతమైన చీకటి యొక్క ప్రవర్తనను వర్ణిస్తూ, దానికి శ్లేష
రూపంలో ఒక భయపడే స్వభావం గల శత్రువు లేదా ప్రాణి యొక్క వృత్తాంతాన్ని ఆపాదించడం
జరిగింది. ఇలా ప్రస్తుత వస్తువు యొక్క విశేషణ సామ్యము చేత అప్రస్తుతార్థం
స్ఫురించడం వల్ల ఇక్కడ 'సమాసోక్తి అలంకారం' అవుతుంది. అలాగే, ఉదయపు ఎండకు భయపడి
దాక్కుంది అని ఊహించడం వల్ల 'ఉత్ప్రేక్షా అలంకారం' కూడా ఉంది. అయితే ఈ
ఉత్ప్రేక్ష ఇక్కడ సమాసోక్తికి అంగముగా (సహాయకారిగా) నిలుస్తుంది.
నవమ సర్గ శ్లోకం 12
ఏకతామివ గతస్య వివేకః కస్యచిన్న
మహతోప్యుపలేభే ।
భాస్వతా నిదధిరే భువనానామాత్మనీవ పతితేన
విశేషాః ॥
ప్రతిపదార్థం
ఏకతాం = అభేదమును (ఒక్కటిగా అగుటను), గతస్య ఇవ =
పొందినదో అన్నట్లు ఉన్నట్టి, మహతః అపి = మిక్కిలి పెద్దదైన పర్వతాది పదార్థముల
యొక్క కూడా, కస్యచిత్ = ఏ ఒక్కదాని యొక్క, వివేకః = భేదము
(గుర్తింపు), న ఉపలేభే = గ్రహించబడలేదు, [అందువలన
ఊహించబడుచున్నది] = అస్తమించినట్టి,
భాస్వతా = సూర్యుని చేత, భువనానాం =
లోకములోని సమస్త పదార్థముల యొక్క, విశేషాః = ఆయా రూప భేదములు, ఆత్మని ఏవ = తనయందే, నిదధిరే ఇవ =
దాచబడినవో అన్నట్లుగా ఉన్నది.
తాత్పర్యం
చీకటి దట్టంగా ముసురుకోవడం వల్ల లోకంలోని
సమస్త పదార్థాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఏకత్వాన్ని పొందినట్లు ఉన్నాయి. ఎంతటి
పెద్ద పర్వతాలైనా వాటి మధ్య గల తేడాను గుర్తించడం ఎవరికీ సాధ్యపడలేదు. ఇది
చూస్తుంటే, అస్తమించిన సూర్యుడు లోకంలోని సమస్త వస్తువుల
యొక్క రూప భేదాలను తనతోపాటే తనలోనే దాచుకుని వెళ్ళిపోయాడా అన్నట్లుగా ఉంది; లేకపోతే ఆ భేదాలు
మనకు ఎందుకు కనిపించవు అని భావం.
విశేషాలు
మల్లినాథుని వివరణ ప్రకారం అమరకోశంలో 'భాస్వాన్, వివస్వాన్, సప్తాశ్వః' అనేవి సూర్యునికి
పేర్లు. 'భువనానామ్' అనగా భువనము నందలి
పదార్థములు అని అర్థం. చీకటి వల్ల లోకమంతా ఒక్కటిగా కనిపించడాన్ని 'ఏకతామివ గతస్య' అని ఊహించడం మొదటి
ఉత్ప్రేక్ష. సూర్యుడు సమస్త భేదాలను తనలోనే దాచుకున్నాడని ఊహించడం రెండవ
ఉత్ప్రేక్ష. ఇక్కడ ఒకే జాతీయానికి చెందిన (సజాతీయ) రెండు ఉత్ప్రేక్షలు ఒకదానికొకటి
ఆపేక్ష కలిగి, అంగాంగిభావంతో ఉండడం చేత 'సజాతీయ అంగాంగిభావ
సంకర అలంకారం' ఏర్పడింది.
నవమ సర్గ శ్లోకం 13
ఇచ్ఛతాం సహ వధూభిరభేదం యామినీవిరహిణాం
విహగానామ్ ।
ఆపురేవ మిథునాని వియోగం లంఘ్యతే న ఖలు
కాలనియోగః ॥
ప్రతిపదార్థం
వధూభిః సహ = తమ ప్రియురాళ్ళతో (ఆడ
పక్షులతో) కలిసి, అభేదం = వియోగము లేని స్థితిని (ఒకేగా ఉండుటను), ఇచ్ఛతాం అపి =
కోరుకుంటున్నప్పటికినీ, యామినీవిరహిణాం = రాత్రి సమయములందు నియమితముగా
విరహమును పొందేడి, విహగానాం = పక్షుల యొక్క (చక్రవాకముల యొక్క), మిథునాని = జంటలు, వియోగం = ఎడబాటును, ఆపుః ఏవ = పొంది
తీరినవి, ఖలు = ఇది నిజము, కాలనియోగః = కాలము
యొక్క శాసనము (దైవ నిర్ణయము), న లంఘ్యతే = దాట శక్యము కానిది.
తాత్పర్యం
తమ కామినులతో ఎల్లప్పుడూ కలిసి
ఉండాలని, ఎడబాటు కలగకూడదని ఎంతో బలంగా
ఆకాంక్షించినప్పటికీ, రాత్రి కాగానే విడిపోవాలనే శాసనం ఉన్న
చక్రవాక పక్షుల జంటలు వియోగాన్ని పొంది తీరాయి. ఎందుకంటే, కాలము యొక్క నిర్ణయాన్ని లేదా దైవ
శాసనాన్ని ఎదిరించడం ఎవరికీ సాధ్యం కాదు కదా!
విశేషాలు
మల్లినాథసూరి వ్యాకరణ రీత్యా 'విరహిణామ్' అనే పదం 'రహ్' (విడుచుట)
అనే ధాతువుకు తచ్ఛీల లేదా ఆవశ్యకార్థంలో 'ణినీ' ప్రత్యయం రాగా
ఏర్పడిందని, లేదా నిందార్థంలో 'ఇని' ప్రత్యయం రాగా
ఏర్పడిందని వివరించారు. ఇక్కడ 'ఆపురేవ' అనే పదప్రయోగం
ద్వారా అయోగవ్యవచ్ఛేదము (కలవకపోవడం అనేది ఖాయం అని) చెప్పబడింది. చక్రవాక పక్షులు
రాత్రి వేళ విడిపోవడం అనేది కవి సమయ ప్రసిద్ధం. 'కాలనియోగః న
లంఘ్యతే' అనే సామాన్య వాక్యం చేత, చక్రవాక జంటలు
వియోగాన్ని పొందడం అనే విశేషాంశం సమర్థించబడడం వల్ల ఇక్కడ 'అర్థాంతరన్యాస
అలంకారం' స్ఫురిస్తోంది (వ్యాఖ్యానంలో దైవాజ్ఞ
దుర్వారమైనదని మల్లినాథులు స్పష్టం చేశారు).
నవమ సర్గ శ్లోకం 14
యచ్ఛతి ప్రతిముఖం దయితాయై వాచమంతికగతేపి
శకుంతౌ |
తీయతే స్మ నతిముజ్ఝితహర్షం పంకజం
ముఖమివాంబురుహిణ్యా ॥
ప్రతిపదార్థం
శకుంతౌ = చక్రవాక పక్షి, అంతికగతే అపి =
అత్యంత సమీపములో ఉన్నప్పటికినీ, దయితాయై = తన ప్రియురాలికి, ప్రతిముఖం =
అభిముఖముగా (ఎదురుగా), వాచం = ధ్వనిని (మాటను), యచ్ఛతి సతి =
ఇచ్చుచున్నప్పటికినీ (పలుకుచున్నప్పటికినీ), అంబురుహిణ్యా =
పద్మలత చేత, ఉజ్ఝితహర్షం = విడిచిపెట్టబడిన వికాసము కలిగినట్టి
(సంతోషము లేనట్టి), పంకజం = పద్మము, ముఖం ఇవ = ముఖము
వలె, నతిం = వంగుటను (నమ్రతను), నీయతే స్మ =
పొందించబడెను.
తాత్పర్యం
చక్రవాక పక్షి తన ప్రియురాలికి
చాలా దగ్గరగా ఉండి, ఆమె వైపు ముఖం పెట్టి ఆర్తిగా అరుస్తూ
పలుకరిస్తోంది (కానీ చీకటి వల్ల ఒకదానికొకటి కనిపించక కలవలేకపోతున్నాయి). ఆ
చక్రవాకముల దుర్దశను చూసి తట్టుకోలేకనో అన్నట్లు, పద్మలత
తన పద్మాన్ని సంతోషం లేని (ముడుచుకున్న), వంగిపోయిన
ముఖం లాగా క్రిందికి వాల్చింది.
విశేషాలు
మల్లినాథుని నిఘంటు వివరణ ప్రకారం 'శకుంత' అనగా పక్షి మరియు
ఇక్కడ ప్రకరణాన్ని బట్టి చక్రవాక పక్షి అని అర్థం; అమరకోశం ప్రకారం
శకుంతి, పక్షి,
శకుని, శకుంత, ద్విజ అనేవి
సమానార్థకాలు. 'యచ్ఛతి' అనేది 'పాఘ్రాధ్మా' అనే సూత్రం ప్రకారం
'దాణ్'
ధాతువుకు 'యచ్ఛ' ఆదేశం రాగా
ఏర్పడింది. 'తీయతే స్మ' అనే రూపంలో, 'నయతి' ధాతువు ద్వికర్మకం
కావడం వల్ల 'ప్రధానే కర్మణి లిట్' అనే నియమం ప్రకారం
ప్రధాన కర్మనందు లకారము వచ్చి ఈ రూపం సిద్దించింది. లోకంలో
స్త్రీలు ఇతరుల దుఃఖాన్ని, ముఖ్యంగా
విరహ దుఃఖాన్ని చూసి తాము కూడా భరించలేక ముఖం దించేసుకుని బాధపడతారు. ఇక్కడ పద్మలత
కూడా కామినీ సమానంగా వర్ణించబడింది. పద్మము ముడుచుకుని వంగిపోవడానికి, చక్రవాకాల విలాపాన్ని చూసి దుఃఖించడమే
కారణమని ఊహించడం వల్ల ఇక్కడ 'ప్రతీయమాన
ఉత్ప్రేక్షా అలంకారం' ఉంది (వ్యంజక పదాలు లేవు). ఇది పద్మలతను కామినిగా స్ఫురింపజేసే 'ఉపమా' (ముఖము
వంటి పద్మము) తో కలిసి ఉండడం చేత 'ఉపమా ఉత్ప్రేక్షల అంగాంగిభావ సంకర అలంకారం' సిద్దించింది.
నవమ సర్గ శ్లోకం 15
రంజితా ను వివిధాస్తరుశైలా నామితం ను గగనం
స్థగితం తు ।
పూరితా ను విషమేషు ధరిత్రీ సంహృతా ను
కకుభస్తిమిరేణ ॥
ప్రతిపదార్థం
తిమిరేణ = చీకటి చేత, వివిధాః =
నానావిధములైన, తరుశైలాః = వృక్షములు మరియు పర్వతములు, రంజితాః ను = తమ
నలుపు రంగుతో సమానమైన రంగు కలవిగా చేయబడినవా ఏమి, గగనం = ఆకాశము, నామితం ను = భూమి
వరకు వంచబడినదా ఏమి, స్థగితం తు = లేదా కప్పివేయబడినదా ఏమి, ధరిత్రీ = భూమి, విషమేషు =
ఎత్తుపల్లములతో కూడిన ప్రాంతములందు,
పూరితా ను = నింపబడి సమము చేయబడినదా ఏమి, కకుభః = దిక్కులు, సంహృతాః ను = లయము
చేయబడినవా (నశింపజేయబడినవా) ఏమి.
తాత్పర్యం
దట్టమైన చీకటి సర్వత్రా ముసురుకుంది. ఆ
చీకటి నలుపు వల్ల చెట్లు, పర్వతాలు అన్నీ నల్లగా మారిపోయాయి. ఇది చూస్తుంటే, చీకటి ఆ వృక్ష
పర్వతాలకు తన రంగును పూసిందా అన్నట్లుంది. ఆకాశం భూమి వరకు వంగిందా లేదా పూర్తిగా
కప్పబడిందా అన్నట్లుంది. భూమిపై ఉన్న ఎత్తుపల్లాలన్నీ చీకటితో నిండిపోవడం వల్ల
సమతలంగా కనిపిస్తున్నాయి; అంటే చీకటి వాటిని పూడ్చివేసిందా అన్నట్లుంది.
దిక్కులు కూడా కనిపించకపోవడం వల్ల అవి నాశనమైపోయాయా అన్నట్లు తోచుచున్నది.
విశేషాలు
మల్లినాథసూరి ఘంటాపథ వ్యాఖ్యానంలో దీనిని
అద్భుతమైన సందేహాలంకారంగా నిరూపించారు. 'నామితమ్' అనే పదం
ఏర్పడేటప్పుడు 'మితాం హ్రస్వః' అనే సూత్రం ప్రకారం
హ్రస్వం రావలసి ఉన్నా, ఇక్కడ వాశబ్దానువృత్తి వల్ల వ్యవస్థిత విభాషను
ఆశ్రయించడం చేత హ్రస్వం రాలేదు. అమరకోశం ప్రకారం 'కకుభః' అంటే దిక్కులు
(దిశస్తు కకుభః కాష్ఠా ఆశాశ్చ హరితశ్చ తాః). ఇక్కడ వ్యాపించిన చీకటి యందు వృక్ష
పర్వతాలను రంజింపజేయడం, ఆకాశాన్ని వంచడం మొదలైన అనేక ధర్మాలను ఆరోపించి, ఏది నిజమో
తేల్చుకోలేక సందేహించడం వల్ల 'సందేహ అలంకారం' అవుతుంది.
అలంకారసర్వస్వకార అనే గ్రంథకర్త ప్రకారం, ఇక్కడ 'ను' అనే శబ్దాలు
సంభావనను (ఊహను) తెలియజేస్తూ ఉత్ప్రేక్షా ప్రకారాన్ని కూడా స్ఫురింపజేస్తున్నాయి.
నవమ సర్గ శ్లోకం 16
రాత్రిరాగమలినా ని వికాసం పంకజాని రహయంతి
విహాయ ।
స్పష్టతారకమియాయ నభః శ్రీర్వస్తుమిచ్ఛతి
నిరాపది సర్వః ॥
ప్రతిపదార్థం
నభఃశ్రీః = ఆకాశ లక్ష్మి (ఆకాశ శోభ), రాగమలివాని =
సంధ్యా కాలపు ఎరుపు రంగు లేదా రాత్రి రాక చేత నల్లబడినట్టియు, అత ఏవ = అందువల్లనే, వికాసం =
వికసించుటను, రహయంతి = విడిచిపెడుతున్నట్టి
(ముడుచుకుంటున్నట్టి), పంకజాని = పద్మములను, విహాయ = వదిలివేసి, స్పష్టతారకం =
స్పష్టముగా ప్రకాశిస్తున్న నక్షత్రములు కలిగిన, నభః = ఆకాశమును, ఇయాయ = పొందెను, [తథాహి
= అది ఎలాగనగా], సర్వః = సమస్త జనులు, నిరాపది = ఆపదలు
లేని (సురక్షితమైన) స్థానమునందు, వస్తుం = నివసించుటకు, ఇచ్ఛతి =
కోరుకుంటారు కదా.
తాత్పర్యం
రాత్రి రాకతో పద్మాలు తమ
వికాసాన్ని కోల్పోయి ముడుచుకుపోతున్నాయి, పైగా
సంధ్యా రాగం వల్ల మలినంగా మారుతున్నాయి. అందువల్ల లక్ష్మీదేవి (శోభ) ఆ పద్మాలను
విడిచిపెట్టి, నక్షత్రాలతో ప్రకాశిస్తూ నిర్మలంగా
ఉన్న ఆకాశంలోకి వెళ్ళిపోయింది. లోకంలో ఎవరైనా సరే, ఆపదలు
ఉన్న చోటును వదిలి ఆపదలు లేని సురక్షితమైన ప్రదేశంలో నివసించడానికే ఇష్టపడతారు
కదా.
విశేషాలు
మల్లినాథుని వ్యాకరణ వివరణ ప్రకారం 'రహయంతి' అనేది త్యాగార్థంలో
ఉన్న రహ ధాతువు నుండి శతృ ప్రత్యయం రాగా ఏర్పడింది. 'వస్తుమ్' అనే రూపంలో 'ఎకాచ
ఉపదేశేనుదాత్తాత్' అనే సూత్రం వల్ల ఇట్ ప్రతిషేధం (ఇట్ ఆగమం
రాకపోవడం) జరిగింది, అలాగే 'ఘసిశ్చ సాంతేషు
వసిః ప్రసారిణీ' అనే వచనం వల్ల సంప్రసారణం జరిగింది. ఇక్కడ లక్ష్మి
ఆపదలతో కూడిన పద్మాలను వదిలి ఆకాశాన్ని ఆశ్రయించడం అనే విశేష వృత్తాంతం 'లోకంలో ఎవరైనా
ఆపదలు లేని చోట నివసించాలనుకుంటారు'
అనే సామాన్య వాక్యం చేత సమర్థించబడింది
కాబట్టి ఇది 'అర్థాంతరన్యాస అలంకారం'.
నవమ సర్గ శ్లోకం 17
వ్యానశే శశధరేణ విముక్తః
కేతకీకుసుమకేసరపాండుః ।
చూర్ణముష్టిరివ లంభితకాంతిర్వాసవస్య
దిశమంశుసమూహః ॥
ప్రతిపదార్థం
శశధరేణ = చంద్రుని చేత, విముక్తః =
ప్రసరింపజేయబడినట్టియు, కేతకీకుసుమకేసరపాండుః = మొగలి పువ్వు యొక్క
కేసరముల వలె తెల్లనైనట్టియు, లంభితకాంతిః = అద్భుతమైన కాంతిని
పొందింపబడినట్టియు, అంశుసమూహః = కిరణముల గుంపు, చూర్ణముష్టిః ఇవ =
కర్పూరపు పొడి ముష్టి (పిడికిలి) వలె,
వాసవస్య = ఇంద్రుని యొక్క, దిశం = దిక్కును
(తూర్పు దిక్కును), వ్యానశే = వ్యాపించెను.
తాత్పర్యం
అస్తమయాది సంధ్యా వర్ణన ముగిసిన తర్వాత
చంద్రోదయం ప్రారంభమవుతోంది. చంద్రుని నుండి వెలువడిన కిరణాల సమూహం మొగలి పువ్వు
కేసరాల వలె ఎంతో తెల్లగా ప్రకాశిస్తోంది. ఆ తెల్లని కిరణాలు తూర్పు దిక్కున
వ్యాపించడం ఎలా ఉందంటే, ఇంద్రుని దిక్కైన తూర్పు దిక్కుపై ఎవరో కర్పూరపు
పొడిని గుప్పెడుతో చల్లినట్లుగా ఉంది.
విశేషాలు
మల్లినాథుని వివరణ ప్రకారం 'ముష్టి' అనే పదం ఉభయ
లింగాలలో (స్త్రీ, పుంలింగాలలో) ఉన్నప్పటికీ, ఇక్కడ ఉపమేయమైన 'అంశుసమూహః' అనే పుంలింగ
పదాన్ని అనుసరించి పుంలింగంగానే స్వీకరించబడింది. 'వాసవస్య దిశమ్' అనగా ఇంద్రునికి
అధిపత్యమైన తూర్పు దిక్కు (ప్రాచీ దిక్కు). ఇక్కడ కిరణ సమూహాన్ని కర్పూర చూర్ణ
ముష్టితో పోల్చడం వల్ల 'ఉపమాలంకారం' ఉంది. అంతేకాక, ఈ వర్ణన ద్వారా
తూర్పు దిక్కు అనే నాయికను, చంద్రుడు అనే నాయకుడు కాంతితో ముంచుతున్నాడనే
నాయికా-నాయక ఉపమానం (సమాసోక్తి ఛాయ) కూడా గమ్యమానమవుతోందని మల్లినాథులు సూచించారు.
నవమ సర్గ శ్లోకం 18
ఉజ్ఝతీ శుచమివాశు తమిస్రామంతికం వ్రజతి
తారకరాజే ।
దిక్ప్రసాదగుణమండనమూహే రశ్మిహాసవిశదం
ముఖమైంద్రీ ॥
ప్రతిపదార్థం
తారకరాజే = నక్షత్ర నాథుడైన చంద్రుడు, అంతికం = సమీపమునకు, వ్రజతి సతి =
వచ్చుచుండగా, ఐంద్రీ దిక్ = ఇంద్రుని సంబంధమైన తూర్పు దిక్కు, తమిస్రాం =
గాఢాంధకారమును, అనగా విరహదుఃఖమును, ఆశు = శీఘ్రముగా, ఉజ్ఝతీ ఇవ =
విడిచిపెడుతున్నదో అన్నట్లు, ప్రసాదగుణమండనం = ప్రసన్నత (నైర్మల్యము) అనే గుణమే
అలంకారముగా కలిగినట్టియు, రశ్మిహాసవిశదం = కిరణములనెడి చిరునవ్వు చేత
తెల్లనైన (ప్రకాశిస్తున్న), ముఖం = ముఖమును (అగ్రభాగమును), ఊహే = వహించెను.
తాత్పర్యం
నక్షత్రాధిపతియైన చంద్రుడు తన సమీపానికి
రాగానే, తూర్పు దిక్కు చీకటి అనే విరహ దుఃఖాన్ని వెంటనే
విడిచిపెట్టింది. చంద్ర కిరణాలనే చిరునవ్వుతో ఆ దిక్కు యొక్క ముఖం (అగ్రభాగం) ఎంతో
ప్రసన్నంగా, నిర్మలంగా ప్రకాశించింది.
విశేషాలు
మల్లినాథసూరి వైజయంతీ
కోశం ఆధారంగా 'తమిస్రా' అంటే గాఢాంధకారము
(తమిస్రా స్త్రీ ధ్వాంతనిశి నిశ్యంధతమసే న నా) అని వివరించారు. విశ్వకోశం ప్రకారం 'తారకం' అంటే నక్షత్రం.
ఇక్కడ 'ముఖమ్'
మరియు 'శుచమ్' అనే పదాలు శ్లిష్ట
పదాలు (రెండు అర్థాలు కలవి). తూర్పు దిక్కు చీకటిని వదలడాన్ని, ప్రియుడు దగ్గరకు
రాగానే నాయిక తన విరహ దుఃఖాన్ని వదిలేయడంతో పోల్చడం; కిరణాల ప్రకాశాన్ని
నాయిక చిరునవ్వుతో పోల్చడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ తూర్పు దిక్కుకు నాయికత్వము, చంద్రునికి
నాయకత్వము ఆపాదించబడడం వల్ల 'సమాసోక్తి' మరియు 'ఉత్ప్రేక్షా' అలంకారాల కలయిక
కనిపిస్తుంది.
నవమ సర్గ శ్లోకం 19
నీలనీరజనిభే హిమగౌరం శైలరుద్ధవపుషః
సితరశ్మేః ।
ఖే రరాజ నిపతత్కరజాలం వారిధేః పయసి
గాంగమివాంభః ॥
ప్రతిపదార్థం
శైలరుద్ధవపుషః = ఉదయాచల పర్వతము చేత
కప్పబడిన శరీరము (బింబము) కలిగిన, సితరశ్మేః = తెల్లని కిరణములు గల చంద్రుని యొక్క, నీలనీరజనిభే =
నల్లని కలువ పువ్వు (లేదా నల్లతామర) తో సమానమైన, ఖే = ఆకాశమునందు, నిపతత్ =
ప్రసరిస్తున్న, హిమగౌరం = మంచు వలె తెల్లనైన, కరజాలం = కిరణముల
సమూహము, వారిధేః = సముద్రము యొక్క, పయసి = నల్లని
నీటినందు, నిపతత్ = పడుచున్న, గాంగం అంభః ఇవ =
గంగా నది యొక్క తెల్లని ఉదకము వలె, రరాజ = ప్రకాశించెను.
తాత్పర్యం
ఉదయపర్వతం వెనుక చంద్రబింబం ఇంకా దాగి
ఉన్న సమయంలో, అతని తెల్లని కిరణాలు మాత్రం నల్లటి కలువ పువ్వు
లాగా ఉన్న ఆకాశంలోకి ప్రసరించాయి. నల్లని ఆకాశంలో ఆ తెల్లని కిరణాలు వ్యాపించడం
ఎలా ఉందంటే, నీలి సముద్రపు నీటిపై తెల్లని గంగానది ప్రవాహం
వచ్చి పడుతున్నట్లుగా అత్యంత మనోహరంగా ప్రకాశించింది.
విశేషాలు
మల్లినాథుని వివరణ ప్రకారం ఇక్కడ
ఉపమానానికి చెప్పబడిన విశేషణాలన్నీ ఉపమేయానికి కూడా అన్వయించుకోవాలి. 'సితరశ్మిః' అనగా చంద్రుడు.
ఆకాశం నల్లగా ఉండడం వల్ల దానికి 'నీలనీరజనిభే' (నీలి తామర వంటిది)
అని, సముద్రపు నీటికి కూడా ఆ నలుపు అన్వయిస్తుంది.
చంద్రకిరణాల తెల్లదనానికి గంగా నది నీటి తెల్లదనం (హిమగౌరమ్) ఉపమానంగా
చెప్పబడింది. నల్లని ఆకాశంలో తెల్లని కిరణాలు పడటాన్ని, నల్లని సముద్రంలో
తెల్లని గంగ నీరు కలవడంతో పోల్చడం వల్ల ఇక్కడ సంపూర్ణమైన 'ఉపమా అలంకారం' చక్కగా కుదిరింది.
నవమ సర్గ శ్లోకం 20
ద్యాం నిరుంధదతినీలఘనాభం ధ్వాంతముద్యతకరేణ
పురస్తాత్ ।
క్షిప్యమాణమసితేతరభాసా శంభునేవ కరిచర్మ
చకాసే ॥
ప్రతిపదార్థం
పురస్తాత్ = తూర్పు దిక్కున, ద్యాం = ఆకాశమును, నిరుంధత్ =
ఆవరించుచున్నట్టియు, అతినీలఘనాభం = మిక్కిలి నల్లనైన మేఘము వలె
ఉన్నట్టియు, ధ్వాంతం = చీకటి, ఉద్యతకరేణ
= పైకి లేచిన కిరణములు కలిగినట్టియు,
అసితేతరభాసా = నలుపు కాని కాంతి (అనగా
తెల్లని కాంతి) కలిగిన చంద్రుని చేత,
క్షిప్యమాణం = తొలగించబడుచున్నదై
(నెట్టబడుచున్నదై), ఉద్యతకరేణ = పైకెత్తబడిన హస్తములు కలిగినట్టియు, అసితేతరభాసా =
తెల్లని శరీర కాంతి కలిగినట్టియు, శంభునా = శివుని చేత, క్షిప్యమాణం =
విదల్చబడుచున్న (కదల్చబడుచున్న), కరిచర్మ ఇవ = గజాసురుని చర్మము వలె, చకాసే =
ప్రకాశించెను.
తాత్పర్యం
ఆకాశాన్ని ఆవరించి, దట్టమైన నల్లని
మేఘం వలె ఉన్న చీకటిని, ఉదయిస్తున్న చంద్రుడు తన తెల్లని కిరణాలతో తూర్పు
దిక్కున దూరం చేస్తున్నాడు. ఆ సమయంలో ఆ నల్లని చీకటి ఎలా ఉందంటే, తెల్లని శరీర కాంతి
గల పరమశివుడు తన చేతులతో పైకెత్తి విదల్చుచున్న నల్లని ఏనుగు చర్మం (గజాసుర చర్మం)
వలె ప్రకాశించింది.
విశేషాలు
మల్లినాథుని వ్యాఖ్యానం ప్రకారం ఇక్కడ 'కర' శబ్దానికి కిరణము
మరియు చేయి అని; 'అసితేతరభాసా' అనే పదానికి నలుపు
కాని తెల్లని కాంతి అని రెండు అర్థాలు శ్లేష వల్ల లభిస్తాయి. ఉపమానమైన శివునికి
వర్తించే విశేషణాలన్నీ ఉపమేయమైన చంద్రునికి కూడా అన్వయమవుతాయి. శివుడు ఎత్తిన
చేతులతో నల్లని ఏనుగు చర్మాన్ని విదిల్చినట్లు, చంద్రుడు తన
కిరణాలతో నల్లని చీకటిని నెట్టివేస్తున్నాడు. చంద్రుని తెల్లదనానికి శివుని
తెల్లదనం, చీకటి నలుపునకు గజచర్మపు నలుపు ఇక్కడ ఉపమానాలు.
అందువల్ల ఇక్కడ 'ఉపమా అలంకారం' శ్లేషానుప్రాణితమై
అలరారుతోంది.
నవమ సర్గ శ్లోకం 21
అంతికాంతికగతేందువిసృష్టే జిహ్మతాం జహతి
దీధితి జాలే ।
నిఃసృతస్తిమిరభారనిరోధాదుచ్ఛ్వసన్నివ రరాజ
దిగంతః ॥
ప్రతిపదార్థం
అంతికాంతికగత-ఇందు-విసృష్టే = అత్యంత
సమీపమునకు వచ్చిన చంద్రుని చేత ప్రసరింపజేయబడిన, దీధితి జాలే = కిరణముల
సమూహము, జిహ్మతాం = సంకోచమును (వంకరతనమును), జహతి సతి =
వదిలిపెడుతుండగా (అనగా కిరణాలు తిన్నగా ప్రసరిస్తుండగా), తిమిరభార-నిరోధాత్
= చీకటి సమూహముల యొక్క అడ్డుకట్ట నుండి, నిఃసృతః = బయటపడిన, దిగంతః =
దిజ్మండలము (దిక్కుల చివరలు), ఉచ్ఛ్వసన్ ఇవ = హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నదో
అన్నట్లు, రరాజ = ప్రకాశించెను.
తాత్పర్యం
చంద్రుడు చాలా దగ్గరకు రావడం వల్ల ఆయన
కిరణాలు తమ సంకోచాన్ని వదిలి తిన్నగా,
తీక్షణంగా ప్రసరించాయి. దాంతో అంతవరకు
దట్టమైన చీకటి అనే బరువు చేత నలిగిపోయి, ఊపిరాడకుండా ఉన్న
దిగంతాలు (దిక్కులు) ఆ చీకటి పట్టు సడలగానే ఒక్కసారిగా బయటపడి, హాయిగా ఊపిరి
పీల్చుకుంటున్నాయా అన్నట్లుగా తెల్లగా ప్రకాశించాయి.
విశేషాలు
మల్లినాథసూరి వ్యాకరణ విశేషాలలో 'అంతికాంతిక' అనే పదం 'ప్రకారే గుణవచనస్య' అనే సూత్రం ప్రకారం
ద్విరుక్తి (రెండుసార్లు రావడం) చెందిందని వివరించారు. ఇది కర్మధారయ వద్భావం
పొందడం వల్ల సుప్ లుక్ జరిగి అంతికాంతిక అని అయింది, దీని అర్థం 'అత్యంత సమీపము'. 'జిహ్మతామ్' అనగా వంకరతనము లేదా
సంకోచము. దట్టమైన చీకటి తొలగి చంద్రకిరణాలు ప్రసరించినప్పుడు దిక్కులు
ప్రకాశించడాన్ని, శత్రువుల అణచివేత లేదా బరువు నుండి విముక్తుడైన
వాడు హాయిగా దీర్ఘశ్వాస (ఊపిరి) పీల్చుకోవడంతో పోల్చి, అలా ఊహింపబడడం వల్ల
ఇక్కడ 'ఉత్ప్రేక్షా అలంకారం' ఎంతో రమణీయంగా
వ్యక్తమయింది.
నవమ సర్గ శ్లోకం 022
లేఖయా విమలవిద్రుమభాసా సంతతం
తిమిరమిందురుదాసే ।
దంష్ట్రయా కనకటెంకపిశంగయా మండలం భువ
ఇవాదివరాహః ॥
ప్రతిపదార్థం
ఇందుః = చంద్రుడు, విమలవిద్రుమభాసా =
స్వచ్ఛమైన పగడము యొక్క కాంతి వంటి కాంతి కలిగిన, లేఖయా = తన కళ చేత
(రేఖ చేత), సంతతం = దట్టమైన, తిమిరం = చీకటిని, ఆదివరాహః =
ఆదివరాహమూర్తి, కనకటెంకపిశంగయా = బంగారమును ఛేదించే టంకము (ఉలి)
వలె ఎర్రనైన (గోరోచన వర్ణము గల), దంష్ట్రయా = కోర చేత, భువః మండలం ఇవ =
భూమండలమును వలె, ఉదాసే = పైకి ఎత్తెను (నెట్టివేసెను).
తాత్పర్యం
ఉదయిస్తున్న చంద్రుడు స్వచ్ఛమైన పగడపు
రంగులో మెరిసిపోతున్న తన తొలి కళ (రేఖ) ద్వారా లోకంలో దట్టంగా అలుముకున్న చీకటిని
పైకి నెట్టివేస్తున్నాడు. ఆ దృశ్యం ఎలా ఉందంటే, ప్రళయ కాలంలో
మునిగిపోయిన భూమండలాన్ని ఆదివరాహస్వామి (యజ్ఞ వరాహమూర్తి) బంగారాన్ని కత్తిరించే
పదునైన ఉలి వలె ఎర్రగా ప్రకాశించే తన కోరతో పైకి ఎత్తినట్లుగా ఉంది.
విశేషాలు
మల్లినాథసూరి ఘంటాపథ వ్యాఖ్యానంలో దీని పద
విశేషాలను చక్కగా వివరించారు. అమరకోశం ప్రకారం 'టంకః పాషాణదారణః' అనగా రాళ్ళను లేదా
లోహాలను ఛేదించే ఒక ఆయుధం (ఉలి). 'పిశంగయా' అనే స్త్రీలింగ
రూపం 'పిశంగాదుపసంఖ్యానమ్' అనే వ్యాకరణ నియమం
ప్రకారం ౙీప్ (ఈ) ప్రత్యయం చేరడం వల్ల ఏర్పడింది. 'ఉదాసే' అనేది అస్య
ధాతువుకు కర్తరి లిట్ రూపం; ఉపసర్గతో కూడిన అస్య ధాతువుకు ఆత్మనేపదం వికల్పంగా
వస్తుంది. చంద్రునికి ఆదివరాహమూర్తితో,
చంద్రకళకు వరాహ దంష్ట్రతో, చీకటికి భూమండలంతో
ఇక్కడ పోలిక చెప్పబడింది. అందువల్ల ఇక్కడ సంపూర్ణమైన 'ఉపమా అలంకారం' సిద్దించింది.
నవమ సర్గ శ్లోకం 023
దీపయన్నథ నభః కిరణౌధైః
కుంకుమారుణపయోధరగౌరః |
హేమకుంభ ఇవ పూర్వపయోధేరున్మమజ్జ
శనకైస్తుహినాంశుః ॥
ప్రతిపదార్థం
అథ = చంద్రోదయమైన తర్వాత, కుంకుమ-అరుణ-పయోధర-గౌరః
= కుంకుమ పూయడం వల్ల ఎర్రబడిన స్త్రీ చనుమొన వలె (లేదా కుంకుమ రంగు మేఘం వలె)
ఎర్రనైన కాంతి గల, తుహినాంశుః = చల్లని కిరణములు గల చంద్రుడు, కిరణౌధైః = తన
కిరణముల సమూహము చేత, నభః = ఆకాశమును, దీపయన్ =
ప్రకాశింపజేయుచు, పూర్వపయోధేః = తూర్పు సముద్రము నుండి, హేమకుంభః ఇవ =
బంగారు కలశము వలె, శనకైః = మెల్లమెల్లగా, ఉన్మమజ్జ = పైకి
లేచెను (ఉదయించెను).
తాత్పర్యం
చంద్రోదయం జరిగిన తర్వాత, ఉదయకాలపు ఎరుపు
వల్ల కుంకుమ పూసిన కాంత వక్షస్థలం వలె ఎర్రటి శోభతో ఉన్న చంద్రుడు తన కిరణాలతో
ఆకాశాన్ని వెలిగిస్తున్నాడు. ఆ చంద్రబింబం తూర్పు సముద్రం నుండి మెల్లమెల్లగా పైకి
రావడం ఎలా ఉందంటే, సముద్ర గర్భం నుండి ఒక బంగారు కుంభం (కలశం)
మెల్లగా పైకి తేలుతున్నట్లుగా ఉంది.
విశేషాలు
మల్లినాథుని వ్యాఖ్యానం ప్రకారం చంద్రుని
ఉదయకాలపు ఎరుపును 'పయోధర గౌరః' అని వర్ణించారు.
ఇక్కడ పయోధర అంటే మేఘము లేదా స్త్రీ వక్షస్థలము అని అర్థాలు వస్తాయి. సముద్రం
నుండి చంద్రుడు పైకి రావడాన్ని నీటి నుండి బంగారు కలశం పైకి రావడంతో సంభావించడం
(ఊహించడం) జరిగింది. అందువల్ల ఇక్కడ 'ఉత్ప్రేక్షా అలంకారం' ఎంతో మనోహరంగా
వ్యక్తమయింది.
నవమ సర్గ శ్లోకం 024
ఉన్నతేందుమవిభిన్నతమిస్రాం పశ్యతి స్మ
రజనీమవితృప్తః ।
వ్యంశుకస్ఫుటముఖీమతిజిహ్మాం బ్రీడయా
నవవధూమివ లోకః ॥
ప్రతిపదార్థం
లోకః = జనులు, ఉద్గతేందుం =
ఉదయించిన చంద్రుడు కలిగినట్టియు, [అయినప్పటికినీ] = అవిభిన్నతమిస్రాం = పూర్తిగా
నశించని చీకటి కలిగినట్టియు, రజనీం = రాత్రిని, వ్యంశుక-స్ఫుట-ముఖీం
= తొలగించబడిన కొంగు (అవగుంఠనము) కలదగుట చేత స్పష్టముగా కనిపించుచున్న ముఖము
కలిగినట్టియు, తథాపి = అయినప్పటికినీ, బ్రీడయా = సిగ్గు
చేత, అతిజిహ్మాం = మిక్కిలి వంగిన (తల దించుకున్న), నవవధూం ఇవ = నవోఢ
అయిన కొత్త పెళ్ళికూతురిని వలె, అవితృప్తః సన్ = తనివితీరనివాడై, పశ్యతి స్మ =
చూచుచుండెను.
తాత్పర్యం
చంద్రుడు ఉదయించాడు కానీ చీకటి ఇంకా
పూర్తిగా విడిపోలేదు. అటువంటి రాత్రిని లోకులు తనివితీరక ఆసక్తిగా చూస్తున్నారు. ఈ
దృశ్యం ఎలా ఉందంటే, పైటకొంగు తొలగిపోవడం వల్ల ముఖం స్పష్టంగా
కనిపిస్తున్నప్పటికీ, సిగ్గు పడుతూ తల వంచుకుని, ముఖాన్ని పక్కకు
తిప్పుకున్న కొత్త పెళ్ళికూతురిని ప్రియుడు లేదా జనులు తనివితీరకుండా
చూస్తున్నట్లుగా ఉంది.
విశేషాలు
మల్లినాథుని వివరణ ప్రకారం 'లోకః' అంటే లోకము లేదా
జనులు (లోకస్తు భువనే జనే) అని అమరకోశం చెప్తోంది. 'వధూ' శబ్దానికి నవోఢ
(కొత్తగా పెళ్ళైన స్త్రీ) అని ధరణి నిఘంటువు ఆధారంగా అర్థం చెప్పారు. ఇక్కడ
రాత్రికి నవవధువుతో పోలిక ఉంది. చంద్రోదయం వల్ల చీకటి కొద్దిగా తొలగడం అనేది
నవవధువు ముఖంపై నుండి కొంగు (ముసుగు) తొలగడం లాంటిది. ఇంకా చీకటి మిగిలి ఉండడం
వల్ల రాత్రి వెలవెలబోవడం అనేది సిగ్గుతో ఆ వధువు ముఖం వంచుకోవడంతో సమానం. అందువల్ల
ఇక్కడ 'ఉపమా అలంకారం' ధ్వని చమత్కారంతో
నిరూపించబడింది.
నవమ సర్గ శ్లోకం 025
నః ప్రసాదముచితం గమితా ద్యౌర్నోద్ధృతం
తిమిరమద్రివనేభ్యః ।
దిజ్ఞుఖేషు న చ ధామ వికీర్ణం భూషితైవ రజనీ
హిమభాసా ॥
ప్రతిపదార్థం
హిమభాసా = చల్లని కిరణములు గల చంద్రుని
చేత, ద్యౌః = ఆకాశము, ఉచితం = తగిన, ప్రసాదం =
ప్రసన్నతను (నిర్మలత్వాన్ని), న గమితా = పొందింపబడలేదు, అద్రివనేభ్యః =
పర్వతములు మరియు అడవుల నుండి, తిమిరం = చీకటి, న ఉద్ధృతం =
తొలగించబడలేదు, దిజ్ఞుఖేషు చ = దిక్కుల యొక్క ముఖములందును, ధామ = కాంతి, న వికీర్ణం =
చల్లబడలేదు, [తథాపి = అయినప్పటికినీ], రజనీ = రాత్రి, భూషితా ఏవ =
అలంకరించబడినట్లే ఉన్నది.
తాత్పర్యం
చంద్రుని వల్ల ఆకాశానికి ఇంకా పూర్తిగా
నిర్మలత్వం రాలేదు. పర్వతాలలో, అడవులలో ఉన్న చీకటి ఇంకా అలాగే ఉంది, తొలగిపోలేదు.
దిక్కుల అంతటా చంద్రకాంతి ఇంకా పూర్తిగా ప్రసరించలేదు. అయినప్పటికీ, చంద్రుని రాక చేత ఆ
రాత్రి అద్భుతంగా అలంకరించబడినట్లే ప్రకాశిస్తోంది.
విశేషాలు
మల్లినాథుని వ్యాకరణ వివరణ ప్రకారం 'వస్తుమ్' అనే పదంలో 'ఎకాచ
ఉపదేశేనుదాత్తాత్' సూత్రం వల్ల ఇట్ ప్రతిషేధం వచ్చింది. ఇక్కడ అలంకార
చమత్కారం చాలా ముఖ్యమైనది. లోకంలో ఒక వస్తువును లేదా కాంతను అలంకరించడానికి కొన్ని
ప్రసాధన కారణాలు (నైర్మల్యం, చీకటి పోవడం, కాంతి వెదజల్లడం
వంటివి) కావాలి. కానీ ఇక్కడ ఆయా కారణాలు ఏవీ పూర్తిగా సిద్ధించకపోయినప్పటికీ, రాత్రికి 'భూషితా ఏవ' (అలంకరింపబడినది)
అనే కార్యం జరిగినట్లు చెప్పబడింది. ఇలా కారణం లేకపోయినా కార్యం జరిగినట్లు
వర్ణించడం వల్ల ఇక్కడ 'విభావనా అలంకారం' సంభవించింది.
నవమ సర్గ శ్లోకం 026
మానినీజనవిలోచనపాతానుష్ణబాష్పకలుషాన్ప్రతిగృహ్యన్
।
మందమందముదితః ప్రయయౌ ఖం భీతభీత ఇవ
శీతమయూఖః ॥
ప్రతిపదార్థం
ఉదితః = ఉదయించిన, శీతమయూఖః = చల్లని
కిరణములు గల చంద్రుడు, ఉష్ణబాష్పకలుషాన్ = (విరహతాపం వల్ల కలిగిన) వేడి
కన్నీళ్లతో కలత చెందినట్టియు, మానినీజన = ప్రణయ కోపము గల స్త్రీల యొక్క, విలోచనపాతాన్ =
కటాక్ష వీక్షణములను (చూపులను), ప్రతిగృహ్యన్ = స్వీకరిస్తూ, భీతభీతః ఇవ =
మిక్కిలి భయపడిన వాని వలె, మందమందం = మెల్లమెల్లగా, ఖం = ఆకాశమును
గూర్చి, ప్రయయౌ = వెళ్ళెను.
తాత్పర్యం
చంద్రుడు ఉదయించాడు కానీ ఆ సమయంలో ప్రణయ
కోపంతో ఉన్న మానవతులు (కోపిష్టి కాంతలు) తమ విరహ వేదన వల్ల వేడి కన్నీళ్లు
కారుస్తూ, చంద్రుని వైపు తీక్షణంగా, కోపంగా
చూస్తున్నారు. ఆ భయంకరమైన చూపులను తప్పించుకోలేక భరిస్తూ, చంద్రుడు ఎంతో
భయపడిన వానిలా మెల్లమెల్లగా ఆకాశంలోకి సాగిపోతున్నాడు.
విశేషాలు
మల్లినాథసూరి దశరూపకం అనే నాట్యశాస్త్ర
గ్రంథం ఆధారంగా 'కలహాంతరిత' అనే నాయిక అవస్థను
వివరించారు. కోపంతో ప్రియుడిని తిరస్కరించి, ఆ తర్వాత
పశ్చాత్తాపపడే స్త్రీని కలహాంతరిత అంటారు. చంద్రోదయం వల్ల వారిలో విరహం పెరిగి, ఆ కోపాన్ని
చంద్రునిపై చూపుతున్నారు. వ్యాకరణ రీత్యా 'భీతభీతః' మరియు 'మందమందమ్' అనే పదాలు 'ప్రకారే గుణవచనస్య' అనే సూత్రం ప్రకారం
ద్విరుక్తిని (రెండుసార్లు రావడం) పొందాయి. ఇవి కర్మధారయవద్భావం చెందడం వల్ల సుప్
లుక్ జరిగి ఈ రూపాలు ఏర్పడ్డాయి. చంద్రుని మందగమనాన్ని చూసి, ఆయన స్త్రీల కోపపు
చూపులకు భయపడి వెళ్తున్నాడని ఊహించడం వల్ల ఇక్కడ 'ఉత్ప్రేక్షా
అలంకారం' అద్భుతంగా నిరూపించబడింది.
నవమ సర్గ శ్లోకం 027
శ్లిష్యతః ప్రియవధూరుపకण्ఠం తారకాస్తతకరస్య హిమాంశోః ।
ఉద్దమన్నభిరరాజ సమంతాదంగరాగ ఇవ లోహితరాగః ॥
ప్రతిపదార్థం
తతకరస్య = ప్రసరింపజేయబడిన కిరణములనెడి
హస్తములు కలిగినట్టియు, తారకః = నక్షత్రములనెడి, ప్రియవధూః =
ప్రియురాండ్రను, ఉపకంఠం = సమీపమునందు (కౌగిలిలో), శ్లిష్యతః =
ఆలింగనము చేసుకుంటున్నట్టియు, హిమాంశోః = చంద్రుని యొక్క, సమంతాత్ = అంతటా, ఉద్దమన్ = పైకి
వెదజల్లబడుచున్న, లోహితరాగః = ఎర్రని కాంతి, అంగరాగః ఇవ =
ఒంటికి పూసుకున్న సుగంధ లేపనము (అంగరాగము) వలె, అభిరరాజ =
ప్రకాశించెను.
తాత్పర్యం
చంద్రుడు తన కిరణాలనే చేతులను చాపి, తనకు
ప్రియురాండ్రైన నక్షత్రాలను దగ్గరగా ఆలింగనం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో ఆయన నుండి
నలుదిక్కులా వెలువడుతున్న ఉదయకాలపు ఎర్రని కాంతి, ఆ ఆలింగన వత్తిడి
వల్ల శరీరం నుండి కారుతున్న లేదా అంటుకుంటున్న ఎర్రని అంగరాగం (గంధ లేపనం) వలె
అంతటా ప్రకాశించింది.
విశేషాలు
మల్లినాథసూరి వ్యాఖ్యానం ప్రకారం ఇక్కడ
కిరణాలను హస్తాలుగా, నక్షత్రాలను ప్రియురాండ్రగా వర్ణించడం వల్ల
రూపకాలంకారం ఉంది. 'ఉపకంఠమ్' అనే పదం అత్యంత
సంయోగం అనే అర్థంలో ద్వితీయా విభక్తి లేదా అవ్యయీభావ సమాసం వల్ల ఏర్పడింది. 'ఉద్దమన్' అనే పదం ధాతువు
అర్థాంతరంలో (వెదజల్లడం అనే అర్థంలో) మారడం వల్ల అకర్మకమయింది. లోకంలో గాఢ ఆలింగనం
వల్ల అంగరాగం కరిగి కారుతుందనే ప్రసిద్ధి ఉంది. ఇక్కడ రూపక మరియు ఉపమ అలంకారాలు
ఒకదానికొకటి పోషకముగా ఉండడం వల్ల 'అంగాంగిభావ సంకర అలంకారం' సిద్ధించింది.
నవమ సర్గ శ్లోకం 028
ప్రేరితః శశధరేణ కరౌఘః సంహతాన్యపి నునోద
తమాంసి ।
క్షీరసింధురివ మంద్రభిన్నః కాననాన్యవిరలోచ్చతరూణి ॥
ప్రతిపదార్థం
శశధరేణ = చంద్రుని చేత, ప్రేరితః =
ప్రసరింపజేయబడిన, కరౌఘః = కిరణముల సమూహము, సంహతాని అపి =
దట్టమైనవైనప్పటికినీ, తమాంసి = చీకట్లను, మంద్రభిన్నః = మందర
పర్వతము చేత మథించబడిన, క్షీరసింధుః = క్షీరసముద్రము, అవిరలోచ్చతరూణి =
దట్టమైనవి మరియు ఎత్తైనవి అయిన వృక్షములు కలిగిన, కాననాని ఇవ =
అడవులను వలె, నునోద = దూరం చేసెను (నశింపజేసెను).
తాత్పర్యం
చంద్రుని నుండి వెలువడిన తెల్లని కిరణాల
సమూహం లోకంలో దట్టంగా అలుముకున్న చీకట్లను ఒక్కసారిగా పారద్రోలింది. ఈ దృశ్యం ఎలా
ఉందంటే, క్షీరసాగర మథన సమయంలో మందర పర్వతం యొక్క దెబ్బకు
ఎగసిపడిన పాలసముద్రపు తెల్లని తరంగాలు,
తీరంలో దట్టంగా, ఎత్తుగా పెరిగిన
అడవులను ఒక్కసారిగా ముంచెత్తి తుడిచిపెట్టేసినట్లుగా ఉంది.
విశేషాలు
మల్లినాథుని వివరణ ప్రకారం ఇక్కడ చంద్రుని
తెల్లని కిరణాలకు క్షీరసముద్ర తరంగాలతో పోలిక చెప్పబడింది. 'మంద్రభిన్నః' అనగా మందర పర్వతము
చేత కదల్చబడిన అని అర్థం. నల్లని దట్టమైన అడవులను చీకటితో పోల్చారు. చంద్రకిరణాలు
చీకటిని నశింపజేయడాన్ని, పాలసముద్రం అడవులను ముంచెత్తడంతో పోల్చడం వల్ల
ఇక్కడ 'ఉపమా అలంకారం' ఎంతో గంభీరంగా
వ్యక్తమయింది.
నవమ సర్గ శ్లోకం 029
శారతాం గమితయా శశిపాదైశ్ఛాయయా విటపినాం
ప్రతిపేదే ।
న్యస్తశుక్లబలిచిత్రతలాభిస్తుల్యతా
వసతివేశ్మమహీభిః ॥
ప్రతిపదార్థం
శశిపాదైః = చంద్రుని కిరణముల చేత, శారతాం = మచ్చల
రంగును (తెలుపు నలుపుల కలయికను), గమితయా = పొందింపబడిన, విటపినాం =
వృక్షముల యొక్క, ఛాయయా = నీడ, న్యస్తశుక్లబలిచిత్రతలాభిః
= చల్లబడిన తెల్లని పుష్పాదుల పూజా ఉపహారముల చేత విచిత్రమైన ఉపరితలములు కలిగిన, వసతివేశ్మమహీభిః =
నివాస గృహముల యొక్క నేలలతో, తుల్యతాం = సమానత్వమును, ప్రతిపేదే =
పొందెను.
తాత్పర్యం
చెట్ల కింద పడుతున్న
చంద్రకిరణాల వెలుతురు, ఆ చెట్ల ఆకుల నీడలు కలిసి నేలపై
తెల్లగా, నల్లగా విచిత్రమైన రంగులను (శబల
వర్ణాన్ని) సృష్టించాయి. ఆ వృక్ష ఛాయలు ఎలా ఉన్నాయంటే, రాత్రి వేళ ఇళ్ల ముంగిట లేదా పూజా
గృహాల నేలపై ముగ్గులు పెట్టి, తెల్లని
పూల ఉపహారాలను (బలి) చల్లినప్పుడు ఆ నేలలు ఎంత అందంగా కనిపిస్తాయో, అటువంటి గృహ భూములతో సమానత్వాన్ని
పొందాయి.
విశేషాలు
మల్లినాథసూరి అమరకోశం ఆధారంగా 'పాదాః' అంటే కిరణములు
(పాదా రశ్మ్యంగితుర్యాశాః) అని, 'బలిః'
అంటే పూజ కొరకు సమర్పించే పూల ఉపహారము అని
వివరించారు. విశ్వకోశం ప్రకారం 'శారః'
అంటే తెలుపు నలుపులు కలిసిన రంగు (శబల
వర్ణము). చెట్ల నీడల గుండా చంద్రకాంతి నేలపై పడినప్పుడు ఏర్పడే వెలుగు నీడల
చమత్కారాన్ని, గృహాలలో అలంకరించిన పూల పూజలతో పోల్చడం వల్ల ఇక్కడ
'ఆర్థీ ఉపమా అలంకారం' చక్కగా కుదిరింది.
నవమ సర్గ శ్లోకం 030
ఆతపే ధృతిమతా సహ వధ్వా యామినీవిరహిణా విహగేన ।
సేహిరే న కిరణా హిమరశ్మేర్దుఃఖితే మనసి
సర్వమసహ్యమ్ ॥
ప్రతిపదార్థం
వధ్వా సహ = తన ప్రియురాలైన చక్రవాక
పక్షితో కలిసి ఉండుట వలన, ఆతపే = (బాధాకరమైన) ఎండనందైనను, ధృతిమతా =
సంతోషమును కలిగియున్నట్టియు, [కానీ ఇప్పుడు] = యామినీవిరహిణా = రాత్రి కాగానే
నియమితమైన ఎడబాటును పొందినట్టి, విహగేన = చక్రవాక పక్షి చేత, హిమరశ్మేః = చల్లని
కిరణములు గల చంద్రుని యొక్క, కిరణాః = కిరణములు, న సేహిరే =
భరింపబడలేదు, [తథాహి = అది ఎలాగనగా], దుఃఖితే = దుఃఖముతో
నిండిన, మనసి = మనస్సు కలవానికి, సర్వం = (ఎంత
మనోహరమైనదైనా) సమస్తమును, అసహ్యమ్ = భరింపరానిదిగా మారును కదా.
తాత్పర్యం
పగటిపూట తీవ్రమైన ఎండ
ఉన్నప్పటికీ, తన ప్రియురాలితో కలిసి ఉన్నాననే
సంతోషంతో ఆ ఎండను కూడా భరించిన చక్రవాక పక్షి, ఇప్పుడు
రాత్రి కాగానే ఆమెకు దూరమైంది. విరహ వేదనతో ఉన్న ఆ పక్షికి, ఎంతో చల్లనివైన చంద్రకిరణాలు కూడా
అమితమైన బాధను కలిగించాయి కానీ ఉపశమనాన్ని ఇవ్వలేదు. దుఃఖంలో మునిగిపోయిన మనస్సు
ఉన్నవానికి, లోకంలో ఎంతటి ఆహ్లాదకరమైన వస్తువైనా
భరింపరానిదిగా మారుతుంది కదా!
విశేషాలు
మల్లినాథుని వ్యాకరణ వివరణ ప్రకారం 'అసహ్యమ్' అనే పదం 'శకిసహోశ్చ' అనే సూత్రం ప్రకారం
యత్ ప్రత్యయం రాగా ఏర్పడింది, దీని అర్థం
భరించడానికి శక్యం కానిది. పూర్వ వ్యాఖ్యాతలు కొందరు 'ఆతపాః' అని పాఠాంతరం చదివి, 'ప్రియురాలితో
ఉన్నప్పుడు ఎండలను కూడా భరించాడు, కానీ విరహంలో చంద్రకిరణాలను భరించలేకపోయాడు' అని అర్థం చెప్పారు; ఎలా చూసినా ఫలితం
ఒక్కటే అని మల్లినాథుల అభిప్రాయం. ఇక్కడ ఒక విశేష వృత్తాంతం (చక్రవాకం
చంద్రకిరణాలను భరించలేకపోవడం) 'దుఃఖితునికి అంతా అసహ్యమే' అనే సామాన్య వాక్యం
చేత సమర్థించబడడం వల్ల 'అర్థాంతరన్యాస అలంకారం' సిద్ధించింది.
నవమ సర్గ శ్లోకం 031
గంధముద్ధతరజఃకణవాహి విక్షిపన్వికసతాం
కుముదానామ్ ।
ఆదుధావ పరిలీనవిహంగా యామినీమరుదపాం
వనరాజీః ॥
ప్రతిపదార్థం
ఉద్ధతరజఃకణవాహి = పైకి లేచిన పరాగ
రేణువులను మరియు (నీటి) కణములను మోసుకొనిపోవునట్టియు, వికసతాం =
వికసిస్తున్న, కుముదానాం = తెల్లకలువల యొక్క, గంధం = సుగంధమును, వక్షిపన్ =
వెదజల్లుచున్నట్టి, యామినీమరుత్ = రాత్రి వేళ వీచే చల్లని గాలి, పరిలీనవిహంగాః =
చక్కగా నిద్రిస్తున్న పక్షులు కలిగిన,
అపాం వనరాజీః = నీటి ప్రవాహములను మరియు వన
పంక్తులను, ఆదుధావ = ఈషత్ కంపనము చేసెను (మెల్లగా
కదిలించెను).
తాత్పర్యం
రాత్రి వేళ వీస్తున్న చల్లని గాలి నీటి
బిందువులను, వికసిస్తున్న తెల్లకలువల యొక్క సుగంధాన్ని, వాటి పరాగ
రేణువులను మోసుకొస్తూ నలుదిక్కులా వెదజల్లుతోంది. ఆ చల్లని, సువాసనల గాలి
చెట్లపై ప్రశాంతంగా నిద్రిస్తున్న పక్షులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఆ వన పంక్తులను, జలాశయాలను
మెల్లమెల్లగా కదిలిస్తూ సాగిపోయింది.
విశేషాలు
మల్లినాథుని వివరణ ప్రకారం 'ఉద్ధతరజః' అనే పదంలో 'శేషాద్విభాషా' అనే సూత్రం ప్రకారం
వికల్పంగా కప్ ప్రత్యయం రాకపోవడం వల్ల ఈ రూపం నిలిచింది. అమరకోశం ప్రకారం 'ఆణ్' అనే ఉపసర్గ
ఈషదర్థాన్ని (కొద్దిగా అనే అర్థాన్ని) సూచిస్తుంది. కాబట్టి 'ఆదుధావ' అంటే పక్షుల
నిద్రకు భంగం కలగకుండా వనరాజిని కొద్దిగా మాత్రమే కదిలించింది అని అర్థం. లోకంలో
ఒక నాయకుడు తన ప్రియురాలిపై సుగంధ జలాలను చల్లుతూ ఆమెను మెల్లగా ఆకర్షించినట్లు, ఈ రాత్రి వాయువు వన
లతలను కదిలిస్తోందనే నాయికా-నాయక భావన ఇక్కడ స్ఫురిస్తోంది.
నవమ సర్గ శ్లోకం 032
సంవిధాతుమభిషేకముదాసే మన్మథస్య
లసదంశుజలౌఘః ।
యామినీవనితయా తతచిహ్నః సోత్పలో రజతకుంభ
ఇవేందుః ॥
ప్రతిపదార్థం
లసదంశుజలౌఘః = ప్రకాశిస్తున్న కిరణములనెడి
జల ప్రవాహము కలిగినట్టియు, తతచిహ్నః = స్పష్టముగా కనిపిస్తున్న లాంఛనము
(మచ్చ) కలిగినట్టి, ఇందుః = చంద్రుడు, యామినీవనితయా =
రాత్రి అనేడి కాంత చేత, మన్మథస్య = మన్మథుని యొక్క, అభిషేకం =
(త్రైలోక్య విజయ) పట్టాభిషేకమును, సంవిధాతుం = చక్కగా చేయుట కొరకో అన్నట్లు, సోత్పలః =
నల్లకలువతో కూడిన, రజతకుంభః ఇవ = వెండి కలశము వలె, ఉదాసే = పైకి
ఎత్తబడెను.
తాత్పర్యం
చంద్రుని కిరణాల ప్రవాహం తెల్లని జలం వలె
ప్రకాశిస్తోంది. ఆయనపై ఉన్న మచ్చ (లాంఛనము) వెండి కుండపై అలంకరించిన నల్లకలువ
పువ్వు వలె ఉంది. అటువంటి చంద్రుడు ఆకాశంలోకి పైకి రావడం ఎలా ఉందంటే, లోకాలను
జయించడానికి బయలుదేరుతున్న మన్మథునికి పట్టాభిషేకం చేయడం కోసం, 'రాత్రి' అనే కాంత నీటితో
నిండిన వెండి కలశాన్ని పైకి ఎత్తి పట్టుకున్నట్లుగా ఉంది.
విశేషాలు
మల్లినాథసూరి వ్యాకరణ రీత్యా 'ఉదాసే' అనేది అస్య
ధాతువుకు కర్మణి లిట్ రూపం అని వివరించారు. ఇక్కడ రాత్రిని వనితగా, చంద్రుని వెండి
కుండగా, చంద్రునిలోని మచ్చను నల్లకలువగా రూపించడం
జరిగింది. మన్మథుని అభిషేకం కొరకే చంద్రుడనే కుంభాన్ని రాత్రి ఎత్తింది అని
ఊహించడం వల్ల ఇక్కడ 'ప్రతీయమాన ఉత్ప్రేక్షా అలంకారం' ఉంది. ఈ ఉత్ప్రేక్ష
ఉపమతో కలిసి ఉండడం వల్ల 'ఉపమోత్ప్రేక్షల అంగాంగిభావ సంకర అలంకారం' సిద్ధించింది.
నవమ సర్గ శ్లోకం 033
ఓజసాపి ఖలు నూనమనూనం నౌసహాయముపయాతి
జయశ్రీః ।
యద్దిశ్రుః శశిమయూఖసఖః సన్నాదదే విజయి
చాపమనంగః ॥
ప్రతిపదార్థం
జయశ్రీః = విజయలక్ష్మి, ఓజసా అపి =
పరాక్రమము చేత, అనూనం = సంపూర్ణుడైనప్పటికినీ, అసహాయం = సహాయము
లేని వానిని, న ఉపయాతి ఖలు నూనం = నిశ్చయముగా చేరదు కదా, యత్ = ఏ కారణము
వలననగా, విభుః = సమర్థుడైనప్పటికినీ, అనంగః = మన్మథుడు, శశిమయూఖసఖః సన్ =
చంద్రకిరణములను తోడుగా (స్నేహితుడిగా) కలిగినవాడై, విజయి = విజయశీలమైన, చాపం = విల్లును, ఆదదే = చేతపట్టెను.
తాత్పర్యం
ఒకడు ఎంతటి పరాక్రమవంతుడైనప్పటికీ, తోడు లేదా సహాయం
లేని ఒంటరి వానిని విజయలక్ష్మి వరించదు అనేది నిశ్చయం. ఎందుకంటే, త్రిలోకాలను
జయించగల సమర్థుడైన ఆ మన్మథుడు కూడా,
ఒంటరిగా కాకుండా చంద్రుని కిరణాలను తనకు
సహాయకులుగా (స్నేహితులుగా) చేసుకున్న తర్వాతే తన విజయవంతమైన విల్లును చేతపట్టాడు
కదా!
విశేషాలు
మల్లినాథుని వ్యాకరణ వివరణ ప్రకారం 'విజయి' అనే పదం 'జిదృక్షి' అనే సూత్రం ఆధారంగా
ఇనిప్ ప్రత్యయం రాగా ఏర్పడింది, దీని అర్థం విజయ స్వభావం గలది. మన్మథుడు
సర్వసమర్థుడైనా చంద్రుని సహాయాన్ని కోరాడనే ఈ విశేష వృత్తాంతం ద్వారా 'ఎంతటి బలవంతుడైనా
సహాయం లేనిదే విజయాన్ని పొందలేడు' అనే లోక ప్రసిద్ధమైన సామాన్య సత్యాన్ని సమర్థించడం
జరిగింది. అందువల్ల ఇక్కడ 'అర్థాంతరన్యాస అలంకారం' అత్యంత సముచితంగా
కుదిరింది.
నవమ సర్గ శ్లోకం 034
సద్మనాం విరచనాహితశోభైరాగతప్రియకథైరపి
దూత్యమ్ ।
సంనికృష్టరతిభిః సురదారైర్భూషితైరపి
విభూషణమీషే ॥
ప్రతిపదార్థం
సంనికృష్టరతిభిః = ఆసన్నమైన సురతోత్సవము
(రతిక్రీడ) కలిగినట్టియు, ఆహితశోభైః = ముందే చక్కగా అలంకరించుకొని శోభను
పొందినవారైనప్పటికినీ, సురదారైః = దేవతా స్త్రీల చేత, సద్మనాం =
కేలిగృహముల (విలాస భవనముల) యొక్క, విరచనా = మళ్ళీ మళ్ళీ అలంకరించుట అనేది, ఈషే = కోరబడెను, ఆగతప్రియకథైః అపి =
ప్రియుల యొక్క రాకకు సంబంధించిన వర్తమానము అందినవారైనప్పటికినీ, దూత్యం = దూతీ
వ్యాపారము (సందేశములు పంపుట అనేది),
ఈషే = కోరబడెను, భూషితైః అపి =
ముందే నగలు ధరించినవారైనప్పటికినీ, విభూషణం = తిరిగి అలంకరణలు చేసుకోవడం అనేది, ఈషే = కోరబడెను.
తాత్పర్యం
మల్లినాథసూరి పీఠిక ప్రకారం: ఈ విధంగా
ఉద్దీపన సామగ్రిని వర్ణించి, ఇప్పుడు దానికి కార్యభూతమైన రతి వర్ణనను (శృంగార
చేష్టలను) ప్రారంభిస్తున్నారు. ప్రియునితో కలయిక చాలా దగ్గరపడిన సమయంలో దేవతా
స్త్రీలు అమితమైన తహతహతో ఉన్నారు. వారి కేలిగృహాలు ముందే చక్కగా అలంకరింపబడి ఉన్నా, వారు ఆత్రుతతో
వాటిని మళ్ళీ మళ్ళీ సర్దుతున్నారు. ప్రియుడు వస్తున్నాడనే శుభవార్త అందినప్పటికీ, ఇంకా నమ్మకం కలగక
దూతికలను మళ్ళీ మళ్ళీ పిలిపించి సమాచారం పంపుతున్నారు. తాము ముందే సర్వాభరణాలు
ధరించి ఉన్నప్పటికీ, ఆ తొందరపాటులో నగలను మళ్ళీ మళ్ళీ
సర్దుకుంటున్నారు.
విశేషాలు
మల్లినాథుని వ్యాఖ్యానం ప్రకారం ఇక్కడ
స్త్రీల యొక్క 'ఔత్సుక్యాతిరేకము' (ఆత్రుత లేదా
తొందరపాటు యొక్క పరాకాష్ఠ) వర్ణించబడింది. వ్యాకరణ రీత్యా 'ఈషే' అనేది ఇష్ (కోరుట)
ధాతువుకు కర్మణి లిట్ రూపం. 'దూత్యమ్' అనగా దూత యొక్క
కర్మ లేదా వ్యాపారము (దూతీ వృత్తాంతం),
ఇది దూత శబ్దానికి భావకర్మార్థాలందు యత్ प्रत्यయం రాగా ఏర్పడింది. ఒకే పని ముందే సిద్ధమై ఉన్నా, మనసులోని అమితమైన
ఉత్కంఠ వల్ల ఆయా పనులను (గృహాలంకరణ,
దూతీ వ్యాపారము, శృంగార ఆభరణాల
ధారణ) మళ్ళీ మళ్ళీ చేయడాన్ని ఇక్కడ అద్భుతంగా వర్ణించారు.
నవమ సర్గ శ్లోకం 035
న స్రజో రూరుచిరే రమణీభ్యశ్చందనాని విరహే
మదిరా వా ।
సాధనేషు హి రతేరుపధత్తే రమ్యతాం
ప్రీయసమాగమ ఏవ ॥
ప్రతిపదార్థం
విరహే = వియోగావస్థయందు
(ఎడబాటు కాలమునందు), రమణీభ్యః = సుందరీమణులకు, స్రజః = పూలమాలలు
గాని, చందనాని = చందన లేపనములు గాని, మదిరా వా = మద్యము
గాని, న రూరుచిరే = నచ్చలేదు (ఆనందాన్ని ఇవ్వలేదు), హి = ఏ కారణము
వలననగా, ప్రీయసమాగమ ఏవ = ప్రియుని యొక్క కలయిక మాత్రమే, రతేః = రతి క్రీడకు
లేదా ఆనందానికి కారణమైన, సాధనేషు = మాలలు చందనాది వస్తువులందు, రమ్యతాం =
మనోహరత్వమును (రుచికరత్వమును), ఉపధత్తే = కలిగిస్తుంది కదా.
తాత్పర్యం
ప్రియుడు దూరంగా ఉన్న విరహ కాలంలో
స్త్రీలకు పూలమాలలు, చందన గంధాలు, మైకమును కలిగించే
మద్యము వంటి విలాస వస్తువులేవీ నచ్చలేదు. ఎందుకంటే, ఆయా భోగ వస్తువులకు
అసలైన అందం లేదా ఆనందం ఇచ్చే శక్తి ఎప్పుడు వస్తుందంటే, ప్రియుడు పక్కన
ఉన్నప్పుడే వస్తుంది. ఆ ప్రియ సమాగమమే లేనప్పుడు ఈ సాధనాలన్నీ నిరర్థకములే కదా!
విశేషాలు
మల్లినాథుని వ్యాకరణ వివరణ ప్రకారం 'రూరుచిరే' అనే పదంలో 'రుచ్యర్థానాం
ప్రీయమాణః' అనే సూత్రం చేత రమణీభ్యః అనే పదానికి సంప్రదాన
సంజ్ఞ వచ్చి చతుర్థీ విభక్తి ఏర్పడింది. 'రమ్యాని' అనగా దేనినైతే
రమిస్తారో అవి, ఇది 'పోరదుపధాత్' అనే సూత్రం చేత యత్
ప్రత్యయం రాగా, 'కృత్యల్యుటో బహులమ్' అనే నియమం ద్వారా
అధికరణార్థంలో సిద్ధించింది. ఇక్కడ 'వైధర్మ్యము' (వ్యతిరేకత) ద్వారా
కారణం చేత కార్యం సమర్థించబడింది. అనగా, ప్రియుడు లేకపోవడం
వల్ల వస్తువులు నచ్చలేదు అనే విశేషాన్ని, ప్రియుడి కలయికే
వస్తువులకు అందాన్ని ఇస్తుంది అనే సామాన్య సత్యంతో సమర్థించడం వల్ల ఇక్కడ 'వైధర్మ్య
అర్థాంతరన్యాస అలంకారం' సిద్దించింది.
నవమ సర్గ శ్లోకం 036
ప్రస్థితాభిరధినాథనివాసం
ధ్వంసితప్రియసఖీవచన అభిః ।
మానినీభిరపహస్తితధైర్యః సాదయన్నపి
మదోవలలమ్బే ॥
ప్రతిపదార్థం
అధినాథనివాసం = ప్రియుని యొక్క గృహమును
గూర్చి, ప్రస్థితాభిః = బయలుదేరినట్టియు, ధ్వంసితప్రియసఖీవచనాభిః
= (తమంతట తామే ప్రియుని వద్దకు వెళ్ళడం గౌరవ లోపమనే) ప్రాణ స్నేహితురాండ్ర యొక్క
హితవచనములను తృణీకరించినట్టియు, మానినీభిః = ప్రణయ కోపము గల కాంతల చేత, అపహస్తితధైర్యః =
ధైర్యమును పూర్తిగా దూరం చేసినట్టియు,
సాదయన్ అపి = శరీరాన్ని క్రంగదీయుచు
(శక్తిని హరించుచు) ఉన్నప్పటికినీ, మదః = మదము (మద్య మైకము), అవలలమ్బే =
ఆశ్రయించబడెను (స్వీకరించబడెను).
తాత్పర్యం
తమ ప్రియుని ఇంటికి అభిసారికలుగా
బయలుదేరిన మానవతులు (కోపిష్టి కాంతలు),
'మనంతట మనం వెళ్తే మన గౌరవం తగ్గుతుంది, ప్రియుడే వచ్చేలా
చేయాలి' అని వారించే స్నేహితురాండ్ర మాటలను కూడా వినకుండా
తోసిరాజన్నారు. ఆ సమయంలో వారి ధైర్యాన్ని హరించి, శరీరాన్ని అలసట
పాలు చేస్తున్నప్పటికీ, వారు 'మదమును' (మద్యాన్ని లేదా
మైకమును) ఆశ్రయించారు. ఎందుకంటే, మత్తులో ఉన్నామనే నెపంతో తాము చేసిన పనులకు గల
లజ్జను, గౌరవ లోపాన్ని కప్పిపుచ్చుకోవడం సులువవుతుందని
వారి భావం.
విశేషాలు
మల్లినాథసూరి లక్షణ గ్రంథాల ఆధారంగా 'మానము' అంటే ఏమిటో
వివరించారు: ప్రియుడు అన్య స్త్రీ లోలుడైనప్పుడు స్త్రీలకు కలిగే ఈర్ష్యాజనిత
కోపమే మానము (స్త్రీణామీర్ష్యాకృతః కోపో మానోన్యాసంగిని ప్రియే). 'సాదయన్' అనగా శరీరాన్ని
కలుషితం లేదా కష్టపాలు చేయడం. ఇక్కడ స్త్రీలు తమ ధైర్యం నశించి, అవయవాలు స్వాధీనంలో
లేకపోయినా మదమును ఆశ్రయించడానికి కారణం - అజ్ఞాన వ్యాజం (మత్తులో ఉన్నాము కాబట్టే
స్నేహితురాళ్ల మాట వినకుండా ప్రియుడి వద్దకు వెళ్తున్నాము అనే నెపం) పెట్టుకుని తమ
లఘుత్వాన్ని (చిన్నతనాన్ని) దాచుకోవడమే. ఇక్కడ స్త్రీల శృంగార చేష్టలలోని మనస్తత్వ
విశ్లేషణ అద్భుతంగా వర్ణించబడింది.
నవమ సర్గ శ్లోకం 037
కాంతవేశ్మ బహు సందిశతీభిర్యాతమేవ రతయే
రమణీభిః ।
మన్మథేన పరిలుప్తమతీనాం ప్రాయశః
స్ఖలితమప్యుపకారి ॥
ప్రతిపదార్థం
రతయే = సురత సుఖము కొరకు, బహు = అనేక
విషయములను, సందిశతీభిః = (దూతికల ద్వారా) వర్తమానములు
పంపుచున్నట్టి, రమణీభిః = కాంతల చేత, [ఆ
సందేశముల తొందరపాటులో తాము ఎక్కడికి వెళ్తున్నారో గమ్యాన్ని మరచిపోయినవారై
నడుస్తూ], కాంతవేశ్మ = ప్రియుని యొక్క భవనము, యాతమేవ = చేరబడినదే
ఆయెను, [తథాహి = అది ఎలాగనగా], మన్మథేన = మన్మథుని
చేత, పరిలుప్తమతీనాం = బుద్ధి హరింపబడినవారి యొక్క, స్ఖలితమపి =
పొరపాట్లు (విరుద్ధ ప్రవర్తనలు) కూడా,
ప్రాయశః = చాలావరకు, ఉపకారి = మేలు
చేసేవిగా మారుతాయి కదా.
తాత్పర్యం
కాంతలు తమ ప్రియునితో కలవాలనే ఆత్రుతతో, దూతికల ద్వారా అనేక
సందేశాలను పంపుతున్నారు. ఆ తొందరపాటులో తాము మార్గంలో నడుస్తున్నామనే స్పృహ కూడా
లేక, సందేశాలు చెప్తూ చెప్తూనే నేరుగా ప్రియుని ఇల్లు
చేరుకున్నారు (అనగా దారి తప్పకుండా తిన్నగా ప్రియుని వద్దకే వెళ్ళిపోయారు).
కామమోహితులై బుద్ధి కోల్పోయినవారికి,
వారు చేసే ఇటువంటి పొరపాట్లు లేదా
అపసవ్యపు నడకలు కూడా చాలావరకు మేలు చేసేవిగానే (ఉపకారిగా) పరిణమిస్తాయి కదా!
విశేషాలు
మల్లినాథుని వ్యాఖ్యానం ప్రకారం 'సందిశతీభిః' అంటే సందేశాల
ఆవేశంలో తాము గమ్యస్థానాన్ని చేరుకుంటున్నామనే విషయాన్ని కూడా మరచిపోయారని అర్థం. 'యాతమేవ' అనగా మధ్య మార్గం
నుండి వెనక్కి తిరిగి రాకుండా తిన్నగా ప్రియుడి గృహాన్ని చేరుకోవడం. ఇక్కడ 'కామపీడితులైన వారి
పొరపాట్లు కూడా ఉపకారంగా మారుతాయి' అనే సామాన్య సత్యం చేత, స్త్రీలు సందేశాల
తొందరలో తిన్నగా ప్రియుడి ఇల్లు చేరడం అనే విశేషాంశం సమర్థించబడింది కాబట్టి ఇక్కడ
'అర్థాంతరన్యాస అలంకారం' హృద్యంగా
వ్యక్తమయింది.
నవమ సర్గ శ్లోకం 038
ఆశు కాంతమభిసారితవత్యా యోషితః
పులకరుద్ధకపోలమ్ ।
నిర్జిగాయ ముఖమిందుమఖండం ఖండపత్రతిలకాకృతి
కాంత్యా ॥
ప్రతిపదార్థం
ఆశు = శీఘ్రముగా, కాంతం = ప్రియుని, అభిసారితవత్యాః =
అన్వేషిస్తూ వెళ్ళినట్టి (అభిసారికయైన), యోషితః = స్త్రీ
యొక్క, పులకరుద్ధకపోలమ్ = (సంతోషాతిరేకము వల్ల కలిగిన)
గగుర్పాటు చేత నిండిన బుగ్గలు కలిగినట్టియు, ఖండపత్రతిలకాకృతి =
(నడకల వేగము వల్ల) చెరిగిపోయిన పత్రలేఖలు మరియు తిలకము యొక్క అమరిక కలిగినట్టి, ముఖం = ముఖము, కాంత్యా = తన
సహజమైన కాంతి చేత, అఖండం = సంపూర్ణమైన (మచ్చ లేని), ఇందుం = చంద్రుని, నిర్జిగాయ =
జయించెను.
తాత్పర్యం
ప్రియుని వద్దకు శీఘ్రంగా వెళ్ళిన
అభిసారికయైన కాంత ముఖం ఎంతో శోభాయమానంగా ఉంది. తొందరగా నడవడం వల్ల ఆమె ముఖంపై ఉన్న
తిలకము, పత్రలేఖలు (కస్తూరితో రాసిన ముగ్గులు) కొద్దిగా
చెరిగిపోయాయి. ప్రియ సమాగమ ఉత్సాహంతో బుగ్గలు గగుర్పొడిచాయి. అటువంటి ఆమె ముఖం తన
అద్భుతమైన సహజ కాంతితో, ఎక్కడా ఎటువంటి మచ్చా లేని సంపూర్ణ శరచ్చంద్రుడిని
కూడా పూర్తిగా జయించివేసింది (అనగా చంద్రుడి కంటే అందంగా ప్రకాశించింది).
విశేషాలు
మల్లినాథుని వ్యాకరణ వివరణ ప్రకారం 'అభిసారితవత్యాః' అనే రూపంలో
స్వార్థే ణిచ్ ప్రత్యయం వచ్చింది (అనగా తానే స్వయంగా అభిసరించినది అని అర్థం). 'ఖండ' అంటే చెరిగిపోయిన
లేదా ప్రసృష్టమైన పత్ర తిలకాల ఆకృతి. దండి అనే ప్రముఖ అలంకారికుని ప్రకారం 'జయతి, ద్వేష్టి' (జయించుట, ద్వేషించుట) వంటి
పదాలు సాదృశ్యాన్ని (పోలికను) వ్యక్తపరచడానికి నిఘంటువులలో వాడబడతాయి. కాబట్టి
చంద్రుని జయించింది అనగా చంద్రుని కంటే శ్రేష్ఠమైన అందాన్ని పొందింది అని అర్థం.
అందువల్ల ఇక్కడ 'ఆర్థీ ఉపమా అలంకారం' మనోహరంగా
నిరూపించబడింది.
నవమ సర్గ శ్లోకం 039
ఉచ్యతాం స వచనీయమశేషం నేశ్వరే పరుషతా సఖి
సాధ్వీ ।
ఆనయైనమనునీయ కథం వా విప్రియాణి
జనయన్ననునేయః ॥
ప్రతిపదార్థం
[తత్ర నాయికా ఆహ = అక్కడ నాయిక పలికెను] సః = ఆ
ధూర్తుడైన ప్రియునికి, వచనీయం = చెప్పవలసిన దూషణ (నింద) వచనమంతయు, అశేషం = పూర్తిగా, ఉచ్యతాం =
చెప్పబడుగాక (నిర్భయముగా నిందించుము),
[అథ సఖ్యా ఆహ = అంతట స్నేహితురాలు పలికెను]
హే సఖి = ఓ చెలియా, ఈశ్వరే = ప్రభువు, భర్త అయిన నాయకుని
యెడల, పరుషతా = కఠినత్వము (కోపము) చూపడం, న సాధ్వీ = మంచిది
కాదు (హితము కాదు), [అథ నాయికా ఆహ = మరల నాయిక పలికెను] తర్హి =
అట్లయినచో, ఏనం = ఈ ప్రియుని, అనునీయ =
బుజ్జగించి (శాంతింపజేసి), ఆనయ = ఇక్కడికి తీసుకురమ్ము, [పునః
సఖ్యా ఆహ = తిరిగి స్నేహితురాలు పలికెను] విప్రియాణి = అప్రియములను (తప్పులను), జనయన్ =
చేయుచున్నట్టి, సః = అతడు, కథం వా = ఏ విధముగా, అనునేయః =
బుజ్జగించుటకు అర్హుడు (అనునయార్హుడు) అవుతాడు.
తాత్పర్యం
మల్లినాథసూరి పీఠిక ప్రకారం: ఇప్పుడు
రెండు శ్లోకాల (యుగ్మము) ద్వారా సఖీ-నాయికల మధ్య జరిగిన సంవాదాన్ని (మాటల
పోరాటాన్ని) చెప్తున్నారు. నాయిక కోపంతో చెలికత్తెతో "ఆ ధూర్తుడికి
చెప్పాల్సిన బుద్ధులు, నిందలు అన్నీ మొహమాటం లేకుండా చెప్పేయ్"
అంది. అప్పుడు చెలికత్తె "ఓ సఖీ! భర్త అయినవాడిపై అంత కఠినత్వం చూపడం
తగదు" అంది. దానికి నాయిక సర్దుకుంటూ "సరే అయితే, అతడిని బ్రతిమలాడి
ఇక్కడికి తీసుకురా" అంది. అప్పుడు చెలికత్తె ఎదురుప్రశ్న వేస్తూ "మనకు
నిరంతరం అప్రియాలు చేసే ఆ నమ్మకద్రోహిని మనం ఎందుకు బ్రతిమలాడాలి? అతడు అస్సలు
అనునయానికి అర్హుడు కాడు" అని పలికింది.
విశేషాలు
మల్లినాథుని వ్యాఖ్యానం ప్రకారం ఇది
నాయికకు, ఆమె సఖికి మధ్య జరిగిన అద్భుతమైన సంభాషణ. వ్యాకరణ
రీత్యా 'ఉచ్యతామ్' అనే రూపంలో 'బ్రూఞ్
దుహాదిత్వాత్' అనే నియమం ప్రకారం ప్రధాన కర్మనందు లొట్ లకారం
వచ్చింది. 'దూత్యమ్' అనే పదం దూత యొక్క
భావకర్మార్థాలందు యత్ ప్రత్యయం చేరగా ఏర్పడింది. ఇక్కడ ప్రియునిపై కోపం
ఉన్నప్పటికీ, అతనిని రప్పించాలనే ఆరాటం గల నాయిక మనస్తత్వం, దానికి తగ్గట్లుగా
హితవు చెప్తూనే ఎదురు ప్రశ్నించే సఖి చాతుర్యం సంవాద రూపంలో ఎంతో నాటకీయంగా
వర్ణించబడ్డాయి.
నవమ సర్గ శ్లోకం 040
కిం గతేన న హి యుక్తముపైతుం కః ప్రియే
సుభగమానిని మానః ।
యషితామితి కథాసు సమేతైః కామిభిర్బహురసా
ధృతిరూహే ॥
ప్రతిపదార్థం
[పునర్నాయికా ఆహ = మరల నాయిక పలికెను] తర్హి =
అట్లయినచో, గతేన = వాని వద్దకు వెళ్ళుట వలన, కిం = ప్రయోజనమేమి, ఉపైతుం = వానిని
సమీపించుట, న యుక్తం హి = తగదు కదా, [పునః
సఖ్యా ఆహ = తిరిగి స్నేహితురాలు పలికెను] హే సుభగమానిని = తన అందంపై అమితమైన
గర్వము గల ఓ సఖీ, ప్రియే = (అంతగా ప్రేమించే) ప్రియుని విషయములో, మానః = కోపము
(అభిమానము), కః = ఎందుకు (చేయదగదు), ఇతి = ఈ విధముగా
సాగిన, యోషితాం = స్త్రీల యొక్క, కథాసు = సంభాషణలను, సమేతైః = దగ్గరకు
వచ్చి వింటున్నట్టి, కామిభిః = ప్రియుల చేత, బహురసా = అనేక
రకములైన ఆనంద స్వాదములు కలిగిన, ధృతిః = సంతోషము (తృప్తి), ఊహే = వహించబడెను
(పొందబడెను).
తాత్పర్యం
మరల నాయిక "అతడు అనునయానికి
లొంగనప్పుడు, ఇక వాని వద్దకు వెళ్ళడం వల్ల లాభం ఏమిటి? వెళ్ళకపోవడమే
మంచిది" అంది. దానికి సఖి "ఓ అందాల రాశి! అంతటి ప్రియుడిపై అంత కోపం
ఎందుకు? అంతటివాడు దొరకడం అరుదు కదా, కోపం వదిలేయ్"
అని నచ్చజెప్పింది. ఈ విధంగా ఆ కాంతల మధ్య జరుగుతున్న రహస్య సంభాషణలను చాటుగా
దగ్గరకు వచ్చి వింటున్న కాముకులకు (ప్రియులకు) అమితమైన హృదయానందం, తృప్తి కలిగాయి.
విశేషాలు
మల్లినాథుని వ్యాఖ్యాన వివరణ ప్రకారం 'న హి' అనే పదాన్ని సఖి
వాక్యంగా గ్రహిస్తే, "వెళ్ళకుండా ఉండటం తగదు, వెళ్ళడమే
యుక్తము" అని అర్థం వస్తుంది. 'సుభగమానిని' అనే పదం 'ఆత్మమానే ఖంచ్' అనే సూత్రం ద్వారా
చకారాత్తు వల్ల ణిని ప్రత్యయం రాగా ఏర్పడింది; అనగా తనను తాను
గొప్ప అందగత్తెగా భావించేది అని అర్థం. 'ఊహే' అనగా వహించెను
(ఊఢా). ఇక్కడ కాంతల మాటల్లో వ్యక్తమైన కఠినత్వము, ఆత్రుత, నిర్వేదము మొదలైన
అనేక భావాల కలయిక (భావశావల్యము) వల్ల,
ఆ మాటలు వింటున్న ప్రియులకు ఉత్తరోత్తర
అపూర్వ హృదయానంద నిష్యందం (ఆనంద సందోహం) లభించింది. ఇక్కడి నాయికలు ప్రౌఢలు మరియు
కలహాంతరితలు అని మల్లినాథులు స్పష్టం చేశారు.
నవమ సర్గ శ్లోకం 041
యషితః పులకరోధి దధత్యా ఘర్మవారి
నవసంగమజన్మ ।
కాంతవక్షసి బభూవ పతంత్యా మండనం
లులితమండనతైవ ॥
ప్రతిపదార్థం
నవసంగమజన్మ = సరికొత్త కలయిక వల్ల
పుట్టినట్టియు, పులకరోధి = (శరీరమంతటా) గగుర్పాటును
కలిగిస్తున్నట్టియు, ఘర్మవారి = స్వేద జలమును (చెమటను), దధత్యాః =
ధరిస్తున్నట్టియు, కాంతవక్షసి = ప్రియుని యొక్క రొమ్ముపై, పతంత్యాః =
వాలిపోతున్నట్టి, యోషితః = ఆ కాంతకు, లులితమండనతా ఏవ =
చెరిగిపోయిన అలంకారములు కలిగి ఉండుటయే,
మండనం = అసలైన అలంకారముగా, బభూవ = ఆయెను.
తాత్పర్యం
నవోత్సాహంతో ప్రియునితో జరిగిన సరికొత్త
కలయిక వల్ల ఆ కాంత శరీరమంతటా గగుర్పాటు కలిగింది. ఆ తాపానికి ఆమె ఒళ్లంతా చెమటలు
పట్టాయి. అమితమైన ఆత్రుతతో ప్రియుని వక్షస్థలంపై వాలిపోయిన ఆ సుందరి యొక్క ఆభరణాలు, పూలమాలలు, అలంకరణలు అన్నీ
చెదిరిపోయాయి. కానీ, ఆ సమయంలో ఆ చెదిరిపోయిన అలంకరణల స్థితియే (లులిత
మండనత్వమే) ఆమెకు అత్యంత మనోహరమైన అసలైన అలంకారముగా భాసించింది.
విశేషాలు
మల్లినాథసూరి వ్యాఖ్యానంలో దీనిని
రసవత్తరంగా విశ్లేషించారు. 'ఘర్మవారి' (చెమట) అనేది
నవసంగమం వల్ల, గగుర్పాటు వల్ల కలిగింది అని చెప్పడం ద్వారా ఇది
శృంగార రసానికి సంబంధించిన 'సాత్త్విక భావ ప్రకటన' అవుతుంది. 'కాంతవక్షసి
పతంత్యాః' (ప్రియుడి గుండెలపై వాలడం) అనేది ఆమెలోని అమితమైన 'ఔత్సుక్యమును' (ఆత్రుతను)
సూచిస్తుంది. 'లులితమండనతా' అనే పదం భావార్థంలో
తల్ ప్రత్యయం రాగా ఏర్పడింది; అనగా అలంకరణలు
అస్తవ్యస్తం కావడం. సురత క్రీడలో అలంకారాలు చెదరడమే పరమ ఫలం కాబట్టి, ఆ చెదిరిన రూపమే
ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టిందని మల్లినాథుల భావం.
నవమ సర్గ శ్లోకం 042
శీధుపానవిధురాసు నిగృహ్యన్మానమాశు
శిథిలీకృతలజ్జః ।
సంగతాసు దయితైరుపలేభే కామినీషు మదనో ను
మదో ను ॥
ప్రతిపదార్థం
శీధుపానవిధురాసు = షడ్రసయుక్తమైన ఇక్షురస
వికారమైన మైకమును కలిగించే మద్యమును (శీధువును) సేవించడం వల్ల వివశులైనట్టియు, శిథిలీకృతలజ్జః =
వదిలిపెట్టబడిన సిగ్గు కలిగినట్టియు,
దయితైః = తమ ప్రియులతో, సంగతాసు = (తామే
స్వయముగా వెళ్లి) కలిసినట్టియు, కామినీషు = కాంతలయందు, ఆశు = శీఘ్రముగా, మానం = ప్రణయ
కోపమును, నిగృహ్యన్ = నశింపజేయుచున్నది, మదనః ను = మన్మథుడా
ఏమి, మదః ను = మద్యము యొక్క మత్తా ఏమి, [ఇతి]
= అని, ఉపలేభే = ఊహించబడెను (లక్షించబడెను).
తాత్పర్యం
కాంతలు అమితంగా మద్యపానం చేయడం వల్ల
మైకంలో మునిగిపోయారు. దానివల్ల వారిలోని సిగ్గు పూర్తిగా సడలిపోయింది. వారు తామే
స్వయంగా వెళ్లి తమ ప్రియులను కౌగిలించుకున్నారు. అంతటి కఠినమైన వారి ప్రణయ
కోపాన్ని (మానాన్ని) క్షణంలో దూరం చేసింది వారిలోని మన్మథుడా లేక వారు తాగిన
మద్యపు మత్తా అనేది ఎవరికీ అర్థం కాలేదు; ఆ రెండూ కలిసి
వారిలో ఆ మార్పును తెచ్చాయి.
విశేషాలు
మల్లినాథుని నిఘంటు వివరణ ప్రకారం 'శీధువు' అనగా పండిన చెరుకు
రసంతో తయారు చేసిన ఒక రకమైన మద్య విశేషము (షేరతేనేనేతి శీధుః). 'విధురాసు' అనగా విమూఢురాలైన
లేదా వివశులైన వారు అని అర్థం. ఇక్కడ కాంతలు ప్రియులను కలవడానికి, కోపాలు
మరచిపోవడానికి రెండు సమాన కారణాలు కనిపిస్తున్నాయి - ఒకటి మన్మథుని ప్రభావం, రెండు మద్యపు
మత్తు. సిగ్గు పడటం, మానాన్ని వదిలేయడం అనే అనుభావాలు (చేష్టలు) ఈ
రెండింటికీ సమానంగా వర్తిస్తాయి. ఇలా మదన-మదములలో ఏది ముఖ్య కారణమో నిశ్చయించలేక
పోవడం వల్ల ఇక్కడ 'సందేహ అలంకారం' అద్భుతంగా
కుదిరింది.
నవమ సర్గ శ్లోకం 043
ద్వారి చక్షురధిపాణి కపోలౌ జీవితం త్వయి
కుతః కలహోస్యాః ।
కామినామితి వచః పునరుక్తం ప్రీతయే
నవనవత్వమియాయ ॥
ప్రతిపదార్థం
ద్వారి = నీవు వచ్చేడి దారి (ద్వారము)
పైనే, చక్షుః = ఆమె కన్నులు ఉన్నవి, అధిపాణి = అరచేతిపై, కపోలౌ = ఆమె
బుగ్గలు చేర్చబడి ఉన్నవి, జీవితం = ఆమె ప్రాణము, త్వయి = నీయందే (నీ
ఆధీనములోనే) ఉన్నది, [అతః = కాబట్టి], అస్యాః = ఈమెకు, కలహః = ప్రణయ కోపము
(కలహము), కుతః = ఎక్కడిది, ఇతి = అని, కామినాం = ప్రియుల
యొక్క, ప్రీతయే = సంతోషము కొరకు, పునరుక్తం = మరల
మరల చెప్పబడుతున్నట్టి, [దూతీవాక్యం = దూతిక యొక్క మాట], నవనవత్వం =
నూతనత్వమును (అపూర్వమైన వింత శోభను),
ఇయాయ = పొందెను.
తాత్పర్యం
దూతిక ప్రియుని వద్దకు వెళ్లి నాయిక విరహ
అవస్థను వివరిస్తోంది: "ఓ స్వామీ! ఆమె కన్నులు ఎప్పుడూ నీవు వచ్చే దారివైపే
చూస్తున్నాయి. ఆమె తన అరచేతిపై బుగ్గను చేర్చి నీ గురించే తీవ్రంగా ఆలోచిస్తోంది.
ఆమె ప్రాణం నీపైనే ఆధారపడి ఉంది. నీవు లేకుంటే ఆమె జీవించలేదు. ఇంతటి గాఢానురాగం
ఉన్న ఆమెకు నీపై నిజమైన కోపం ఎక్కడిది?
అదంతా పైకి నటించే ప్రణయ కోపమే" అని
చెప్పింది. ఈ విధంగా దూతిక మరల మరల చెప్తున్న మాటలు (పునరుక్త వచనాలు) ఆ
కాముకుడికి ఏమాత్రం విసుగు కలిగించకపోగా, విన్న ప్రతిసారీ
సరికొత్తగా, అపూర్వమైన ఆనందాన్ని కలిగిస్తూ భాసించాయి.
విశేషాలు
మల్లినాథసూరి ఘంటాపథ వ్యాఖ్యానంలో దీని
అంతరార్థాన్ని సుందరంగా విశ్లేషించారు. 'ద్వారి చక్షుః' అనగా రాకకై
ఎదురుచూడటం అనే ఆత్రుత (ఔత్సుక్యం). 'అధిపాణి కపోలౌ' అనగా చేతిపై బుగ్గ
చేర్చి విచారించడం అనే చింత. 'జీవితం త్వయి' అనగా గాఢానురాగం. ఈ
మూడు చేష్టల ద్వారా నాయిక హృదయం వ్యక్తమవుతోంది. వ్యాకరణ రీత్యా 'నవనవత్వమ్' అనే పదం
ప్రకారార్థంలో (రకరకములైన నూతన రకాలు అనే అర్థంలో) ద్విరుక్తిని పొందింది. ఇది కర్మధారయవద్భావం
చెందడం వల్ల సుప్ లుక్ జరిగి ఈ రూపం ఏర్పడింది. మల్లినాథసూరి సంస్కృత సూత్రాల
ఆధారంగా వివరించినప్పుడు 'అంతికాంతిక' (అత్యంత సమీపము), 'నవనవత్వమ్' వంటి పదాలు
ద్విరుక్తి (ఒకే పదం రెండుసార్లు రావడం) చెందుతాయి. అలాంటప్పుడు ఆ రెండు పదాలు
కలిసి కర్మధారయ సమాసం వలె ప్రవర్తిస్తాయి.
వ్యాకరణ పరిభాషలో దీనినే 'కర్మధారయవద్భావం' (కర్మధారయ సమాసం
లాంటి స్థితిని పొందడం) అంటారు.
ఇలా కర్మధారయవద్భావం చెందడం వల్లే ఆ రెండు
పదాల మధ్య ఉన్న విభక్తి ప్రత్యయాలు లోపించి (సుపో లుక్ జరిగి), అవి ఒకే పదంగా
మారుతాయి.
ప్రియుడికి తన కాంత యొక్క అనురాగ విశేషాలు
వినడం అమితమైన తృప్తిని ఇస్తుంది కాబట్టే, ఆ మాటలు
పునరుక్తమైనా నవనవత్వంగా అనిపించాయి. ఇక్కడి నాయిక 'కలహాంతరిత' అవస్థలో ఉంది.
నవమ సర్గ శ్లోకం 044
సాచి లోచనయుగం నమయంతీ రుంధతీ దయితవక్షసి
పాతమ్ ।
సుభ్రువో జనయతి స్మ విభూషాం సంగతావుపరరామ
చ లజ్జా ॥
ప్రతిపదార్థం
లోచనయుగం = తన కన్నుల జంటను, సాచి = పక్కకు
(తిర్యక్కుగా), నమయంతీ = వంచుతున్నట్టియు, దయితవక్షసి =
ప్రియుని యొక్క వక్షస్థలముపై, పాతం = వాలిపోవుటను (కౌగిలిని), రుంధతీ = (పైకి)
అడ్డుకుంటున్నట్టియు, లజ్జా = సిగ్గు, సుభ్రువః = చక్కని
కనుబొమ్మలు గల ఆ నాయికకు, విభూషాం = అద్భుతమైన శోభను, జనయతి స్మ =
కలిగించెను, [అంతేకాక] = సంగతౌ = సురత ప్రసంగము
సిద్ధించినప్పుడు, ఉపరరామ చ = ఆ సిగ్గు తొలగిపోయెను కూడా.
తాత్పర్యం
నాయకుడు దగ్గరకు వచ్చినప్పుడు ఆ సుందరి తన
కనులను తిన్నగా కాకుండా సిగ్గుతో పక్కకు తిప్పుకుంటూ వంచింది. ప్రియుడు
కౌగిలించుకోవడానికి తన వక్షస్థలంపై వాలుతుంటే, మనసులో కోరిక
ఉన్నప్పటికీ పైకి నివారిస్తున్నట్లుగా అడ్డుకుంది. ఆ సమయంలో ఆమె ముఖంలో వ్యక్తమైన 'లజ్జ' (సిగ్గు)
ఆమెకు ఒక అపూర్వమైన ఆభరణం లాంటి శోభను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వారి మధ్య సురత
క్రీడ ప్రారంభం కాగానే, ఆ సిగ్గు తనంతట తానుగా పూర్తిగా తొలగిపోయింది.
విశేషాలు
మల్లినాథుని వివరణ ప్రకారం ఇక్కడ నాయిక
యొక్క శృంగార చేష్టలు వర్ణించబడ్డాయి. ప్రియుడిని తిన్నగా చూడకుండా పక్కచూపులు
చూడటాన్ని 'సాచి'
అంటారు. కౌగిలిని పైకి వలదంటున్నట్లు
వారించడం ప్రగల్భ నాయికల సహజ గుణం. ఆ సమయంలో ఆమె ముఖాన దాల్చిన సిగ్గే ఆమెకు అసలైన
అలంకారమయింది. వ్యాకరణ రీత్యా 'ఉపరరామ' అనే పదం 'విభాషాకర్మకాత్' అనే సూత్రం ప్రకారం
పరస్మైపద రూపంలో సిద్ధించింది. రతి క్రీడలో లజ్జ వీడటమే ఆభరణంగా మారుతుందని
మల్లినాథుల అంతరార్థం.
నవమ సర్గ శ్లోకం 045
సవ్యలీకమవధీరితఖిన్నం ప్రస్థితం సపది
కోపపదేన ।
యోషితః సుహృదివ స్మ రుణద్ధి ప్రాణనాథమభివాష్పనిపాతః ॥
ప్రతిపదార్థం
సవ్యలీకం = తప్పు చేసినందువల్ల
(సాపరాధుడైనందువల్ల), అవధీరిత-ఖిన్నం = (నాయిక చేత) అవమానించబడి
దుఃఖితుడైనట్టియు, సపది = వెంటనే, కోపపదేన = కోపము
అనే నెపము చేత (అలిగి), ప్రస్థితం = బయలుదేరి వెళ్ళిపోవుచున్న, ప్రాణనాథం =
ప్రాణప్రియుని, యోషితః = ఆ కాంత యొక్క, అభివాష్పనిపాతః =
అభిముఖముగా కారిన కన్నీటి ప్రవాహము,
సుహృత్ ఇవ = ఒక మంచి స్నేహితుని వలె, రుణద్ధి స్మ =
అడ్డుకొనెను.
తాత్పర్యం
నాయకుడు ఏదో తప్పు చేశాడు (అన్య స్త్రీ
లోలుడయ్యాడు). అందువల్ల నాయిక అతనిని నిందించింది, అవమానించింది.
దాంతో అతడు నొచ్చుకుని, కోపంతో అక్కడి నుండి వెంటనే బయలుదేరి
వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో ఆ కాంత కళ్ల నుండి ఒక్కసారిగా కన్నీళ్లు
ఉబికివచ్చాయి. ఆ కన్నీటి ధార, వెళ్ళిపోతున్న ప్రియుడిని వెళ్లకుండా ఆపిన ఒక
ఆప్తుడైన స్నేహితుని వలె నిలిచింది. ఎందుకంటే, ఆ కన్నీళ్లను
చూడగానే ప్రియుడి కోపం కరిగిపోయి అక్కడే ఆగిపోయాడు.
విశేషాలు
మల్లినాథసూరి ఇక్కడ నాయిక యొక్క అవస్థను
దశరూపకం ఆధారంగా విశ్లేషించారు. 'అవధీరితఖిన్నమ్' అనే పదం 'పూర్వకాల...' అనే సూత్రం ద్వారా
తత్పురుష సమాసంగా ఏర్పడింది. ప్రియుడు అన్యకాంతా రక్తుడని తెలిసినప్పుడు ఈర్ష్యతో, కోపంతో కన్నీళ్లు
కార్చే నాయికను 'అధీరా ఖండితా' అంటారు
(జ్ఞాతేన్యాసంగిని పతౌ ఖండితేర్ష్యాకషాయితా, అధీరాశ్రు
విముంచంతీ విశేయా చాత్ర నాయికా). కన్నీరు కారడం అనేది మనసులోని ఆవేదన తొలగడానికి
సంకేతం. ఇక్కడ కన్నీటి ప్రవాహాన్ని ప్రియుడి ప్రయాణాన్ని ఆపే 'సుహృత్తు' (స్నేహితుడు)
తో పోల్చడం వల్ల 'ఉపమాలంకారం' ఎంతో హృద్యంగా
వ్యక్తమయింది.
నవమ సర్గ శ్లోకం 046
శంకితాయ కృతబాష్పనిపాతామీర్య్యా వముఖితాం
దయితాయ ।
మానినీమభిముఖాహితచిత్తాం శంసతి స్మ
ఘనరోమవిభేదః ॥
ప్రతిపదార్థం
ఈర్ష్యయా = అసూయ చేత (కోపము చేత), శంకితాయ =
భయపడుతున్నట్టియు (అపరాధము చేసినందువల్ల నమ్మకము లేని), దయితాయ =
ప్రియునికి, విముఖితాం = ముఖము చాటేసినట్టియు
(పరాజ్ముఖురాలైనట్టియు), కృతబాష్పనిపాతాం = కన్నీళ్లు కారుస్తున్నట్టి, మానినీం = ప్రణయ
కోపము గల ఆ కాంత, అభిముఖ-ఆహిత-చిత్తాం = (లోపల మాత్రం) ప్రియుని
వైపు లగ్నమైన మనస్సు కలిగినది, [అనగా నిష్కోపయైనది అని], ఘనరోమవిభేదః =
దట్టమైన రోమాంచము (గగుర్పాటు) యొక్క ఉదయము, శంసతి స్మ =
వ్యక్తము చేసెను (తెలియజేసెను).
తాత్పర్యం
సాపరాధుడైన నాయకుడు భయపడుతూ నిలబడగా, నాయిక ఈర్ష్యతో
అతనికి ముఖం చాటేసి, కన్నీళ్లు కారుస్తూ కోపంగా ఉన్నట్లు నటిస్తోంది.
కానీ, ఆమె శరీరమంతటా ఒక్కసారిగా దట్టమైన రోమాంచం
(గగుర్పాటు) పుట్టింది. ఆ గగుర్పాటు ఆమె అంతరంగాన్ని గుట్టు రట్టు చేసింది; పైకి కోపంగా
కనిపిస్తున్నా, లోపల ఆమె మనస్సు ప్రియుని వైపు మొగ్గుచూపిందని, ఆమె కోపం పూర్తిగా
కరిగిపోయిందని ఆ సాత్త్విక భావమే స్పష్టంగా తెలియజేసింది.
విశేషాలు
మల్లినాథుని వ్యాఖ్యానం ప్రకారం ఇక్కడ
కూడా మునుపటి శ్లోకంలో చెప్పబడిన 'అధీరా ఖండితా' నాయిక అవస్థే
వర్ణించబడింది. 'అభిముఖాహితచిత్తామ్' అనగా కోపం లేనిదై
ప్రియుడిని కోరుకుంటున్నది అని అర్థం. ఒకవేళ లోపల కూడా కోపమే ఉంటే శరీరానికి
గగుర్పాటు (రోమాంచం) అనేది పుట్టదు. ఇలా బాహ్య చేష్టలైన పరాజ్ముఖత్వం, కన్నీళ్లను పక్కకు
నెట్టి, శారీరక రోమాంచం ద్వారా అంతర్గత ప్రేమాతిశయాన్ని
ప్రకటించడం వల్ల ఇక్కడ నాయిక మనస్తత్వం, శృంగార రస పరిపోషణ
అద్భుతంగా జరిగాయి.
నవమ సర్గ శ్లోకం 047
లోలదృష్టి వదనం దయితాయాశ్చుంబతి ప్రియతమే
రభసేన ।
బ్రీడయా సహ వినీవి నితంబాదంశుకం
శిథిలతాముపపేదే ॥
ప్రతిపదార్థం
ప్రియతమే = ప్రియుడు, రభసేన =
బలాత్కారముగా (త్వరపాటుతో), లోలదృష్టి = చంచలమైన కన్నులు గల, దయితాయాః =
ప్రియురాలి యొక్క, వదనం = ముఖమును, చుంబతి సతి =
ముద్దాడుతుండగా, వినీవి = ముడి వీడిపోయినట్టి, అంశుకం = కట్టుబట్ట
(వస్త్రము), నితంబాత్ = నడుము (నితంబము) నుండి, బ్రీడయా సహ =
సిగ్గుతో పాటుగా, శిథిలతో ముపపేదే = జారిపోయెను (సడలిపోయెను).
తాత్పర్యం
మల్లినాథసూరి పీఠిక ప్రకారం: ఇప్పటి నుండి
సంభోగ శృంగారాన్ని, అందులోనూ బాహ్య రతిని (బాహ్య శృంగార చేష్టలను)
వర్ణిస్తున్నారు. ప్రియుడు అమితమైన తహతహతో, చంచలమైన కన్నులు గల
తన ప్రియురాలి ముఖాన్ని బలవంతంగా పట్టి ముద్దాడాడు. ఆ క్షణంలో, ముడి వీడిపోయిన ఆమె
కట్టుబట్ట నితంబం నుండి క్రిందికి జారిపోయింది; చిత్రమేమిటంటే, ఆ వస్త్రంతో పాటుగా
ఆమె మనస్సులోని సిగ్గు (వ్రీడ) కూడా ఒక్కసారిగా సడలిపోయి జారిపోయింది.
విశేషాలు
మల్లినాథుని వివరణ ప్రకారం ఇక్కడ వాత్స్యా యన కామసూత్రాల ఆధారంగా బాహ్య రతి, ఆభ్యంతర రతి అనే
భేదాలు చర్చించబడ్డాయి. చుంబనములు, ఆశ్లేషములు (కౌగిలింతలు), నఖ దంత క్షతాలు
బాహ్య రతి కిందికి వస్తాయి; సాక్షాత్ సురతం ఆభ్యంతర రతి అవుతుంది
(బాహ్యమాభ్యంతరం చేతి ద్వివిధం రతముచ్యతే...). ఇక్కడ అచేతనమైన వస్త్రం జారడం, చేతనమైన సిగ్గు
తొలగడం అనే రెండు వేర్వేరు క్రియలను 'సహ'
(పాటుగా) అనే పదం ద్వారా ఏకం చేసి, రెండింటికీ
సడలిపోవడమే అభేదంగా చెప్పడం వల్ల ఇక్కడ 'సహోక్తి అలంకారం' అతిశయోక్తి మూలకమై
ప్రకాశిస్తోంది. దీనివల్ల సిగ్గుకు,
వస్త్రానికి మధ్య ఒక అద్భుతమైన పోలిక కూడా
ధ్వనిస్తోంది.
నవమ సర్గ శ్లోకం 048
హ్రీతయా గలితనీవి
నిరస్యన్నంతరీయమవలంబితకాంచి ।
మండలీకృతపృథుస్తనభారం సస్వజే దయితయా
హృదయేశః ॥
ప్రతిపదార్థం
హృదయేశః = ప్రాణనాథుడైన ప్రియుడు, గలితనీవి =
వీడిపోయిన ముడి కలిగినట్టియు, తథాపి = అయినప్పటికినీ, అవలంబితకాంచి =
మొలనూలును (కాంచీ గుణమును) ఆశ్రయించి ఉన్నట్టి, అంతరీయం =
కట్టుబట్టను (అధోవస్త్రమును), నిరస్యన్ = తొలగిస్తున్నవాడై, వస్త్రాపగమాత్ =
బట్టలు తొలగడం వల్ల, హ్రీతయా = సిగ్గుపడినట్టియు, దయితయా = ఆ
ప్రియురాలి చేత, మండలీకృత-పృథు-స్తనభారం = గుండ్రముగా చేయబడిన
పెద్ద వక్షస్థల భారము కలిగినట్లుగా (అనగా గాఢముగా), సస్వజే = ఆలింగనము
చేసుకోబడెను.
తాత్పర్యం
ప్రియుడు ఆమె నడుము ముడి వీడిపోయి, కేవలం మొలనూలుకు
(కాంచీ మణికి) అతుక్కుని ఉన్న అధోవస్త్రాన్ని (కట్టుబట్టను) తొలగించడానికి
ప్రయత్నించాడు. వస్త్రం పూర్తిగా తొలగిపోతుండటంతో ఆ కాంత అమితంగా సిగ్గుపడింది.
ప్రియుడి చూపుల నుండి తన శరీరాన్ని దాచుకోవడానికై, ఆమె తన గుండ్రని, నిండు వక్షస్థలం
ప్రియుడి రొమ్ముకు అత్తుకుపోయేలా అతనిని గట్టిగా (గాఢంగా) కౌగిలించుకుంది.
విశేషాలు
మల్లినాథుని నిఘంటు వివరణ ప్రకారం 'అంతరీయము' అనగా కట్టుబట్ట
లేదా అధోవస్త్రము (అంతరీయోపసంవ్యానపరిధానాన్యధోంశుకే) అని అమరకోశం చెప్తోంది. 'హ్రీతయా' అనే రూపంలో హ్రీ
(సిగ్గుపడు) ధాతువు నుండి కర్తరి క్త ప్రత్యయం రాగా ఏర్పడింది. ఇక్కడ నాయిక
ప్రియుడిని గాఢంగా కౌగిలించుకోవడానికి గల కారణం - ప్రియుడి చూపుల నుండి తన
నగ్నత్వాన్ని కప్పిపుచ్చుకోవడమే. ఈ విధంగా కామశాస్త్ర సంప్రదాయానుసారమైన శృంగార
లీలా విశేషం ఇక్కడ అత్యంత రమణీయంగా,
శ్లీల మర్యాదను దాటకుండా వర్ణించబడింది.
నవమ సర్గ శ్లోకం 049
ఆహతా నఖపదైః పరిరంభాశ్చుంబితాని
ఘనదంతనిపాతైః ।
సౌకుమార్యగుణసంభృతకీర్తిర్వామ ఏవ
సురతేష్వపి కామః ॥
ప్రతిపదార్థం
పరిరంభాః = ఆలింగనములు (కౌగిలింతలు), నఖపదైః = గోటి
గాయముల (నఖ క్షతముల) చేత, ఆహతాః = ఆదరింపబడినవి (కోరబడినవి), చుంబితాని =
చుంబనములు, ఘనదంతనిపాతైః = గాఢమైన పంటి గాయముల చేత, ఆహతాని =
ఆదరింపబడినవి, [నను = నిజానికి], సౌకుమార్యగుణ-సంభృత-కీర్తిః
= కోమలత్వము (సున్నితత్వము) అనే గుణము చేతనే సంపాదించబడిన కీర్తి గల, కామః = మన్మథుడు, సురతేషు అపి =
సంభోగముల యందు కూడా, వామః ఏవ = క్రూరుడే (కఠినుడే) కదా.
తాత్పర్యం
రతిక్రీడల యందు గోటి గాయాలతో కూడిన
కౌగిలింతలు, గాఢమైన పంటి గాయాలతో (దంత క్షతాలతో) కూడిన
చుంబనములు ఎంతగానో ఆదరించబడతాయి; ప్రేమికులు వాటినే కోరుకుంటారు. నిజానికి మన్మథుడు ఎంతో సుకుమారుడైనవాడని లోకమంతా
కీర్తిస్తుంది. కానీ, ఆ
మన్మథుడు విరహ కాలంలోనే కాకుండా, సుఖాన్నిచ్చే
సంభోగ కాలంలో కూడా పీడను (నఖ దంత క్షతాల బాధను) కలిగిస్తూ క్రూరుడిగానే
ప్రవర్తిస్తాడు. సుకుమారుడనేది కేవలం మాట మాత్రమే; వస్తుతః
ఆయన పీడిస్తూనే సుఖాన్ని ఇస్తాడు.
విశేషాలు
మల్లినాథసూరి ఇక్కడ 'హేతౌ' అనే నియమం ప్రకారం
తృతీయ విభక్తి (నఖపదైః, ఘనదంతనిపాతైః) వచ్చిందని వివరించారు. 'ఆహతాః' అనే పదం లింగ
విపరిణామం చేత చుంబనాలకు కూడా అన్వయిస్తుంది. కామశాస్త్రంలో సురత సుఖాన్ని
ఉద్దీపింపజేయడానికి నఖ దంత క్షతాలు పరమ సాధనాలు. మన్మథుడు సుకుమారుడు అనే సాధారణ
ప్రసిద్ధిని పక్కన పెట్టి, 'ఆయన సురత కాలంలో కూడా క్రూరుడే' అనే విశేషాంశాన్ని 'పీడించడం ద్వారానే
సుఖాన్ని కలిగిస్తాడు' అనే కామశాస్త్ర సిద్ధాంతంతో సమర్థించడం జరిగింది.
అందువల్ల ఇక్కడ 'సామాన్యేన విశేషసమర్థన రూప అర్థాంతరన్యాస అలంకారం' అద్భుతంగా
సిద్దించింది.
నవమ సర్గ శ్లోకం 050
పాణిపల్లవవిధూననమంతః సీత్కృతాని
నయనార్ధనిమేషాః ।
యషితాం రహసి
గద్గదవాచామస్వతాముపయయుర్మదనస్య ॥
ప్రతిపదార్థం
రహసి = ఏకాంతమునందు, గద్గదవాచాం =
(ఆనందాతిరేకము చేత) తొట్రుపడుతున్న మాటలు కలిగిన, యోషితాం = కాంతల
యొక్క, పాణిపల్లవవిధూననం = చిగురుటాకుల వంటి హస్తముల
యొక్క కంపనము (కదిలించుట), అంతః సీత్కృతాని = అంతరంగాన పుట్టిన సీత్కార
ధ్వనులు, నయనార్ధనిమేషాః = సగము ముడుచుకున్న కన్నుల యొక్క
అరమూతలు, మదనస్య = మన్మథునికి, అస్త్రతాం = బాణముల
యొక్క స్థితిని, ఉపయయుః = పొందెను.
తాత్పర్యం
మల్లినాథసూరి పీఠిక ప్రకారం: బాహ్య రతిని
వర్ణించిన తర్వాత, ఇప్పుడు అభ్యంతర రతిని (సాక్షాత్ సురత క్రీడను)
వర్ణిస్తున్నారు. ఏకాంతంలో ఉన్న ఆ కాంతలు అమితానందంతో గద్గద స్వరంతో
పలుకుతున్నారు. ఆ సురత సమయంలో వారి చిగురుటాకుల వంటి చేతులు వణకడం, పెదవుల నుండి
వెలువడే సీత్కార ధ్వనులు, పరవశత్వంతో సగం మూతపడిన వారి కన్నుల చూపులు -
ఇవన్నీ పురుషుల మనస్సులలో మదనోద్దీపనాన్ని మరింతగా పెంచే మన్మథ బాణాలుగా
(అస్త్రాలుగా) మారాయి.
విశేషాలు
మల్లినాథుని వ్యాఖ్యానం ప్రకారం ఏకాంతంలో
పరస్పర విశ్వాసంతో సాగే ఈ క్రియల ద్వారా 'కుట్టమితము' అనే శృంగార భావం
వ్యక్తమైంది. ప్రియుడు అధరాన్ని నొక్కినప్పుడు గాని, గాఢంగా
కౌగిలించుకున్నప్పుడు గాని పైకి బాధగా ఉన్నట్లు నటిస్తూనే లోపల అమితమైన సుఖాన్ని
పొందడాన్ని కామశాస్త్రంలో కుట్టమితం అంటారు. కామశాస్త్ర గ్రంథమైన రతిరహస్యం
ప్రకారం - సురత సుఖప్రాప్తి కలిగినప్పుడు శరీరం సడలిపోవడం, కళ్ళు మూతపడటం, సిగ్గు పూర్తిగా
నశించి ఆనందంతో ముహుర్ముహుః సీత్కార ధ్వనులు చేయడం స్త్రీల సహజ లక్షణం. ఇక్కడ
చేతుల వణుకు, సీత్కారాలు, కనుమూతలు మన్మథుడి
అస్త్రాలుగా రూపింపబడడం లేదా వాటిలా ప్రవర్తించడం వల్ల శృంగార రస పరవశత్వం
అద్భుతంగా వ్యక్తమైంది.
నవమ సర్గ శ్లోకం 051
పాతుమాహితరతీన్యభిలేషుస్తర్షయంత్యపునరుక్తరసాని
।
సస్మితాని వదనాని వధూనాం సోత్పలాని చ
మధూని యువానః ॥
ప్రతిపదార్థం
యువానః = యువకులు, ఆహితరతీని =
అనురాగమును (సురత క్రీడపై ఆసక్తిని) పెంచునట్టియు, తర్షయంతి = (తాగిన
కొద్దీ) మరింత తృప్తిని ఇవ్వక దాహాన్ని (తృష్ణను) పెంచునట్టియు, అపునరుక్తరసాని =
మళ్ళీ మళ్ళీ ఆస్వాదించినా సరికొత్త రుచిని (అపూర్వ స్వాదాన్ని) ఇచ్చునట్టియు, వధూనాం = కాంతల
యొక్క, సస్మితాని = చిరునవ్వుతో కూడిన, వదనాని = ముఖములను
(అధరామృతమును), సోత్పలాని = నల్లకలువలు వేయబడినట్టి, మధూని చ =
మద్యములను (మధువులను) కూడా, పాతుం = ఆస్వాదించుటకు (తాగుటకు), అభిలేషుః =
కోరుకున్నారు.
తాత్పర్యం
మల్లినాథసూరి పీఠిక ప్రకారం: ఇప్పటి నుండి
మధుపాన (మద్యపాన) వర్ణన ప్రారంభమవుతోంది. యువకులు తమ ప్రియురాళ్ళతో కలిసి మద్యం
తాగడానికి సిద్ధపడ్డారు. కాంతల చిరునవ్వులతో కూడిన ముఖాలు (అధరామృతం) మరియు
నల్లకలువలు వేసి ఉంచిన ఆసవ మద్యం - ఈ రెండూ కూడా యువకులలో అనురాగాన్ని అమితంగా
పెంచుతున్నాయి. వాటిని ఎంత అనుభవించినా తనివితీరడం లేదు, పైగా మరింత కోరిక
పెరుగుతోంది. ప్రతిసారీ అవి సరికొత్త అపూర్వ రుచినే ఇస్తున్నాయి. అటువంటి కాంతల
ముఖాలను, ఆ మధువులను గ్రోలడానికి యువకులు అమితంగా
ఆరాటపడ్డారు.
విశేషాలు
మల్లినాథుని వ్యాఖ్యాన వివరణ ప్రకారం
ఇక్కడ ప్రస్తుతములైన (ప్రకరణానికి సంబంధించిన) వధూ ముఖాలు మరియు మద్యము అనే
రెండింటికీ 'పానము'
(ఆస్వాదించుట) అనే ఒకే క్రియతో సమానమైన
ధర్మం చెప్పబడింది. ఇలా ప్రకరణానికి సంబంధించిన వస్తువులకే సమాన ధర్మాన్ని
అన్వయించి, వాటి మధ్య గల పోలికను గమ్యమానం చేయడం వల్ల ఇక్కడ 'తుల్యయోగి తా
అలంకారం' సిద్దించింది. లక్షణ గ్రంథాల ప్రకారం ప్రస్తుత
వస్తువులకైనా లేదా అప్రస్తుత వస్తువులకైనా కేవలం సమాన ధర్మం చేత ఔపమ్యం స్ఫురిస్తే
అది తుల్యయోగిత అవుతుంది.
నవమ సర్గ శ్లోకం 052
కాంంతసంగమపరాజితమన్యు వారిణీరసనశాంతవివాదే
।
ఉపాహితసంధౌ మందధే ధనుషి నేషుమనంగః ॥
ప్రతిపదార్థం
కాంంతసంగమ-పరాజిత-మన్యు = ప్రియుని యొక్క
కలయిక చేత పూర్తిగా జయించబడిన (తొలగిపోయిన) ప్రణయ కోపము కలిగినట్టియు, వారిణీరసన-శాంత-వివాదే
= మద్యమును ఆస్వాదించడం వల్ల పూర్తిగా చల్లారిన వాగ్వివాదములు (మాటల కలహములు)
కలిగినట్టియు, అత ఏవ = అందువల్లనే, ఉపాహిత-సంధౌ = ప్రియులతో
చక్కని సంధిని (సయోధ్యను) కుదుర్చుకున్నట్టి, మానినీజనే విషయే =
ఆ మానవతుల (కోపిష్టి కాంతల) విషయములో,
అనంగః = మన్మథుడు, ధనుషి = తన
వింటినందు, ఇషుం = బాణమును, న సందధే =
సంధించలేదు.
తాత్పర్యం
కాంతలకు తమ ప్రియుల కలయిక లభించడంతో వారి
మనసులోని కోపమంతా అప్పటికే కరిగిపోయింది. దానికి తోడు వారు మద్యం సేవించడంతో, అంతవరకు వారి మధ్య
ఉన్న చిన్నపాటి మాటల పట్టింపులు, కలహాలు (వివాదాలు) పూర్తిగా శాంతించాయి. ఈ విధంగా
ప్రియులతో పూర్తిగా సయోధ్య (సంధి) కుదిరి, లొంగిపోయి ఉన్న ఆ
సుందరీమణులపై మన్మథుడు మళ్ళీ కొత్తగా తన బాణాన్ని సంధించవలసిన అవసరం లేకుండా
పోయింది. ఎందుకంటే, అప్పటికే పూర్తిగా వశమైన వారిపై మళ్ళీ బాణాలు
వేయడం వ్యర్థం కదా!
విశేషాలు
మల్లినాథుని వ్యాఖ్యానం ప్రకారం 'వారూణీ' అనగా మద్యము, దానిని ఆస్వాదించడం
వల్ల వాక్కలహాలు నశించాయి. ప్రియుల కలయిక వల్ల మనస్సులు కలిశాయి. లోకంలో ఇద్దరు
రాజుల మధ్య యుద్ధం ముగిసి, సంధి కుదిరిన తర్వాత వారిపై శత్రువు బాణాలు వేయడు.
ఇక్కడ కాంతలు కూడా ప్రియులతో సంధి (ఉపాహిత సంధి) చేసుకున్నారు. అందువల్ల మన్మథుడనే
రాజు వారిపై బాణసంధానం చేయలేదు. అప్పటికే సిద్ధమైన కార్యంపై సాధనాన్ని ప్రయోగించడం
వ్యర్థమనే (సిద్ధసాధ్యే సాధన వైయర్థ్యాత్) లోక
న్యాయం ఇక్కడ అర్థాంతరన్యాస ఛాయతో మనోహరంగా స్ఫురిస్తోంది.
నవమ సర్గ శ్లోకం 053
కుప్యతాశు భవతానతచిత్తాః కోపితాంశ్చ
వరివస్యత యూనః ।
ఇత్యనేక ఉపదేశ ఇవ స్మ ఖాద్యతే
యువతిభిర్మధువారః ॥
ప్రతిపదార్థం
యూనః = యువకులైన ప్రియులకు, కుప్యత = (పైకి)
కోపమును ప్రకటించుడు, ఆశు = శీఘ్రముగా, ఆనతచిత్తాః =
అనుకూలమైన మనస్సు కలిగినవారు, భవత = కండు, కోపితాన్ చ =
కోపగించినట్టి ఆ ప్రియులను, వరివస్యత = పరిచర్యల చేత ప్రసన్నము చేసుకొనుడు, ఇతి = అని, అనేకః = రకరకములుగా
సాగే, ఉపదేశః ఇవ = ప్రవర్తక వాక్యము (బోధన) వలె ఉన్నట్టి, మధువారః =
మద్యపానము యొక్క ఆవృత్తి (వరుస క్రమము), యువతిభిః = కాంతల
చేత, స్వాద్యతే స్మ = ఆస్వాదించబడెను.
తాత్పర్యం
మద్యం తాగుతున్న కొద్దీ కాంతలలో మత్తు
పెరుగుతోంది. ఆ మత్తు వారిని రకరకాలుగా ప్రేరేపిస్తోంది: "ప్రియులపై కొద్దిగా
కోపం చూపించండి, మరుక్షణమే వారిపై అనుకూలతను ప్రకటించండి, ఒకవేళ వారు
కోపిస్తే వెంటనే బ్రతిమలాడి పరిచర్యలు చేయండి" అని ఎవరో లోపల ఉండి రకరకాల
హితబోధలు (ఉపదేశాలు) చేస్తున్నట్లుగా ఉంది. ఆ విధంగా కోపతాపాలకు, అనునయాలకు
కారణమవుతున్న ఆ మద్యపాన క్రమాన్ని (మధువారాన్ని) ఆ యువతులు ఎంతో ఇష్టంగా
ఆస్వాదించారు.
విశేషాలు
మల్లినాథసూరి వ్యాకరణ రీత్యా 'కుప్యత' అనే రూపంలో 'కుధద్రుహ...' అనే సూత్రం ప్రకారం
చతుర్థీ విభక్తి రాలేదు; ఎందుకంటే ఆ నియమం 'యం ప్రతి కోపః' (ఎవరిపై
నిజమైన కోపముంటుందో) వానికే వర్తిస్తుంది, కానీ ఇక్కడి కోపం
కృత్రిమమైనది కాబట్టి 'యూనః'
అని ద్వితీయా విభక్తిలోనే నిలిచింది. 'వరివస్యత' అనే పదం 'నమోవరివశ్చిత్రఙః
క్యచ్' అనే సూత్రం ద్వారా క్యచ్ ప్రత్యయం రాగా ఏర్పడింది, దీని అర్థం పరిచర్య
చేయడం. అమరకోశం ప్రకారం 'మధువారః' అంటే మద్యపానము
యొక్క క్రమము (మధువారా మధుక్రమాః). మద్యం తాగినప్పుడు మనుషులలో మత్త చేష్టలు
స్థిరంగా ఉండవు. ఆ మద్య క్రమమే వారికి ఈ పనులన్నీ చేయమని ఉపదేశం ఇస్తున్నట్లుగా
ఊహించడం వల్ల ఇక్కడ 'ఉత్ప్రేక్షా అలంకారం' సిద్ధించింది.
నవమ సర్గ శ్లోకం 054
భర్తృభిః ప్రణయసంభ్రమదత్తాం వారుణీమతిరసాం
రసయిత్వా ।
హ్రీవిమోహవిరహాదుపలేభే పాటవం ను హృదయం ను
వధూభిః ॥
ప్రతిపదార్థం
భర్తృభిః = భర్తల చేత, ప్రణయసంభ్రమదత్తాం
= ప్రేమాతిశయము మరియు ఆదరములతో ఇవ్వబడినట్టియు, అతిరసాం = మిక్కిలి
ఎక్కువ రుచి కలిగినట్టి, వారుణీం = వారుణీ మద్యమును, రసయిత్వా =
ఆస్వాదించి (తాగి), వధూభిః = ఆ కాంతల చేత, హ్రీవిమోహవిరహాత్ =
(మత్తు వల్ల) సిగ్గు మరియు అజ్ఞానము అనెడి జడత్వము తొలగిపోవుట అనే కారణము చేత, పాటవం ను =
వాక్చాతుర్యమును (నేర్పరితనమును) పొందెనా ఏమి, హృదయం ను =
(నిజమైన) మనస్సును (తెలివిని) పొందెనా ఏమి, [ఇతి] = అని, ఉపలేభే =
ఊహించబడెను (లక్షించబడెను).
తాత్పర్యం
భర్తలు ఎంతో ప్రేమాదరాలతో అందించిన, అమిత రుచికరమైన
వారుణీ మద్యాన్ని ఆ కాంతలు సేవించారు. ఆ మద్యం తాగిన తర్వాత మత్తు వల్ల వారిలోని
సిగ్గు, అజ్ఞానము లేదా జడత్వము పూర్తిగా తొలగిపోయాయి.
దాంతో వారిలో అద్భుతమైన వాక్చాతుర్యం,
నేర్పరితనం పెరిగాయి. ఇది చూసినవారికి ఎలా
అనిపించిందంటే - ఆ వనితలు మద్యం తాగడం ద్వారా ఒక నూతన సామర్థ్యాన్ని (పాటవాన్ని)
పొందారా, లేక అసలైన మనస్సును (తెలివిని) ఇప్పుడే పొందారా
అనిపించింది.
విశేషాలు
మల్లినాథసూరి విశ్వకోశం ఆధారంగా 'సంభ్రమః' అనగా గౌరవము లేదా
ప్రేమాతిశయము (సంభ్రమః సాధ్వసేపి స్యాత్సంవేగాదయోరపి) అని వివరించారు. అమరకోశం
ప్రకారం 'వారుణీ' అనగా వరుణుని
కుమార్తె లేదా సురా విశేషము (సురా హలిప్రియా హాలా పరినుద్ధరుణాత్మజా). మద్యం వల్ల
సిగ్గు పోవడంతో కాంతలు తమ ప్రియులతో చమత్కారంగా, వక్రోక్తులతో
మాట్లాడటం ప్రారంభించారు. వారి మాటలలోని ఈ మార్పును చూసి, ఆ జ్ఞాన సామర్థ్యం
అంతవరకు లేక ఇప్పుడే కొత్తగా లభించిందా అని సందేహించడం వల్ల ఇక్కడ 'సందేహ అలంకారం' నిరూపించబడింది.
నవమ సర్గ శ్లోకం 055
స్వాదితః స్వయమథైధితమానం లంభితః ప్రియతమైః
సహ పీతః ।
ఆసవః ప్రతిపదం ప్రమదానాం నైకరూపరసతామివ
భేజే ॥
ప్రతిపదార్థం
ఆసవః = ఆసవ మద్యము, ప్రమదానాం = ఆ
కాంతలకు, ప్రతిపదం = ప్రతిసారి (ప్రతి అడుగున), స్వయం = మొదట తమంతట
తామే, స్వాదితః = ఆస్వాదించబడినదై, అథ = ఆ తర్వాత, ప్రియతమైః =
ప్రియుల చేత, ఐధితమానం = పెంచబడిన బహుమానము (ఆదరము)
కలిగేటట్లుగా, లంభితః = అందింపబడినదై (తాగింపబడినదై), [తతః
= ఆ పిమ్మట], ప్రియతమైః సహ = ప్రియులతో కలిసి (ఒకే పాత్రతో), పీతః = తాగబడినదై, నైకరూపరసతాం = అనేక
విధములైన రుచుల యొక్క స్థితిని, భేజే ఇవ = పొందినదో అన్నట్లుగా ఉన్నది.
తాత్పర్యం
ఆసవ మద్యం ఆ కాంతలకు తాగిన ప్రతిసారీ
సరికొత్త రుచులను ఇచ్చింది. మొదట వారు తమంతట తామే ఆ మద్యాన్ని తాగారు (అప్పుడు ఒక
రుచి తెలిసింది). ఆ తర్వాత ప్రియులు ఎంతో ఆదరంతో తమ చేతులతో స్వయంగా తాగిం చారు (అప్పుడు మరింత రుచిగా అనిపించింది). చివరిగా
ప్రియులతో కలిసి ఒకే పాత్రలో పంచుకుంటూ తాగారు (అప్పుడు రుచి పరాకాష్ఠకు చేరింది).
ఈ విధంగా వేర్వేరు ఉపచారాల వల్ల ఆ మద్యము ప్రతి దశలోనూ రకరకాల అపూర్వ రుచులను
సంతరించుకున్నదా అన్నట్లుగా భాసించింది.
విశేషాలు
మల్లినాథుని వ్యాకరణ వివరణ ప్రకారం 'నైకరూపరసతామ్' అనే పదంలో 'న ఏక' (నైక)
అనే చోట నకారానికి సుప్సుపా సమాసం రాగా, నఞ్ సమాసంలో వచ్చే
నలోపం ఇక్కడ వికల్పంగా రాలేదు. లోకంలో ఎంతటి ఉత్తమ భోగ్య వస్తువైనా దానిని అందించే
ఉపచార విశేషాన్ని బట్టి రుచి మారుతుంటుంది. ఇక్కడ ఆస్వాదించడం, ప్రియుడు తాపడం, కలిసి తాగడం అనే
వివిధ క్రియల వల్ల అనేక రుచులు సిద్ధించాయి. దీనికి కారణాలు స్పష్టంగా చెప్పబడటం
వల్ల 'కావ్యలింగ అలంకారం', ఒకే వస్తువు వరుసగా
భిన్న అవస్థలను పొందడం వల్ల 'పర్యాయ అలంకారం' ఉన్నాయి. ఇవి రెండు
కలిసి అనేక రుచులను పొందడం అనే 'ఉత్ప్రేక్షా అలంకారం' కు బీజం కావడం వల్ల
ఇక్కడ అంగాంగిభావ సంకర అలంకారం ఏర్పడింది.
నవమ సర్గ శ్లోకం 056
భ్రూవిలాససుభగాననుకర్తుం విభ్రమానివ
వధూనయనానామ్ ।
ఆదదే మృదువిలోలపలాశైరుత్పలైశ్చషకవీచిషు
కంపః ॥
ప్రతిపదార్థం
చషకవీచిషు = మద్యపాన పాత్రలలోని (మద్యపు)
తరంగములందు, మృదువిలోలపలాశైః = కొద్దిగా చంచలముగా కదులుతున్న
రేకులు కలిగిన, ఉత్పలైః = నల్లకలువల చేత, కంపః = వణుకు
(కంపనము), భ్రూవిలాససుభగాన్ = కనుబొమ్మల విలాసముల చేత
సుందరములైన, వధూనయనానాం = కాంతల కన్నుల యొక్క, విభ్రమాన్ = విలాస
చలనములను, అనుకర్తుం ఇవ = అనుకరించుట కొరకో అన్నట్లు, ఆదదే =
స్వీకరించబడెను.
తాత్పర్యం
మద్యపాన పాత్రలలో (గిన్నెలలో)
సువాసనల కొరకు నల్లకలువ పూలను ఉంచారు. ఆ పాత్రలలోని మద్యం కదులుతుండగా, అందులోని కలువ పూల రేకులు కూడా
మెల్లమెల్లగా కదులుతున్నాయి. ఆ కలువ పూల చలనం ఎలా ఉందంటే - మద్యం తాగుతున్న ఆ
సుందరీమణుల కనుబొమ్మల విలాసవంతమైన కదలికలను తాము కూడా అనుకరించి, వాటితో సమానత్వాన్ని పొందాలనే
ఉద్దేశంతోనే ఆ పూలు అలా వణుకుతున్నాయా అన్నట్లుగా ఉంది.
విశేషాలు
మల్లినాథసూరి వ్యాఖ్యానం ప్రకారం ఇక్కడ
కలువ పూల సహజమైన చలనానికి 'వధూ నేత్ర విలాసాలను అనుకరించడం' అనే ఒక విశిష్ట
ఫలాన్ని (ప్రయోజనాన్ని) ఊహించడం వల్ల ఇది 'ఫలోత్ప్రేక్షా
అలంకారం' అవుతుంది. 'పలాశ' అంటే పూల రేకులు.
మద్యం కదలడం వల్ల పూలు కదలడం సహజమే అయినా, కాంతల కన్నులతో
ముందే పోలిక ఉన్న ఆ నల్లకలువలు, ఇప్పుడు కదలికను కూడా పొంది ఆ కనుబొమ్మల అందాన్ని
పూర్తిగా అందుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కవి అద్భుతంగా వర్ణించారు.
నవమ సర్గ శ్లోకం 057
ఓష్ఠపల్లవవిదంశరుచీనాం హృద్యతాముపయయౌ
రమణానామ్ ।
ఫుల్లలోచనవినీలసరోజైరంగనాస్యచషకైర్మధువారః
॥
ప్రతిపదార్థం
ఓష్ఠపల్లవ-విదంశ-రుచీనాం = చిగురుటాకు
వంటి (నాయికల) అధరమును దంతములతో నొక్కాలనే (ముద్దాడాలనే) అమితమైన అభిలాష
కలిగినట్టి, రమణానాం = ప్రియులకు, ఫుల్లలోచన-వినీలసరోజైః
= వికసించిన కన్నులనెడి నల్లకలువలు కలిగినట్టి, అంగనాస్య-చషకైః =
కాంతల ముఖములనెడి మద్యపాన పాత్రల ద్వారా, మధువారః =
మద్యపానము యొక్క ఆవృత్తి, హృద్యతాం = హృదయప్రియత్వమును (అమితానందమును), ఉపయయౌ = పొందెను.
తాత్పర్యం
ఆ ప్రియులు మద్యం తాగే నెపంతో తమ
ప్రియురాళ్ళ అధరామృతాన్ని గ్రోలాలని (ముద్దాడాలని) అమితంగా ఆరాటపడుతున్నారు. ఆ
సమయంలో ఆ కాంతల వికసించిన కళ్లే నల్లకలువలుగా ప్రకాశిస్తుండగా, వారి ముఖాలే
మద్యపాన పాత్రలుగా (గిన్నెలుగా) మారాయి. అటువంటి కాంతల ముఖాలనే పాత్రల నుండి
ప్రియులు మద్యం సేవించడం, ఆ మద్యపాన క్రమం (మధువారం) వారికి అమితమైన
హృదయానందాన్ని, తృప్తిని కలిగించింది.
విశేషాలు
మల్లినాథుని నిఘంటు వివరణ ప్రకారం 'చషకః' అంటే మద్యపాన పాత్ర
లేదా గిన్నె (చషకోస్త్రీ పానపాత్రమ్) అని అమరకోశం చెప్తోంది. 'హృద్యతామ్' అనగా హృదయానికి
ప్రియమైనది, ఇది 'హృదయస్య ప్రియః' అనే అర్థంలో యత్
ప్రత్యయం రాగా, 'హృదయస్య హృల్లేఖ...' సూత్రం ద్వారా
హృద్భావం వచ్చి సిద్ధించింది. ఇక్కడ కన్నులను నల్లకలువలుగా, ముఖాలను
పానపాత్రలుగా రూపించడం వల్ల 'రూపక అలంకారం' ఉంది. ఈ రూపకం
ప్రియుల యొక్క అభిలాషకు (అధరాన్ని చుంబించాలనే కోరికకు) కారణం కావడం వల్ల ఇక్కడ 'కావ్యలింగ అలంకారం' కూడా కలిసి ఉంది.
కాబట్టి ఇది 'కావ్యలింగ సంకీర్ణ రూపక అలంకారం' అవుతుంది.
నవమ సర్గ శ్లోకం 058
ప్రాప్యతే గుణవతాపి గుణానాం
వ్యక్తమాశ్రయవశేన విశేషః ।
తత్తథా హి దయితాననదత్తం వ్యానశే మధు
రసాతిశయేన ॥
ప్రతిపదార్థం
గుణవతా అపి = (ముందే) మంచి గుణములు (రుచి)
కలిగినదైనప్పటికినీ, ఆశ్రయవశేన = (తాను పొందిన) ఆశ్రయము యొక్క ప్రభావము
చేత, గుణానాం = తన గుణములకు, విశేషః = గొప్ప
ఉత్కర్ష (అధిక ప్రకర్ష), ప్రాప్యతే = లభిస్తుంది, [ఇది]
= వ్యక్తం = స్పష్టము, తత్ తథా హి = అది ఆ విధముగానే ఉన్నది గదా, యత్ = ఏ కారణము
వలననగా, దయితా-ఆనన-దత్తం = ప్రియురాలి ముఖము ద్వారా
(ఉమ్మివేయబడిన లేదా అందించబడిన), మధు = మద్యము, రసాతిశయేన =
అమితమైన రుచ్యతిశయము చేత, వ్యానశే = వ్యాపించెను (మిక్కిలి శ్రేష్ఠమైనదిగా
మారెను).
తాత్పర్యం
ముందే మంచి రుచి, సువాసన వంటి గుణాలు ఉన్న
వస్తువైనప్పటికీ, అది చేరిన ఆశ్రయాన్ని బట్టి దానికి
మరింత గొప్ప విశిష్టత, ఉత్కర్ష లభిస్తాయి అనేది జగమెరిగిన
సత్యం. ఇది ఎంత నిజమంటే - ముందే ఎంతో రుచిగా ఉన్న ఆ ఆసవ మద్యం, ఎప్పుడైతే ప్రియురాలి ముఖ సంపర్కాన్ని
పొందిందో (ఆమె నోటితో అందించిందో), అప్పుడు
అది అద్భుతమైన రుచ్యతిశయాన్ని సంతరించుకుని అమితమైన శ్రేష్ఠత్వాన్ని పొందింది.
విశేషాలు
మల్లినాథసూరి ఘంటాపథ వ్యాఖ్యానంలో దీనిని
అద్భుతమైన అర్థాంతరన్యాసంగా నిరూపించారు. 'వ్యానశే' అనగా వ్యాపించెను
లేదా ప్రకర్షను పొందెను. లోకంలో ఉత్తమమైన ఆశ్రయం
దొరికినప్పుడు ఏ గుణమైనా మరింతగా ప్రకాశిస్తుంది. ఇక్కడ 'మద్యం కాంత ముఖ సంపర్కం వల్ల మరింత
రుచిగా మారింది' అనే ఒక విశేష వృత్తాంతం ద్వారా, 'గుణవంతుడైనా ఆశ్రయ వశం చేతనే గుణాలకు
మరింత ప్రకర్ష లభిస్తుంది'
అనే విశ్వజనీనమైన సామాన్య
సత్యాన్ని సమర్థించడం జరిగింది. అందువల్ల ఇక్కడ 'విశేషేణ
సామాన్యసమర్థన రూప అర్థాంతరన్యాస అలంకారం' సిద్ధించింది.
నవమ సర్గ శ్లోకం 059
వీక్ష్య రత్నచషకేష్వతిరిక్తాం
కాంతదంతపదమండనలక్ష్మీమ్ ।
జజ్ఞిరే బహుమతాః ప్రమదానామోష్ఠయావకనుదో
మధువారాః ॥
ప్రతిపదార్థం
రత్నచషకేషు = రత్నఖచితమైన (లేదా స్ఫటికమయ)
పానపాత్రలందు, అతిరిక్తాం = (పెదవులపై ఉన్న లాక్షారసం కరిగిపోవడం
వల్ల మునుపటి కంటే) స్పష్టముగా ప్రకాశిస్తున్న, కాంత-దంతపద-మండన-లక్ష్మీం
= ప్రియుడు చేసిన దంత క్షతము (పంటి గాయము) అనెడి అలంకారము యొక్క శోభను
(ప్రతిబింబమును), వీక్ష్య = చూచి, ఓష్ఠ-యావక-నుదః =
పెదవులపై ఉన్న లాక్షారసమును (ఎరుపు రంగును) పోగొట్టేవి అయినప్పటికినీ, మధువారాః =
మద్యపానము యొక్క ఆవృత్తులు, ప్రమదానాం = ఆ కాంతలకు, బహుమతాః = మిక్కిలి
ఇష్టమైనవిగా, జజ్ఞిరే = ఆయెను (మారెను).
తాత్పర్యం
కాంతలు తమ పెదవులకు లాక్షారసాన్ని (ఎర్రని
పూతను) అలంకారంగా పూసుకున్నారు. అయితే మద్యం తాగుతున్న కొద్దీ ఆ మద్యం ప్రభావం
వల్ల పెదవులపై ఉన్న ఆ లాక్షారసం కరిగిపోయింది. సాధారణంగా స్త్రీలకు తమ అలంకారం
పాడైతే నచ్చదు. కానీ ఇక్కడ ఆ లాక్షారసం కరిగిపోవడం వల్ల, రత్నపాత్రలలో
ప్రతిబింబించిన వారి పెదవులపై ప్రియుడు చేసిన దంత క్షతాల (పంటి గాయాల) గుర్తులు
మరింత స్పష్టంగా, అందంగా కనిపించాయి. తమ ప్రియుని అనురాగ చిహ్నమైన ఆ
దంత క్షతాల శోభను చూసుకుని మురిసిపోతూ,
తమ పెదవుల రంగును పోగొట్టినప్పటికీ ఆ
మద్యపాన క్రమాలను (మద్యం తాగే ఒక పద్ధతి, వరుస లేదా విడతలు మద్యపానము చేసే ఒక క్రమమైన పద్ధతి). ఆ సుందరీమణులు
ఎంతో ఇష్టపడ్డారు.
విశేషాలు
మల్లినాథుని వ్యాకరణ వివరణ ప్రకారం 'బహుమతాః' అనే పదం
వర్తమానార్థంలో క్త ప్రత్యయం రాగా ఏర్పడింది, దీని యోగం వల్ల 'ప్రమదానామ్' అనే పదానికి షష్ఠీ
విభక్తి వచ్చింది. 'జజ్ఞిరే' అనగా జాతాః
(ఆయెను). లోకంలో అలంకరణను పాడుచేసే వస్తువులపై కోపం రావడం సహజం. కానీ ఇక్కడ మద్యం
పెదవుల రంగును పోగొట్టినా (యావకనుదః),
అది ప్రియుని ప్రేమకు గుర్తులైన దంత
క్షతాల అందాన్ని బయటపెట్టింది. ఆ ప్రేమ చిహ్నాలు కనిపించడమే వారికి పరమానందాన్ని
ఇచ్చింది కాబట్టే, ఆ మద్యపానాన్ని వారు అమితంగా గౌరవించారు. ఇక్కడ
శృంగార రస భావన అత్యంత సూక్ష్మంగా వర్ణించబడింది.
నవమ సర్గ శ్లోకం 060
లోచనాధరకృతాహృతరాగా వాసితాననవిశేషితగంధా ।
వారుణీ పరగుణాత్మగుణానాం వ్యత్యయం వినిమయం
తు వితేనే ॥
ప్రతిపదార్థం
[మధుపానాత్ = మద్యపానము వల్ల, విలోచనేషు =
కన్నులయందు, రాగోత్పత్తిః = ఎరుపు రంగు పుట్టడం, అధరేభ్యః చ =
పెదవుల నుండి, లాక్షారాగనివృత్తిః = లాక్షారసము (ఎరుపు రంగు)
తొలగిపోవడం, మధ్వాననయోః చ = మద్యము మరియు ముఖములకు, అన్యోన్యగంధసంక్రాంతిః
= పరస్పరము సువాసనలు మారడం జరుగుతుంది,
ఇతి స్థితే సతి = అనే లోక స్థితిని బట్టి, ఉత్పేక్షతే = ఇక్కడ
ఊహించబడుచున్నది] వారుణీ = వారుణీ మదిర (మద్యము), లోచన-అధర-కృత-ఆహృత-రాగా
= కన్నులకు ఎరుపు రంగును కలిగించినట్టియు మరియు పెదవుల నుండి ఎరుపు రంగును
హరించినట్టియు, వాసిత-ఆనన-విశేషిత-గంధా = (తన సువాసన చేత) ముఖమును
సుగంధభరితము చేసినట్టియు మరియు (కాంత ముఖ సంపర్కము వల్ల) తన గంధమునకు గొప్ప
విశిష్టతను పొందినట్టిదై, పరగుణ-ఆత్మగుణానాం = ఎదుటివారి గుణములకు (కన్నులు, పెదవుల గుణములకు)
మరియు తన స్వంత గుణములకు, వ్యత్యయం ను = పొరపాటున జరిగిన మార్పిడియో
అన్నట్లు, వినిమయం తు = లేదా బుద్ధిపూర్వకముగా చేసుకున్న
అన్యోన్య వినిమయమో (మార్పిడియో) అన్నట్లు, వితేనే =
విస్తరింపజేసెను (కలిగించెను).
తాత్పర్యం
మద్యం తాగడం వల్ల కాంతల కళ్లు ఎర్రబడ్డాయి, కానీ వారి పెదవులపై
ఉన్న ఎర్రని లాక్షారసం కరిగిపోయింది. అలాగే మద్యము యొక్క సువాసన స్త్రీల ముఖానికి
అంటుకుంది, స్త్రీల ముఖము యొక్క సహజ సువాసన మద్యానికి
అంటుకుంది. ఈ మార్పులను చూసి మల్లినాథసూరి ఒక అద్భుతమైన ఊహను (ఉత్ప్రేక్షను)
వివరిస్తున్నారు: "ఈ వారుణీ మద్యం లోకంలోని గుణాల స్థానాలను మార్చివేసింది.
అది పెదవులపై ఉండవలసిన ఎరుపును కన్నులకు ఇచ్చింది, కన్నులలో ఉండవలసిన
తెలుపును (రాగరాహిత్యాన్ని) పెదవులకు ఇచ్చింది. అలాగే తన సువాసనను ముఖానికి ఇచ్చి, ముఖపు సువాసనను
తాను తీసుకుంది. ఈ విధంగా ఎదుటి వస్తువుల గుణాలకు, తన స్వంత గుణాలకు
మధ్య జరిగిన ఈ అద్భుత మార్పిడి... పొరపాటున జరిగిందా (వ్యత్యయము) లేక
బుద్ధిపూర్వకంగా చేసుకున్న అన్యోన్య వ్యాపారమా (వినిమయము) అన్నట్లుగా ఆ మద్యం ఈ
స్థితిని వ్యాపింపజేసింది."
విశేషాలు
మల్లినాథసూరి ఘంటాపథ వ్యాఖ్యానంలో దీని
వ్యాకరణ, అలంకార విశేషాలను అత్యంత సూక్ష్మంగా చర్చించారు.
వ్యాకరణ రీత్యా 'లోచనాధరమ్' అనే పదంలో 'సముద్రాభ్రాద్ధః' అనే జ్ఞాపకం వల్ల
అధర శబ్దానికి పూర్వనిపాతం (ముందు రావడం) జరగలేదు. 'కృతాహృతరాగా' అనే చోట విశేషణ
సమాసం వచ్చింది. అనగా కన్నులయందు రాగాన్ని కలిగించి (కృత), అధరం నుండి
రాగాన్ని హరించింది (ఆహృత) అని అర్థం. అలాగే 'వాసితాననవిశేషితగంధా' అనే పదంలో
బహువ్రీహి విశేషణ సమాసాలు వచ్చాయి. దీనివల్ల మద్యం వల్ల ముఖానికి గంధ సంక్రాంతి, ముఖం వల్ల
మద్యానికి గంధ సంక్రాంతి జరిగాయని సిద్ధించింది.
ఇక అలంకార విషయానికి వస్తే—మల్లినాథుల
వివరణ ప్రకారం 'వ్యత్యయము' అంటే పొరపాటున
(ప్రామాదికముగా) వస్తువుల స్థానాలు మారడం; 'వినిమయము' అంటే
బుద్ధిపూర్వకంగా ఒకదానికి ఒకటి మార్చుకోవడం (కొనుగోలు లాంటిది). ఇక్కడ లోకంలో
జరిగే మద్యపాన శారీరక మార్పులను (కళ్లు ఎర్రబడటం, పెదవుల రంగు పోవడం)
ఒక అభేద అధ్యవసాయం ద్వారా ఏకం చేసి,
వాటిని గుణాల వ్యత్యయ వినిమయాలుగా ఊహించడం
జరిగింది. ఇక్కడ 'ను'
అనే శబ్దాన్ని సంశయార్థంలో
ఉపయోగించినప్పటికీ, వ్యంజక పదాలు నేరుగా లేకపోవడం వల్ల ఇది 'ప్రతీయమాన
ఉత్ప్రేక్షా అలంకారం' అవుతుంది. అతిశయోక్తి మూలకమైన ఉత్ప్రేక్షగా దీనిని
మల్లినాథులు సంక్షిప్తంగా నిరూపించారు.
నవమ సర్గ శ్లోకం 061
తుల్యరూపమసితోత్పలమక్ష్ణోః కర్ణగం
నిరుపకారి విదిత్వా ।
యషితః సుహృదివ ప్రవిభేజే
లంభితేక్షణరుచిర్మదరాగః ॥
ప్రతిపదార్థం
లంభితేక్షణరుచిః = (కాంతల) కన్నులకు
నూతనమైన ఎర్రని కాంతిని కలిగించినట్టి,
మదరాగః = మద్యము వల్ల కలిగిన మత్తు అనెడి
ఎరుపు రంగు, అక్ష్ణోః = కన్నులతో, తుల్యరూపం =
సమానమైన రూపము కలిగినట్టియు, కర్ణగం = చెవులకు అలంకారముగా ధరించబడినట్టియు, అసితోత్పలం =
నల్లకలువ పువ్వును, నిరుపకారి = (నేడు ఏ విధమైన శోభను పెంచలేకపోవుట
చేత) నిరుపయోగమైనదిగా, విదిత్వా = తెలుసుకొని, సుహృత్ ఇవ = ఆ
నల్లకలువకు మంచి స్నేహితుడో అన్నట్లుగా, యోషితః = ఆ కాంత
యొక్క (ముఖమును), ప్రవిభేజే = (కన్నులను ఎర్రగా మార్చి) వర్ణ
భేదమును కలిగించెను.
తాత్పర్యం
కాంతలు తమ చెవులకు నల్లకలువ పూలను
అలంకారంగా ధరించారు. అయితే వారి కళ్లు కూడా నల్లకలువల్లాగే నల్లగా, విశాలంగా చెవుల
వరకు వ్యాపించి ఉన్నాయి. ఆ సమయంలో వారు మద్యం తాగడం వల్ల వారిలో మత్తు (మదరాగం)
ప్రవేశించి, కళ్లను ఎర్రగా మార్చింది. దీనిపై మల్లినాథసూరి
అద్భుతమైన ఊహను వివరిస్తున్నారు: "ఆ మదరాగం ఒక మంచి స్నేహితుడిలా
ఆలోచించింది. చెవికి అలంకారమైన నల్లకలువ, పక్కనే ఉన్న నల్లని
కళ్లతో సమాన రూపం కలిగి ఉండడం వల్ల ప్రత్యేకంగా ఏ శోభను ఇవ్వలేకపోతోంది
(నిరుపకారమైంది). అందుకే ఆ మదరాగం ఒక సుహృత్తులా వచ్చి, కాంతల కళ్లను
ఎర్రగా మార్చడం ద్వారా నల్లని కలువ పువ్వుకు, కళ్లకు మధ్య
స్పష్టమైన వర్ణ భేదాన్ని (వైవిధ్యాన్ని) సృష్టించింది." ఆ రంగుల కలయిక వల్ల
ముఖానికి ఒక అపూర్వమైన విచ్ఛిత్తి (అందం) సిద్ధించింది.
విశేషాలు
మల్లినాథుని ఘంటాపథ వ్యాఖ్యానం ప్రకారం
ఇక్కడ 'నిరుపకారి' అనే పదానికి
అంతరార్థం ఏమిటంటే—కాంతల కళ్లే కర్ణాంత విశ్రాంతాలు (చెవుల వరకు సాగినవి) కావడం
వల్ల, చెవిలో ఉన్న కలువ పువ్వు ఇవ్వవలసిన శోభను ఆ కళ్లే
ముందే ఇచ్చేస్తున్నాయి, కాబట్టి కలువ పువ్వు నిరుపకారమైంది. 'మదరాగః' అంటే మద్యం వల్ల
కలిగిన ఎరుపు, ఇది కలువకు అరిష్టాన్ని (సమాన రూపం వల్ల కలిగిన
అనాదరాన్ని) దూరం చేసింది కాబట్టి దానికి 'సుహృత్తు' (స్నేహితుడు)
తో పోలిక వచ్చింది. 'ప్రవిభేజే' అనగా కళ్లను ఎర్రగా
మార్చి కలువ నలుపు నుండి వేరు చేయడం. ఇలా మదరాగం స్నేహితునిలా ప్రవర్తించిందని
ఊహించడం వల్ల ఇక్కడ 'ఉత్ప్రేక్షా అలంకారం' సిద్దించింది.
నవమ సర్గ శ్లోకం 062
క్షీణయావకరసోప్యతిపానైః
కాంతదంతపదసంభృతశోభః ।
ఆయయావతితరామివ వధ్వాః
సాంద్రతామధరపల్లవరాగః ॥
ప్రతిపదార్థం
అతిపానైః = అమితముగా మద్యపానము చేయుట చేత, క్షీణయావకరసః అపి =
నశించిన లాక్షారసము (పెదవుల ఎరుపు పూత) కలిగినదైనప్పటికినీ, కాంత-దంతపద-సంభృత-శోభః
= ప్రియుని యొక్క దంత క్షతము (పంటి గాయము) చేత సంపాదించబడిన నూతన శోభ కలిగినట్టి, వధ్వాః = ఆ కాంత
యొక్క, అధరపల్లవరాగః = చిగురుటాకు వంటి పెదవి యొక్క ఎరుపు
దనము, అతితరాం = మిక్కిలి ఎక్కువగా, సాంద్రతాం =
దట్టమును (ఘనత్వమును), ఆయయౌ ఇవ = పొందినదో అన్నట్లుగా ఉన్నది.
తాత్పర్యం
అమితంగా మద్యం తాగడం వల్ల ఆ కాంతల
పెదవులపై ఉన్న లాక్షారసం (కృత్రిమ ఎరుపు రంగు) పూర్తిగా కరిగిపోయింది. రంగు
పోయినప్పటికీ, వారి పెదవులపై ప్రియుడు అనురాగంతో చేసిన దంత
క్షతాల (పంటి గాయాల) గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రేమ చిహ్నాల వల్ల ఆ
కాంతల అధరపల్లవ రాగం (పెదవుల సహజ ఎరుపు) మునుపటి కంటే చాలా దట్టంగా, గాఢంగా మారినట్లు
తోచింది. ప్రియుని ఉపభోగ చిహ్నాలతో అలంకరింపబడిన కామినీ అవయవాలకు మరే ఇతర కృత్రిమ
అలంకారాలతో పనిలేదు కదా!
విశేషాలు
మల్లినాథుని వ్యాకరణ వివరణ ప్రకారం 'అతితరామ్' అనే పదం
అతిశయార్థంలో 'కిమేత్తిఙవ్యయ...' అనే సూత్రం చేత ఆము
ప్రత్యయం రాగా, 'తద్ధితశ్చాసర్వవిభక్తిః' అనే నియమం ద్వారా
అవ్యయ సంజ్ఞను పొందింది. ఇక్కడ అలంకార చమత్కారం ఎంతో రమణీయమైనది. పెదవులపై ఉన్న
ఎరుపు రంగు క్షీణించినప్పటికీ (క్షీణః అపి), అది మరింత 'సాంద్రతను' (ఘనత్వాన్ని)
పొందింది అని చెప్పడం వల్ల పైకి 'విరోధాభాస' కనిపిస్తుంది. కానీ, దానికి గల నిజమైన
కారణాన్ని 'కాంతదంతపద...' అనే విశేషణం ద్వారా
(ప్రియుడి దంత క్షతాల వల్ల ఆ అందం పెరిగింది అని) సమర్థించడం వల్ల ఇక్కడ 'కావ్యలింగ అలంకారం' సిద్ధించింది. ఈ
కావ్యలింగంతో కూడిన విరోధ పరిహారమే 'ఉత్ప్రేక్షా అలంకారం' కు దారితీసింది.
నవమ సర్గ శ్లోకం 063
రాగకాంతనయనేషు నితాంతं విద్రుమారుణకపొలతలేషు ।
సర్వగాపి దదృశే వనితానాం దర్పణేష్వివ
ముఖేషు మదశ్రీః ॥
ప్రతిపదార్థం
వనితానాం = కాంతల యొక్క, సర్వగా అపి =
(శరీరమంతటా) సమస్త అవయవములందును వ్యాపించి ఉన్నప్పటికినీ, మదశ్రీః = మద్యం
వల్ల కలిగిన మత్తు శోభ, రాగకాంతనయనేషు = ఎరుపు దనము చేత సుందరములైన
కన్నులు కలిగినట్టియు, విద్రుమ-అరుణ-కపోలతలేషు = పగడము వలె ఎర్రనైన
బుగ్గల ఉపరితలములు కలిగినట్టియు, ముఖేషు ఏవ = ముఖములందు మాత్రమే, దర్పణేషు ఇవ =
అద్దములందు వలె, నితాంతం = మిక్కిలి స్పష్టముగా, దదృశే =
కనిపించెను.
తాత్పర్యం
మద్యం తాగడం వల్ల కలిగిన మత్తు శోభ
(మదశ్రీ) ఆ కాంతల శరీరమంతటా, సర్వ అవయవాలలోనూ సమానంగానే వ్యాపించింది.
అయినప్పటికీ, ఆ మత్తు యొక్క అసలైన అందం మాత్రం వారి ముఖాల్లోనే
అత్యంత స్పష్టంగా కనిపించింది. ఎరుపు దనంతో మెరుస్తున్న వారి కళ్లు, పగడాల్లా ఎర్రబడిన
వారి బుగ్గలు కలిగిన ఆ ముఖాలు నిర్మలమైన అద్దాల వలె ప్రకాశిస్తూ, ఆ మదశోభను అందరికీ
స్పష్టంగా ప్రతిబింబింపజేశాయి.
విశేషాలు
మల్లినాథసూరి వ్యాకరణ రీత్యా 'సర్వగా' అనే పదం 'అంతాత్యంత...' అనే సూత్రం ఆధారంగా
డ ప్రత్యయం రాగా ఏర్పడిందని వివరించారు. ఇక్కడ అలంకార వైచిత్రిని గమనిస్తే—మదశోభ
శరీరం అంతటా ఉన్నప్పటికీ (సర్వగా అపి),
అది కేవలం ముఖాల్లోనే కనిపించింది
(ముఖేష్వేవ దదృశే) అని చెప్పడం వల్ల ఇక్కడ 'విరోధ అలంకారం' స్ఫురిస్తోంది.
అయితే, ముఖంలో ఉన్న కళ్లు, కపోలాలు నిర్మలంగా
ఉండడం వల్లే ఆ రాగమంతా అక్కడ వ్యక్తమయింది అనే కారణాన్ని ముఖ విశేషణాల ద్వారా
సమర్థించడం వల్ల ఆ విరోధం పరిహారమయింది. కాబట్టి ఇది కావ్యలింగ అనుప్రాణితమైన 'విరోధవదాభాస
అలంకారం'. ఇది ముఖాలను అద్దాలతో పోల్చిన 'ఉపమా అలంకారం' తో కలిసి ఉండడం చేత
ఇక్కడ అలంకార సంసృష్టి ఏర్పడింది.
నవమ సర్గ శ్లోకం 064
బద్ధకోపవికృతీరపి
రామాశ్చారుతాభిమతతాముపనిన్యే ।
వశ్యతాం మధుమదో
దయితానామాత్మవర్గహితమిచ్ఛతి సర్వః ॥
ప్రతిపదార్థం
బద్ధకోపవికృతీః అపి = పూనబడిన ప్రణయ కోపము
వల్ల కలిగిన ముఖవికారములతో కూడినవారైనప్పటికినీ, రామాః = ఆ
సుందరీమణులను, చారుతా = (వారి సహజమైన) సౌందర్యము, అభిమతతాం = ప్రియుల
యొక్క అమితమైన ప్రేమాదరములకు (వల్లభత్వమునకు), ఉపనిన్యే =
చేర్చెను, మధుమదః = మద్యము యొక్క మత్తు, దయితానాం =
ప్రియులకు, వశ్యతాం = లోబడునట్లుగా (విధేయులుగా), ఉపనిన్యే = చేసెను, [తథాహి
= అది ఎలాగనగా], సర్వః = ప్రతి ఒక్కరును, ఆత్మవర్గహితం = తన
వర్గమునకు (జాతికి) మేలు జరుగుటను, ఇచ్ఛతి = కోరుకుంటారు కదా.
తాత్పర్యం
కాంతలు ప్రణయ కోపంతో ముఖాలు ముడుచుకుని
వికారంగా ఉన్నప్పటికీ, వారి సహజ సౌందర్యం ఆ కోపపు వికారాలను కూడా
ప్రియులకు ఎంతో అందంగా, ఇష్టంగా తోచేలా చేసింది. అలాగే వారు తాగిన మద్యపు
మత్తు, వారిని ప్రియులకు పూర్తిగా లొంగిపోయేలా
(విధేయులుగా) మార్చింది. దీనిపై మల్లినాథసూరి ఒక అద్భుతమైన లోక న్యాయాన్ని
జోడిస్తూ వివరిస్తున్నారు: "లోకంలో ఎవరైనా సరే తన వర్గానికి చెందినవారి
మేలునే కోరుకుంటారు. ఇక్కడ 'చారుతా' (సౌందర్యము) అనేది
స్త్రీలింగ పదం కాబట్టి అది తన వర్గమైన స్త్రీలకు (రామాలకు) ఉపకారం చేస్తూ, వారి కోపాన్ని కూడా
అందంగా మార్చి ప్రియులకు నచ్చేలా చేసింది. 'మధుమదః' (మద్యపు
మత్తు) అనేది పుంలింగ పదం కాబట్టి, అది తన వర్గమైన పురుషులకు (ప్రియులకు) ఉపకారం
చేస్తూ, ఆ కోపిష్టి కాంతలను వారికి వశమయ్యేలా
చేసింది."
విశేషాలు
మల్లినాథుని ఘంటాపథ వ్యాఖ్యానం ప్రకారం
ఇక్కడ ఒక అద్భుతమైన చమత్కారం ఉంది. 'ముఖం వికారంగా ఉన్నా ఇష్టపడ్డారు' మరియు 'కోపంగా ఉన్నా
లోబడ్డారు' అని చెప్పడం వల్ల పైకి 'విరోధము' స్ఫురిస్తున్నా, దానికి గల కారణాలను
'సౌందర్యము' మరియు 'మద్యపు మత్తు' అనే స్త్రీ-పురుష
లింగ వర్గీకరణల ద్వారా చక్కగా పరిష్కరించడం జరిగింది. ఇలా విరోధాన్ని పరిహరించడం
వల్ల ఇక్కడ 'విరోధాభాస అలంకారం' సిద్దించింది. ఈ
విరోధాభాస 'ప్రతి ఒక్కరు తన వర్గం మేలు కోరుకుంటారు' అనే లోక
ప్రసిద్ధమైన సామాన్య వాక్యం చేత సమర్థించబడడం వల్ల ఇక్కడ 'అర్థాంతరన్యాస
అలంకారము' తో సంసృష్టి ఏర్పడింది.
నవమ సర్గ శ్లోకం 065
వాససాం శిథిలతాముపనాభి హీనిరాసమపదే
కుపితాని ।
యషితాం విదధతీ గుణపక్షే నిర్మమార్జ మదిరా
వచనీయమ్ ॥
ప్రతిపదార్థం
ఉపనాభి = నాభి (బొడ్డు) సమీపమునందు, వాససాం = వస్త్రముల
యొక్క, శిథిలతాం = సడలిపోవుటను (జారిపోవుటను), హీనిరాసం = లజ్జను
విడిచిపెట్టుటను (సిగ్గు నశించుటను),
అపదే = అకారణముగా (అసమయమునందు), కుపితాని =
కోపగించుకొనుటలను, యోషితాం = కాంతల యొక్క, గుణపక్షే = గుణముల
కోవలోకి (గుణకోటిలోకి), విదధతీ = చేరుస్తూ ఉన్నట్టి, మదిరా = ఆ మదిర
(మద్యము), వచనీయం = (శాస్త్ర నిషిద్ధ ప్రవర్తన వల్ల కలిగే)
నిందను, నిర్మమార్జ = పూర్తిగా తుడిచివేసెను.
తాత్పర్యం
మద్యం సేవించడం వల్ల ఆ కాంతల నడుము ముడులు
సడలి వస్త్రాలు బొడ్డు కిందకు జారిపోతున్నాయి. వారిలోని సిగ్గు పూర్తిగా
నశించింది. వారు అకారణంగా, అసమయాల్లో కోపతాపాలను ప్రదర్శిస్తున్నారు. లోకంలో
ఇవన్నీ దోషాలు (తప్పులు) అయినప్పటికీ,
ఆ మధుపాన సమయంలో మదిర వీటన్నింటినీ 'గుణాల' కిందకు
మార్చేసింది. ఆ సమయంలో వస్త్రాలు సడలడం, సిగ్గు పోవడం వంటి
చేష్టలన్నీ వారి శృంగార శోభను రెట్టింపు చేసి ప్రియులకు అమితానందాన్ని కలిగించాయి.
అందువల్ల, 'నాభిని బయటకు చూపరాదు' అనే శాస్త్ర
నిషిద్ధ నియమాన్ని ఉల్లంఘించినా కూడా,
ఆ మదిర వారిపై ఎటువంటి నింద (వచనీయము)
పడకుండా పూర్తిగా తుడిచిపెట్టేసింది;
ఎందుకంటే ఆ అవస్థలో ఆ దోషాలే గొప్ప
గుణాలుగా మారాయి.
విశేషాలు
మల్లినాథసూరి వ్యాఖ్యాన వివరణ ప్రకారం 'ఉపనాభి' అనేది నాభి సమీపము
అనే అర్థంలో అవ్యయీభావ సమాసం. శాస్త్రాలలో 'న నాభిం దర్శయేత్' (స్త్రీ
తన నాభిని బయటకు ప్రదర్శించరాదు) అనే నిషేధం ఉంది. అయితే మద్యోద్రేకంలో ఉన్నప్పుడు
స్త్రీలు చేసే ఇటువంటి పనులను లోకం తప్పు పట్టదు సదా, పైగా అవి శృంగార
ఉద్దీపకాలుగా మారుతాయి. ఇలా వస్త్ర శైథిల్యాది 'దోషాలను' కూడా 'గుణాలుగా' మార్చి, నిందను తొలగించే
శక్తి ఆ మదిరకు ఉందని చెప్పడం ద్వారా ఇక్కడ కావ్య చమత్కారం అత్యంత హృద్యంగా
వర్ణించబడింది.
నవమ సర్గ శ్లోకం 066
భర్తృషూపసఖి నిక్షిపతీనామాత్మనో
మధుమదోద్యమితానామ్ ।
బ్రీడయా విఫలయా వనితానాం న స్థితం న విగతం
హృదయేషు ॥
ప్రతిపదార్థం
ఉపసఖి = (తమకు తోడుగా ఉన్న)
స్నేహితురాండ్ర సమీపమునందే, మధుమద-ఉద్యమితానాం = మద్యము యొక్క మత్తు చేత
ప్రేరేపించబడినవారై, ఆత్మనః = తమ శరీరములను, భర్తృషు = భర్తల
(ప్రియుల) పై, నిక్షిపతీనాం = పడవేస్తున్నట్టి
(వాలిపోవుచున్నట్టి), వనితానాం = అనురాగవతులైన ఆ కాంతల యొక్క, హృదయేషు =
హృదయములలో, విఫలయా = (మదోద్రేకము వల్ల) వ్యర్థమైపోయిన, బ్రీడయా = లజ్జ
(సిగ్గు) అనేది, న స్థితం = పూర్తిగా నిలిచి ఉండలేదు, న విగతం = అలాగని
పూర్తిగా తొలగిపోనూ లేదు.
తాత్పర్యం
ఆ కాంతలు తమ స్నేహితురాండ్రు పక్కనే
ఉన్నారనే విషయాన్ని కూడా మరచిపోయి, మద్యపు మత్తు ఇచ్చిన ధైర్యంతో తమ శరీరాలను నేరుగా
భర్తల కౌగిలిలోకి పడవేస్తున్నారు (వారిపై వాలిపోతున్నారు). ఆ సమయంలో వారి మనసులలో
సిగ్గు (లజ్జ) అనేది ఒక విచిత్రమైన అవస్థను పొందింది. తాము చేస్తున్న అనుచిత
ప్రవర్తన వల్ల అది పూర్తిగా నిలిచి ఉండలేకపోయింది; అలాగని మత్తులో
ఉన్నప్పటికీ సంస్కారవతులైన ఆ స్త్రీల హృదయాల నుండి అది పూర్తిగా వెళ్ళిపోనూ లేదు.
ఆ సిగ్గు లోపల అలా ఊగిసలాడుతూ ఉండిపోయింది.
విశేషాలు
మల్లినాథుని వైజంతీ కోశ వివరణ ప్రకారం 'ఆత్మా' అనగా జీవుడు, ధైర్యము, శరీరము లేదా
స్వభావము (ఆత్మా జీవే ధృతౌ దేహే స్వభావే పరమాత్మని); ఇక్కడ దేహము
(శరీరము) అని అర్థం. 'ఉపసఖి'
అనేది సఖీ సమీపము అనే అర్థంలో అవ్యయీభావ
సమాసం. విశ్వకోశం ప్రకారం 'వనితా'
అంటే అమితమైన అనురాగము గల స్త్రీ (వనితా
జనితాత్యర్థానురాగాయాం చ యోషితి). 'నిక్షిపతీనామ్' అనే రూపంలో 'ఆచ్ఛీనద్యోర్నుమ్' అనే సూత్రం ప్రకారం
వికల్పంగా నుమ్ ఆగమం రాలేదు. ఇక్కడ సిగ్గు పూర్తిగా ఉండడం గాని, పూర్తిగా పోవడం
గాని జరగలేదు. ఈ 'ఉభయ నిషేధము' పైకి విరోధంగా
అనిపించినా, మదోద్రేకము వల్ల ఆ సిగ్గు వైఫల్యాన్ని
(నిష్ప్రయోజనత్వాన్ని) పొందింది అని చెప్పడం ద్వారా ఆ విరోధం పరిహారమయింది.
నవమ సర్గ శ్లోకం 067
రుంధతీ నయనవాక్యవికాసం సాదితోభయకరా
పరిరమ్భే ।
బ్రీడితస్య లలితం యువతీనాం క్షివతా
బహుగుణైరనుజహ్రే ॥
ప్రతిపదార్థం
నయన-వాక్య-వికాసం = కన్నుల యొక్క మరియు
మాటల యొక్క ప్రగల్భతను (వికాసమును),
రుంధతీ = అడ్డుకుంటున్నట్టియు
(ప్రతిబంధిస్తున్నట్టియు), పరిరమ్భే = ఆలింగన సమయమునందు, సాదిత-ఉభయకరా =
(ప్రియుడు గట్టిగా కౌగిలించుకున్నప్పుడు) స్తంభించిపోయిన రెండు చేతులు కలిగినట్టి, యువతీనాం = ఆ
యువతుల యొక్క, క్షివతా = మత్తత (మైకము), బహుగుణైః = (దృష్టి
సంకోచము మొదలైన) అనేక చేష్టల ద్వారా,
బ్రీడితస్య = సిగ్గు యొక్క, లలితం = విలాసమును, అనుజహ్రే =
అనుకరించెను.
తాత్పర్యం
మద్యం వల్ల కలిగిన మైకము (క్షివతా) కాంతల
కళ్ల చూపులను, వారి నోటి మాటల ప్రగల్భతను అణచివేసింది (దానివల్ల
వారు కళ్లు తేలవేస్తూ, మాటలు తడబడుతూ ఉన్నారు). ప్రియుడు
కౌగిలించుకునేటప్పుడు వారి రెండు చేతులు స్తంభించిపోయి కదలకుండా ఉండిపోయాయి.
చిత్రమేమిటంటే, మద్యం వల్ల కలిగిన ఈ 'మత్తత' చేసే పనులన్నీ
(కళ్లు మూతపడటం, మాట రాకపోవడం, చేతులు స్తంభించడం), ఒక అమాయకపు నాయిక
సిగ్గుపడినప్పుడు (బ్రీడ) చేసే పనుల లాగే ఉన్నాయి. ఈ విధంగా ఆ కాంతలలోని మత్తు, తమ అనేక గుణాల చేత 'సిగ్గు' యొక్క విలాసవంతమైన
చేష్టలను అచ్చుగుద్దినట్లుగా అనుకరించింది.
విశేషాలు
మల్లినాథుని వ్యాకరణ వివరణ ప్రకారం 'క్షీవతా' అనే పదం క్షివ్
(మత్తునొందు) ధాతువు నుండి అనుపసర్గముగా 'ఫుల్లక్షివకృశోల్లాఘాః' అనే నిపాతనా సూత్రం
ద్వారా సిద్ధించింది. క్షిబ అనగా మత్తుడు, వాని భావము క్షివతా
(త్వతలోర్గుణవచనస్య పుంవద్భావో వక్తవ్యః అనే నియమంతో పుంవద్భావం వచ్చింది). ' వ్రీడితస్య' అనగా భావార్థంలో
క్త ప్రత్యయం వచ్చి లజ్జ అని అర్థం. లోకంలో సిగ్గుపడే స్త్రీ కూడా కళ్లు
దించేసుకుంటుంది, మాట్లాడలేదు, కౌగిలింతలో చేతులు
ముడుచుకుంటుంది. ఇక్కడ మద్యం వల్ల కలిగిన మత్తు కూడా సరిగ్గా అవే పనులను
(కృత్యాలను) చేసింది. ఇలా మత్తు అనేది సిగ్గు యొక్క కార్యాలను చేయడం ద్వారా
సిగ్గును అనుకరించిందని చెప్పడం వల్ల ఇక్కడ మనోహరమైన 'ఉపమా అలంకారము' సిద్ధించింది.
నవమ సర్గ శ్లోకం 068
యోషిదుద్ధతమనోభవరాగా మానవత్యపి యయౌ
దయితాఙ్గమ్ ।
కార్యత్యనిభృతా గుణదోషే వారుణీ ఖలు
రహస్యవిభేదమ్ ॥
ప్రతిపదార్థం
ఉద్ధత-మనోభవ-రాగా = మిక్కిలి ఉద్రేకించిన
మన్మథానురాగము కలిగిన, యోషిత్ = ఆ కాంత, మానవతీ అపి =
(అంతవరకు) తీవ్రమైన ప్రణయ కోపము గలదైనప్పటికినీ, దయిత-అఙ్కమ్ =
ప్రియుని యొక్క ఒడిని, యయౌ = చేరెను, [తథాహి = అది
ఎలాగనగా], అనిభృతా = చంచలమైన (దాచడం చేతకాని), వారుణీ = వారుణీ
మదిర, గుణదోషే = గుణముల యందును మరియు దోషముల యందును, రహస్యవిభేదమ్ =
రహస్యములను బద్దలు చేయుటను (గుట్టు రట్టు చేయుటను), కారయతి ఖలు = తప్పక
చేయిస్తుంది కదా.
తాత్పర్యం
మనసులో ఎంత తీవ్రమైన ప్రణయ కోపం (మానము)
ఉన్నప్పటికీ, ఆ కాంత లోపల ఉద్రేకించిన మన్మథుని ప్రేమాతిశయం
వల్ల తన కోపాన్ని పక్కన పెట్టి ప్రియుని ఒడిలోకి వెళ్ళిపోయింది; ఎందుకంటే కోపం కంటే
అనురాగమే బలమైనది కదా! అయితే, 'తనంతట తాను కోపం వీడి ప్రియుడి ఒడికి చేరింది' అనే చిన్నతనం (లాఘవ
దోషం) ఆమెకు రాకుండా ఆ మద్యం కాపాడింది. ఎందుకంటే, చంచలమైన ఆ వారుణీ
మద్యం మనుషుల మనసులలో దాగి ఉన్న గుణాలను, దోషాలను
(రహస్యాలను) బలవంతంగా బయటపెట్టి గుట్టు రట్టు చేస్తుంది. ఆ మద్యం వల్లే ఆమె తన
లోపలి ప్రేమాన్ని దాచుకోలేక, కోపాన్ని నటింపలేక ప్రియుడిని చేరింది కాబట్టి, ఆ ప్రమత్తత (మైకము)
అబుద్ధిపూర్వకమైనది కావడం వల్ల ఆమెపై ఎటువంటి తప్పు రాదు.
విశేషాలు
మల్లినాథసూరి వ్యాఖ్యానం ప్రకారం 'గుణదోషే' అనే పదం ద్వంద్వ
సమాసంలో 'విభాషైకవద్భవతి' అనే నియమం ద్వారా
ఏకవచన రూపంలో నిలిచింది; దీని అర్థం గుణాలు మరియు దోషాలు అని. 'రహస్యవిభేదమ్' అనగా గుట్టు రట్టు
చేయడం. మద్యం తాగినవాడు మనసులో ఎంత దాచాలని చూసినా దాచలేడు. ఇక్కడ నాయిక మనసులోని
నిగూఢ రాగ ప్రకటన, బాహ్య మాన త్యాగము అనేవి మద్యం వల్ల జరిగాయి.
మత్తులో జరిగిన పని కాబట్టి ఆమెకు లజ్జ లేదా లాఘవము అనే దోషం అంటదు. స్త్రీల
శృంగార మనస్తత్వాన్ని మల్లినాథులు ఇక్కడ అద్భుతంగా ఆవిష్కరించారు.
నవమ సర్గ శ్లోకం 069
ఆహితే ను మధునా మధురత్వే చేష్టితస్య గమితే
ను వికాసమ్ ।
ఆబభౌ నవ ఇవోద్ధతరాగః కామినీష్వవసరః
కుసుమేషోః ॥
ప్రతిపదార్థం
మధునా = మద్యము చేత, చేష్టితస్య = రతి
వ్యాపారము (శృంగార చేష్టల) యొక్క, మధురత్వే = మాధుర్యము (మనోహరత్వము), ఆహితే ను = (ముందే
లేనిది) కొత్తగా కలిగింపబడినదా ఏమి,
[లేక] = వికాసం = (ముందే ఉన్న మాధుర్యము)
గొప్ప ప్రकर्षను (వికాసమును), గమితే ను =
పొందింపబడినదా ఏమి, [ఇతి] = అని, ఉద్ధతరాగః =
అమితముగా ఉద్రేకించిన అనురాగము కలిగిన,
కుసుమేషోః = పుష్పబాణుడైన మన్మథుని యొక్క, కామినీషు = ఆ కాంతల
యందలి, అవసరః = ప్రవేశము (సమయము), నవః ఇవ =
సరికొత్తగా ఉన్నట్లు, ఆబభౌ = ప్రకాశించెను.
తాత్పర్యం
మద్యం సేవించడం వల్ల ఆ కాంతల ప్రతి శృంగార
చేష్ట ఎంతో మనోహరంగా, మధురంగా మారింది. దీనిపై కవి అద్భుతమైన సంశయాత్మక
ఊహను చేస్తున్నారు: "ఆ కాంతల చేష్టలలోని ఈ మాధుర్యం, ముందే లేనిదానిని ఆ
మద్యం కొత్తగా తెచ్చిపెట్టిందా (ఆహితే ను)? లేక వారిలో ముందే
ఉన్న సహజ మాధుర్యాన్ని ఆ మద్యం మరింతగా పెంచి పెద్దది చేసిందా (గమితే ను)?" ఏది
ఏమైనప్పటికీ, ఆ మదోద్రేకము వల్ల వారిలో అనురాగం పరాకాష్ఠకు
చేరింది. దాంతో, వారి హృదయాలలో ఎల్లప్పుడూ నివసించే ఆ మన్మథుడు, ఆ సమయంలో ఆ కాంతల
శృంగార లీలల మాధుర్యాన్ని చూసి, వారిలో మళ్లీ సరికొత్తగా, అపూర్వమైన
ఉత్సాహంతో ప్రవేశించాడా అన్నట్లుగా ఆ సమయం ప్రకాశించింది.
విశేషాలు
మల్లినాథుని వ్యాఖ్యానం ప్రకారం 'కుసుమేషుః' అనగా పుష్పబాణుడు
(మన్మథుడు). 'అవసరః'
అంటే ప్రవేశము లేదా సమయము. మన్మథుడు
స్త్రీలలో నిత్యం ఉండేవాడే అయినప్పటికీ, మద్యం వల్ల కలిగిన
తాత్కాలిక చేష్టల మాధుర్యం, రాగోద్రేకాల వల్ల ఆయన అపూర్వంగా, సరికొత్తగా
ఉద్దీపనమయ్యాడు. ఇక్కడ 'మద్యం మాధుర్యాన్ని కొత్తగా తెచ్చిందా లేదా
ఉన్నదానిని పెంచిందా' అనే రెండు భిన్నమైన కారణాల మధ్య సంశయముతో కూడిన ఊహ
చేయడం వల్ల ఇక్కడ 'సంశయానుప్రాణిత ఉత్ప్రేక్షా అలంకారము' అత్యంత రమణీయంగా
సిద్ధించింది.
నవమ సర్గ శ్లోకం 070
మా గమన్విమూఢధియో నః ప్రోజ్ఝ్య రన్తుమితి
శఙ్కితనాథాః ।
యషితో న మదిరాం భృశమీషుః ప్రేమ పశ్యతి
భయాన్యపదేపి ॥
ప్రతిపదార్థం
శంకితనాథాః = (మద్యోద్రేకము వల్ల పురుషుల
మనస్సులు ఎలా మారతాయోనని) భర్తలను శంకించునట్టి (నమ్మకము లేనట్టి), యోషితః = కాంతలు, మదేన = మద్యపు
మత్తు చేత, విమూఢధియః = స్తంభించిన బుద్ధి కలిగినవారై
(మతిభ్రమించినవారై), నః = మమ్ములను, ప్రోజ్ఝ్య =
విడిచిపెట్టి, రంతుం = (ఇతర స్త్రీలతో) రమించుట కొరకు, మా గమన్ =
వెళ్ళకుందురు గాక, ఇతి = అనే ఆలోచనతో, మదిరాం = మద్యాన్ని, భృశం = అమితముగా
(ఎక్కువగా), న ఈషుః = కోరలేదు (తాగలేదు), [తథాహి
= అది ఎలాగనగా], ప్రేమ = నిజమైన అనురాగము (స్నేహము), అపదే అపి = స్థానము
కాని చోట కూడా (అకారణముగా కూడా), భయాని = అరిష్టములను (భయములను), పశ్యతి = చూస్తుంది
(ఊహిస్తుంది) కదా.
తాత్పర్యం
మద్యపాన సమయాన కాంతలు ఒక విచిత్రమైన శంకకు
లోనయ్యారు. "మేము కనుక ఎక్కువగా మద్యం తాగి మత్తులో మునిగిపోతే, మా బుద్ధి పని
చేయదు (తెలివి తప్పుతాము). ఆ సమయంలో మా భర్తలు మమ్ములను అలాగే వదిలేసి, వేరే స్త్రీలతో
రమించడానికి వెళ్ళిపోతారేమో!" అని వారు భావించారు. ఈ భర్తృ వియోగ భయం వల్ల ఆ
కాంతలు ఎక్కువ మద్యం తాగడానికి ఇష్టపడలేదు, కేవలం కొద్దిగా
మాత్రమే తాగారు. నిజానికి, అమితమైన ప్రేమ ఎటువంటి ప్రమాదమూ లేని
సురక్షితమైన స్థానంలో కూడా లేనిపోని అరిష్టాలను, భయాలను
ఊహిస్తుంది కదా!
विशేషాలు
మల్లినాథసూరి ఘంటాపథ వ్యాఖ్యానంలో దీని
వ్యాకరణ మరియు అలంకార చమత్కారాన్ని అద్భుతంగా వివరించారు. వ్యాకరణ రీత్యా 'ప్రోజ్ఝ్య' అనే రూపంలో
ప్రపూర్వక 'ఉజ్ఝ్'
ధాతువుకు నఞ్ పూర్వకం కాని సమాసంలో క్త్వా
ప్రత్యయానికి ల్యప్ ఆదేశం వచ్చింది. 'మా గమన్' అనే చోట గమ్
ధాతువుకు 'మాఙి లుఙ్' సూత్రం చేత లుఙ్
లకారం వచ్చింది, అలాగే 'న మాఙ్యోగే' అనే నియమం వల్ల
అడాగమం నిషేధించబడింది. ఇక్కడ కాంతలు భర్తలపై ఉన్న అమితమైన ప్రేమ వల్లనే అకారణంగా
భయపడ్డారు. 'శంకకు కారణమైన ప్రేమయందే కర్తృత్వాన్ని ఆరోపించడం' ఇక్కడి శైలీ
విశేషం. 'కాంతలు మద్యం ఎక్కువగా తాగకపోవడం' అనే విశేషాంశం 'ప్రేమ అకారణంగా
కూడా భయాలను చూస్తుంది' అనే సామాన్య సత్యం చేత సమర్థించబడడం వల్ల ఇక్కడ 'అర్థాంతరన్యాస
అలంకారం' సిద్ధించింది.
నవమ సర్గ శ్లోకం 071
చిత్తనిర్వృతివిధాయి వివిక్తం మన్మథో
మధుమదః శశిభాసః ।
సంగమంచ దయితైః స్మ నయంతి ప్రేమ కామపి భువం
ధ్రువం ప్రమదానామ్ ॥
ప్రతిపదార్థం
చిత్త-నిర్వృతి-విధాయి = మనస్సుకు అమితమైన
సుఖాన్ని కలిగించే, వివిక్తం = ఏకాంత ప్రదేశము, మన్మథః = మన్మథుని
ప్రభావము, మధుమదః = మద్యము యొక్క మత్తు, శశిభాసః = చంద్రుని
యొక్క వెన్నెల కాంతులు, దయితైః సహ = ప్రియులతో కూడిన, సంగమః చ = కలయిక
(సల్లాపము) కూడా, ప్రమదానాం = ఆ కాంతల యొక్క, ప్రేమ =
(వియోగాన్ని భరించలేని అవస్థ కలిగిన) ప్రేమను, కాం అపి భువం =
వర్ణించశక్యము కాని ఒక అద్భుతమైన అవస్థకు (దశకు), ధ్రువం =
నిశ్చయముగా, నయంతి స్మ = చేర్చెను.
తాత్పర్యం
మనస్సుకు పరమ సుఖాన్ని ఇచ్చే ఏకాంత
ప్రదేశం, మన్మథోద్రేకము, మద్యము కలిగించిన
మత్తు, ఆకాశాన కురుస్తున్న చల్లని వెన్నెల, వీటన్నింటికీ తోడు
ప్రియులతో కూడిన రమ్యమైన కలయిక—ఇవన్నీ కలిసి ఆ కాంతల హృదయాలలోని ప్రేమాతిశయాన్ని
వర్ణించరాని ఒక అద్భుతమైన పరమావస్థకు (భూమికకు) చేర్చాయి. వారు కేవలం సాదాసీదా రతి
అవస్థలను దాటి, శృంగార రస నిధియైన పరమోన్నత క్రీడామయ దశను
చేరుకున్నారని నిశ్చయము.
విశేషాలు
మల్లినాథసూరి ఇక్కడ రసరత్నాకరం అనే అలంకార
శాస్త్ర గ్రంథం ఆధారంగా సంభోగ శృంగారంలోని ఏడు అవస్థలను అత్యంత శాస్త్రీయంగా
ఆవిష్కరించారు. 'వివిక్తమ్' అనగా ఏకాంతము
(వివిక్తం రహసి స్మృతమ్) అని విశ్వకోశం చెప్తోంది. 'దయితైః' అనే చోట 'వృద్ధో యూనా' అనే నిర్దేశం వల్ల 'సహ' అనే శబ్దాన్ని
నేరుగా ప్రయోగించకపోయినా సహార్థంలో తృతీయా విభక్తి వచ్చింది. రసరత్నాకరం ప్రకారం
సంభోగ శృంగారంలో ఏడు అవస్థలు క్రమంగా ఉంటాయి: ప్రేమా, అభిలాష, రాగము, స్నేహము, ప్రేమరతి, శృంగారము మరియు
సంభోగము (ప్రేమాభిలాషో రాగశ్చ స్నేహః ప్రేమరతిస్తథా, శృంగారశ్చేతి
సంభోగః సప్తావస్థః ప్రకీర్తితః).
వీటి లక్షణాలు ఏమిటంటే: రమ్యమైన
వస్తువులను చూడాలనే కోరిక 'ప్రేమ';
వాటి గురించి నిరంతరం చింతించడం 'అభిలాష'; ఎలాగైనా
కలవాలనే బుద్ధి 'రాగము';
దానికి తగినట్లుగా ప్రవర్తించడం 'స్నేహము'; ప్రియుని
ఎడబాటును క్షణకాలం కూడా భరించలేకపోవడం 'ప్రేమరతి' (ఇక్కడ
శ్లోకంలో ఉన్న ప్రేమ ఇదే); ఒకరితో ఒకరు కలిసి జీవించడం 'రతి'; ఇద్దరూ
కలిసి సమానంగా క్రీడించడం 'శృంగారము'. ఈ శ్లోకంలో ఏకాంతం, వెన్నెల, మద్యం వంటి
ఉద్దీపనల వల్ల కాంతలు తమ వియోగాసహ అవస్థ (ప్రేమరతి) నుండి అంతిమ అవస్థయైన 'శృంగార' క్రీడామయ దశకు
చేరుకున్నారని మల్లినాథులు అద్భుతంగా నిరూపించారు.
నవమ సర్గ శ్లోకం 072
ధాష్ట్యర్లఙ్ఘితయథోచితభూమౌ నిర్దయం
విలులితాలకమాల్యే ।
మానినీరతివిధౌ కుసుమేషుర్మత్తమత్త ఇవ
విభ్రమమాప ॥
ప్రతిపదార్థం
ధాష్ట్యేణ = ధాష్ట్యము (ప్రగల్భత లేదా
దిటవు) చేత, లఙ్ఘిత-యథోచిత-భూమౌ = దాటబడిన తగిన మర్యాద (మేర)
కలిగినట్టియు, నిర్దయం = దయలేకుండా (తీవ్రముగా), విలులిత-ాలక-మాల్యే
= అస్తవ్యస్తము చేయబడిన కురులు మరియు పూలమాలలు కలిగినట్టి, మానినీ-రతివిధౌ = ఆ
మానవతుల యొక్క సురత క్రీడ యందు, కుసుమేషుః = పుష్పబాణుడైన మన్మథుడు, మత్తమత్తః ఇవ =
బాగా మత్తెక్కిన వాని వలె, విభ్రమమాప = విజృంభణను పొందెను.
తాత్పర్యం
మల్లినాథసూరి పీఠిక ప్రకారం: ఇప్పుడు
క్రీడావస్థను (సురత క్రీడ యొక్క పరాకాష్ఠను) వర్ణిస్తున్నారు. ఆ కాంతల సురత క్రీడ
ఎంతో ఉత్కటంగా సాగుతోంది. వారిలోని ధాష్ట్యము (చొరవ) వల్ల లోకసహజమైన లజ్జా
మర్యాదలు, మేరలు అన్నీ దాటిపోయాయి. చుంబనములు, తాడనములు, సీత్కారములు, మణిత ధ్వనులు మరియు
పురుషాయితము (స్త్రీయే స్వయంగా చొరవ తీసుకునే అవస్థ) మొదలైన చేష్టల వల్ల వారి
ప్రవర్తన స్వేచ్ఛా వృత్తిని పొందింది. ఆ తహతహలో వారి తలవెంట్రుకలు, ధరించిన పూలమాలలు
అన్నీ దయలేకుండా నలిగిపోయాయి. అటువంటి రతి క్రీడలో పుష్పబాణుడైన మన్మథుడు, బాగా
మత్తెక్కినవాడు ఏమి చేస్తున్నాడో తెలియక ఎలాగైతే ఉన్మత్తంగా ప్రవర్తిస్తాడో, అలాగే అపరిమితమైన
విజృంభణను (విభ్రమమును) పొందాడు.
విశేషాలు
మల్లినాథుని ఘంటాపథ వ్యాఖ్యానం ప్రకారం 'ధాష్ట్యేణ' అనగా ప్రాగల్భ్యం
లేదా చొరవ. మర్యాదలు దాటడం అంటే కామశాస్త్ర పరిధిలో సాగే ఉచ్ఛృంఖల వృత్తి అని
అర్థం. మత్తుడైన వాడు లోకంలో ఏ పనైనా ఎలాగైనా చేయగలడు; ఇక్కడ మన్మథుడు
కూడా అలాగే ప్రవర్తించాడు. నిజానికి ఇక్కడ పనులు చేస్తున్నది ప్రేమికులే
అయినప్పటికీ, వారిని అలా చేయిస్తున్న కార్కుడు (కారయిత) అయిన
మన్మథునిపైనే ఆ కర్తృత్వాన్ని ఆరోపించి, ఆయన మత్తమత్తుడిలా
ప్రవర్తించాడని ఊహించడం జరిగింది. వ్యాకరణ రీత్యా 'మత్తమత్తః' అనేది
ప్రకారార్థంలో (బాగా మత్తెక్కిన రకం అనే అర్థంలో) ద్విరుక్తిని పొందింది. ఇది
కర్మధారయవద్భావం చెందడం వల్ల సుప్ లుక్ జరిగి ఈ రూపం ఏర్పడింది. ఇక్కడ అద్భుతమైన 'ఉత్ప్రేక్షా
అలంకారము' సిద్ధించింది.
నవమ సర్గ శ్లోకం 073
శీధుపానవిధ్ధురేషు వధూనాం నిఘ్నతాముపగతేషు
వపుఃషు ।
ఈహితం రతిరసాహితభావం వీతలక్ష్యమపి కామిషు
రేజే ॥
ప్రతిపదార్థం
శీధుపాన-విధ్ధురేషు = మద్యపానము చేత
వివశములై (విహ్వలములై) ఉన్నట్టియు, అత ఏవ = అందువల్లనే, నిఘ్నతాం =
(ప్రియునికి) పరాతీనత్వమును (విధేయతను) ఉపగతేషు = పొందినట్టి, వధూనాం = కాంతల
యొక్క, వపుఃషు = శరీరములు ఉండగా, రతిరస-ఆహిత-భావం =
సురత రసాస్వాదనమునందే లగ్నమైన మనస్సు కలిగిన, కామిషు = ఆ ప్రియుల
యొక్క, ఈహితం = (చుంబన తాడనాది) చేష్టలు, వీతలక్ష్యమపి =
లక్ష్యము (స్థానము) తప్పినవైనప్పటికినీ, రేజే =
ప్రకాశించెను (అందగించెను).
తాత్పర్యం
కాంతలు మద్యం సేవించడం వల్ల మైకంలో మునిగి
వివశులై ఉన్నారు. వారి శరీర అవయవాలన్నీ తమ స్వాధీనంలో లేక ప్రియునికి పూర్తిగా
లొంగిపోయి (పరాధీనమై) ఉన్నాయి. ఆ సమయంలో, సురత సుఖంలో
పూర్తిగా మునిగిపోయిన ప్రియులు అమితమైన ఆత్రుతతో చేసిన చుంబనములు, తాడనములు (గోరు, పంటి గాయాలు) వంటి
శృంగార చేష్టలు, ఆ తొందరపాటులో అస్థానములలో (చేయవలసిన స్థానాలలో
కాకుండా వేరే చోట్ల) జరిగినప్పటికీ,
అవి ఎంతో అందంగా ప్రకాశించాయి. ఎందుకంటే, అమితమైన
అనురాగవతులు, కామపీడితులు అయినవారి యొక్క ఇటువంటి పొరపాట్లు
లేదా స్ఖలితములు కూడా రతి క్రీడలో మరింత శోభనే తెచ్చిపెడతాయి కదా!
విశేషాలు
మల్లినాథుని నిఘంటు వివరణ ప్రకారం 'శీధువు' అనగా మైరేయము లేదా
ఆసవ మద్య విశేషము (మైరేయమాసవః శీధుః) అని అమరకోశం చెప్తోంది. 'నిఘ్నతామ్' అనగా ఆధీనత్వము
లేదా పరాధీనత్వము (అధీనో నిఘ్న ఆయత్తః). 'వీతలక్ష్యమ్' అనగా నిర్విషయము
లేదా అస్థానకృతము (తగిన స్థానము తప్పినది). లోకంలో మద్యం వల్ల ఒళ్లు తెలియని
అవస్థలో ఉన్న కాంతలపై, కాముకులు రసావేశంలో చేసే పనులు అస్తవ్యస్తంగా
ఉన్నా, ఆ అనురాగ తీవ్రత వల్ల అవి దోషాలుగా అనిపించక
గుణాలుగానే భాసిస్తాయని మల్లినాథులు ఇక్కడ శృంగార శాస్త్ర రహస్యాన్ని స్పష్టం
చేశారు.
నవమ సర్గ శ్లోకం 074
అన్యోన్యరక్తమనసామథ బిభ్రతీనాం చేతోభువో
హరిసఖాప్సరసాం నిదేశమ్ ।
వైబోధికధ్వనివిభావితపశ్చిమార్ధా సా
సంహృతేవ పరివృత్తిమియాయ రాత్రిః ॥
ప్రతిపదార్థం
అథ = శృంగార క్రీడ ముగిసిన తర్వాత, అన్యోన్య-రక్త-మనసాం
= పరస్పరము అనురాగముతో నిండిన మనస్సులు కలిగినట్టియు, చేతోభువః =
మన్మథుని యొక్క, నిదేశం = ఆజ్ఞను (శాసనమును), బిభ్రతీనాం =
శిరసావహించి ప్రవర్తిస్తున్నట్టి, హరిసఖ-అప్సరసాం = ఇంద్రుని స్నేహితులైన గంధర్వుల
మరియు అప్సరసల యొక్క, [రమమాణాస్వేవ = వారు క్రీడిస్తూ ఉండగానే], వైబోధిక-ధ్వని-విభావిత-పశ్చిమార్ధా
= వైతాళికుల యొక్క మేల్కొలుపు మంగళ గీతముల ధ్వనుల చేత ఊహించబడిన (తెలియవచ్చిన)
చివరి భాగము కలిగినట్టి, సా రాత్రిః = ఆ రాత్రి, సంహృతా ఇవ =
(క్షణంలో) సంక్షిప్తము చేయబడినదో అన్నట్లు, పరివృత్తిం =
ముగింపును, ఇయాయ = పొందెను (ప్రభాతకల్పము ఆయెను).
తాత్పర్యం
పరస్పర అనురాగంతో మునిగిపోయి, మన్మథుని ఆజ్ఞకు
లోబడి అమితానందంతో రతి క్రీడలలో తేలుతున్న ఆ గంధర్వులకు, అప్సరసలకు రాత్రి
గడిచినట్లే తెలియలేదు. వారు అలా సుఖిస్తూ ఉండగానే, తెల్లవారుజామున
మేల్కొలిపే వైతాళికుల (బందిమాగధుల) మంగళ ధ్వనులు వినిపించాయి. ఆ ధ్వనుల ద్వారా
రాత్రి యొక్క చివరి భాగం (నాల్గవ జాము) వచ్చేసిందని వారికి తెలిసింది. అప్పుడు
వారికి ఆ రాత్రి ఎలా అనిపించిందంటే—అంతటి సుదీర్ఘమైన రాత్రిని ఎవరో బలవంతంగా
క్షణంలో చిన్నదిగా చుట్టేసి సంక్షిప్తం చేసేశారా (సంహృతా ఇవ) అన్నట్లుగా
ముగిసిపోయింది. ఎందుకంటే, అమితమైన సుఖంలో ఉన్నవారికి ఎంత ఎక్కువ
కాలమైనా చాలా కొద్ది సమయం లాగే అనిపిస్తుంది కదా!
విశేషాలు
మల్లినాథసూరి వ్యాకరణ వివరణ ప్రకారం 'హరిసఖాః' అనగా ఇంద్రుని
మిత్రులైన గంధర్వులు. 'హరిసఖాప్సరసామ్' అనే చోట 'షష్ఠీ చానాదరే' అనే సూత్రం ప్రకారం
షష్ఠీ విభక్తి వచ్చింది (అనగా వారు కాలమును అనాదరించి క్రీడిస్తూ ఉండగానే రాత్రి
గడిచింది అని అర్థం). 'వైబోధికః' అనగా ప్రబోధము
(మేల్కొలుపుట) శీీలముగా కలిగిన వైతాళికులు లేదా వందీజనులు, ఇది శీలమనే అర్థంలో
ఠక్ ప్రత్యయం రాగా ఏర్పడింది. 'విభావిత' అంటే అనుమానించబడిన
లేదా ఊహించబడిన చరమ భాగం. ఇక్కడ సుఖులకు కాలం లఘువుగా (చిన్నదిగా)
అనిపిస్తుంది అనే మనస్తత్వాన్ని బట్టి,
రాత్రి సంక్షిప్తమైందని ఊహించడం వల్ల
ఇక్కడ 'ఉత్ప్రేక్షా అలంకారము' సిద్ధించింది.
నవమ సర్గ శ్లోకం 075
నిద్రావినోదితనితాంతరతిక్లమానా-మాయామిమంగళనినాదవిబోధితానామ్ ।
రామాసు భావివిరహాకులితాసు యూనాం
తత్పూర్వతామివ సమాదధిరే రతాని ॥
ప్రతిపదార్థం
నిద్రయా = నిద్ర చేత, వినోదిత-నితాంత-రతి-క్లమానాం
= పూర్తిగా పోగొట్టబడిన మిక్కిలి ఎక్కువైన సురత శ్రమ కలిగినట్టియు, ఆయామి-మంగళనినాద-విబోధితానామ్ = (వైతాళికుల) దీర్ఘములైన మంగళ
ధ్వనుల చేత మేల్కొల్పబడినట్టియు, యూనాం = ఆ యువకుల యొక్క, రతాని = రతి
క్రీడలు, భావి-విరహ-ఆకులితాసు = (పగలు కాగానే కలవలేమనే)
రాబోవు ఎడబాటు చేత కలత చెందుతున్న, రామాసు = ఆ సుందరీమణుల యందు, తత్పూర్వతాం ఇవ =
ప్రథమ సమాగమము యొక్క స్థితిని (తొలి రతి యొక్క అనుభూతిని), సమాదధిరే ఇవ =
పొందినవో అన్నట్లుగా ఉన్నవి.
తాత్పర్యం
రాత్రి జరిగిన రతి క్రీడల వల్ల అలసిపోయిన
ఆ యువకులు కొద్దిసేపు నిద్రపోవడం వల్ల వారి అలసటంతా పూర్తిగా తీరిపోయింది.
తెల్లవారుజామున వైతాళికులు పాడే దీర్ఘ మంగళ ధ్వనుల వల్ల వారు మేల్కొన్నారు.
తెల్లవారితే తాము విడిపోవాల్సి వస్తుందని (గంధర్వులు, అప్సరసలు పగటి పూట
తమ విధులకు వెళ్లాల్సి రావడం వల్ల) ఆ కాంతలు విరహ తాపంతో కలత చెందుతున్నారు. ఆ
సమయంలో, ఇక సమయం లేదనే ఆత్రుతతో ఆ యువకులు మళ్లీ రతి
క్రీడను ప్రారంభించారు. ఆ ప్రభాత కాలపు క్రీడ వారికి ఎలా అనిపించిందంటే—అది
మునుపెన్నడూ లేని విధంగా, తమ జీవితంలో సరికొత్తగా జరిగిన ప్రథమ (తొలి)
సమాగమము వలె అత్యంత అపూర్వమైన తృష్ణను,
తీపిని కలిగించింది.
విశేషాలు
మల్లినాథుని నిఘంటు వివరణ ప్రకారం 'రామా' అనగా సుందరి లేదా
రమణి (సుందరీ రమణీ రామా) అని అమరకోశం చెప్తోంది. వ్యాకరణ రీత్యా 'తత్పూర్వతామ్' అనగా అంతకుముందు
లేని అపూర్వ స్థితి (ప్రథమత్వము), ఇది భావార్థంలో తల్ ప్రత్యయం రాగా ఏర్పడింది. ఇక్కడ కామశాస్త్ర సంప్రదాయం
ప్రకారం—ఏ వస్తువు లేదా సుఖము భవిష్యత్తులో దొరకడం దుర్లభమో (కష్టం కాబోతోందో), దానిపై మనుషులకు
అమితమైన తృష్ణ (కోరిక) పెరుగుతుంది. ఇక్కడ కూడా రాబోయే విరహం వల్ల ఆ చివరి క్షణాల
సురత క్రీడ, తొలిసారి కలిసినప్పుడు కలిగే అపూర్వ అనుభూతిని
ఇచ్చింది అని ఊహించడం వల్ల ఇక్కడ 'ఉత్ప్రేక్షా అలంకారము' సిద్ధించింది.
దీనివల్ల శృంగార రస పరిపోషణ పరాకాష్ఠకు చేరింది.
.
నవమ సర్గ శ్లోకం 076
కాంతాజనం
సురతఖేదనిమీలితాక్షం సంవాహితుం సముపయానివ మందమందమ్ ।
హర్మ్యేషు
మాల్యమదిరాపరిభోగగంధానావిశ్చకార రజనీపరివృత్తివాయుః ॥
ప్రతిపదార్థం
రజనీ-పరివృత్తి-వాయుః
= రాత్రి ముగింపు సమయమున (తెల్లవారుజామున) వీచే చల్లని గాలి, సురత-ఖేద-నిమీలిత-అక్షం = సురత శ్రమ చేత ముడుచుకున్న కన్నులు కలిగిన, కాంతాజనం = ఆ సుందరీమణుల సమూహమును, సంవాహితుం ఇవ = (శ్రమను పోగొట్టుట కొరకై) ఉపచారము చేయుట కొరకో (అంగమర్దనము
చేయుట కొరకో) అన్నట్లు, మందమందం = మిక్కిలి
మెల్లగా, సముపయాన్ = ప్రసరిస్తూ, హర్మ్యేషు = ఆ విలాస భవనములందు,
మాల్య-మదిరా-పరిభోగ-గంధాన్
= పూలమాలల యొక్క, మద్యము యొక్క మరియు ఆ
రతిక్రీడల ఒరిపిడి (విమర్దము) వల్ల కలిగిన సువాసనలను, ఆవిశ్చకార = వెదజల్లెను (బయటకు వ్యాపింపజేసెను).
తాత్పర్యం
రాత్రి ముగిసి
తెల్లవారుజాము అవుతోంది. ఆ సమయంలో బయట చల్లని ప్రభాత వాయువు (రజనీపరివృత్తి
వాయువు) మెల్లమెల్లగా వీచడం ప్రారంభమైంది. రాత్రి అంతా రతిక్రీడలలో మునిగి తేలడం
వల్ల అలసిపోయి, కళ్ళు మూసుకుని
నిద్రిస్తున్న ఆ కాంతల అలసటను పోగొట్టడానికి, వారికి మెల్లగా ఉపచారం (అంగమర్దనం) చేయడానికో అన్నట్లు ఆ గాలి భవనాలలోకి
ప్రవేశించింది. ఆ గాలి భవనాలలో వీచడం వల్ల, అక్కడ రాత్రి కాంతలు ధరించిన పూలమాలల సువాసనలు, వారు సేవించిన మద్యపు పరిమళాలు,
వారి క్రీడల
ఒరిపిడి వల్ల వెలువడిన శృంగార సుగంధాలు అన్నీ ఒక్కసారిగా అంతటా వ్యాపించాయి.
విశేషాలు
మల్లినాథసూరి
విశ్వకోశం ఆధారంగా 'సంవాహనమ్' అనే పదానికి అర్థాన్ని స్పష్టం చేశారు: మనుషుల శరీర శ్రమను పోగొట్టడానికి
చేసే అంగమర్దనమును లేదా సేవను సంవాహనము అంటారు (సంవాహనం వాహనేపి నరాదేరంగమర్దనే).
వ్యాకరణ రీత్యా 'మందమందమ్' అనే పదం ప్రకారార్థంలో ద్విరుక్తిని పొంది, కర్మధారయవద్భావం చెందడం వల్ల సుప్ లుక్ జరిగి సిద్ధించింది. ఇక్కడ ప్రభాత
వాయువు యొక్క 'మందగమనం' అనే గుణాన్ని బట్టి, అది అలసిన కాంతలకు సేవ
చేయడానికి వచ్చిందని ఊహించడం వల్ల ఇది గుణనిమిత్తక 'క్రియాఫలోత్ప్రేక్షా అలంకారం'
అవుతుంది.
నవమ సర్గ శ్లోకం 077
ఆమోదవాసితచలాధరపల్లవేషు
నిద్రాకషాయితవిపాటలలోచనేషు ।
వ్యామృష్టపత్రతిలకేషు
విలాసినీనాం శోభాం బబంధ వదనేషు మదావశేషః ॥
ప్రతిపదార్థం
ఆమోద-వాసిత-చల-అధర-పల్లవేషు
= మద్యము యొక్క సువాసన చేత సుగంధభరితమై మరియు (ప్రియుని దంత క్షతాల వల్ల) కొద్దిగా
కదులుతున్న చిగురుటాకుల వంటి పెదవులు కలిగినట్టియు, నిద్రా-కషాయిత-విపాటల-లోచనేషు = నిద్ర (మత్తు) చేత అరమూతలు పడి కొద్దిగా
ఎర్రబడిన కన్నులు కలిగినట్టియు, వ్యామృష్ట-పత్ర-తిలకేషు =
(రతిక్రీడల వల్ల) పూర్తిగా చెరిగిపోయిన పత్రలేఖలు మరియు తిలకము కలిగినట్టి, విలాసినీనాం = ఆ విలాసవతుల యొక్క, వదనేషు = ముఖములందు, మద-అవశేషః = మిగిలియున్న
మద్యపు మత్తు శోభ, శోభాం బబంధ = అద్భుతమైన
అందాన్ని కూర్చెను.
తాత్పర్యం
తెల్లవారిన
తర్వాత ఆ విలాసవతుల ముఖాలు ఒక విచిత్రమైన అందాన్ని సంతరించుకున్నాయి. వారి
పెదవులకు మద్యపు సువాసన అంటుకుంది, పైగా ప్రియుడు ముద్దాడటం
వల్ల అవి కొద్దిగా వణుకుతున్నాయి. నిద్రమత్తు వల్ల వారి కళ్లు అరమూతలు పడి, కొద్దిగా ఎరుపు రంగును (పాటల వర్ణాన్ని) కలిగి ఉన్నాయి. వారి ముఖాలపై ఉన్న
తిలకము, కస్తూరి ముగ్గులు
(పత్రలేఖలు) అన్నీ రాత్రి క్రీడల వల్ల పూర్తిగా చెరిగిపోయాయి. సాధారణంగా అలంకారాలు
చెరిగిపోతే ముఖం అందవిహీనంగా మారాలి,
కానీ ఇక్కడ వారి
ముఖాలలో ఇంకా మిగిలి ఉన్న ఆ 'మద్యపు మత్తు శోభ' (మదావశేషం) వారికే తెలియని ఒక అపూర్వమైన అందాన్ని
తెచ్చిపెట్టింది. ఆ సమయంలో ఆ మత్తే వారికి అసలైన ఆభరణమయింది.
విశేషాలు
మల్లినాథుని కేశవ
నిఘంటు వివరణ ప్రకారం 'కషాయ' శబ్దానికి వగరు, రంజకము, సుగంధము, అపటువు (సామర్థ్యం
లేనిది/మందగించినది), ఎరుపు మరియు సుందరము అనే
అర్థాలు ఉన్నాయి; ఇక్కడ నిద్ర వల్ల కళ్లు
మందగించడం, ఎర్రబడటం అని అర్థం.
లోకంలో స్త్రీలకు ఆభరణాలు, తిలకాలు లేకపోయినా, ఈ 'మద శోభ' అనేది వారి శృంగార సౌందర్యాన్ని అత్యున్నతంగా ప్రకాశింపజేస్తుందని
కామశాస్త్ర రహస్యాన్ని ఇక్కడ మల్లినాథులు సమర్థించారు.
నవమ సర్గ శ్లోకం 078
గతవతి
నఖలేఖాలక్ష్యతామంగరాగే సమదదయితపీతాతామ్రబింబాధరాణామ్ ।
विरహవిధరమిష్టా సత్సఖీవాంగనానాం హృదయమవలలంబే రాత్రిసంభోగలక్ష్మీః ॥
ప్రతిపదార్థం
అంగరాగే =
శరీరమునకు పూసుకున్న గంధ లేపనమంతా, నఖలేఖా-లక్ష్యతాం =
కేవలము గోటి గాయముల (నఖ క్షతముల) గుర్తులు మాత్రమే కనిపించే స్థితిని, గతవతి సతి = పొందినది కాగా, సమద-దయిత-పీత-ఆతామ్ర-బింబాధరాణామ్
= మదోన్మత్తులైన ప్రియుల చేత జుర్రుకోబడటం వల్ల మిక్కిలి ఎర్రబడిన దొండపండు వంటి
పెదవులు కలిగిన, అంగనానాం = ఆ కాంతల యొక్క, విరహ-విధురం = (పగలు కాగానే కలవలేమనే) దిన విరహము చేత విహ్వలమైపోతున్న, హృదయం = హృదయమును, రాాత్రిసంభోగలక్ష్మీః =
రాత్రి జరిగిన సురత క్రీడల యొక్క శోభ (ఆ ఆభరణాల చెరిపివేత రూప సౌందర్యము), ఇష్టా = ప్రాణసమానురాలైన, సత్సఖీ ఇవ = ఒక మంచి
స్నేహితురాలు వలె, అవలలంబే = ఓదార్చి
ఆదుకొనెను (ధైర్యమును ఇచ్చెను).
తాత్పర్యం
తెల్లవారేసరికి ఆ
కాంతల శరీరాలపై ఉన్న సుగంధ లేపనాలన్నీ కరిగిపోయాయి; వాటి స్థానంలో కేవలం ప్రియుడు చేసిన నఖ క్షతాల (గోరు గాయాల) గుర్తులు
మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మదోన్మత్తులైన ప్రియులు గాఢంగా చుంబించడం వల్ల
వారి దొండపండు వంటి పెదవులు మరింత ఎర్రబడ్డాయి. పగలు కాగానే తమ ప్రియులు విధులకు
వెళ్ళిపోతారని, తాము విడిపోవాల్సి
వస్తుందని ఆ కాంతల హృదయాలు విరహ తాపంతో విహ్వలమైపోతున్నాయి. ఆ సమయంలో, వారి శరీరాలపై ఉన్న ఆ నఖ క్షతాలు, అధర రాగము అనే 'రాత్రి సంభోగ లక్ష్మి' (సురత శోభ),
వారికి ఒక
ఆప్తురాలైన ప్రాణ స్నేహితురాలి వలె ధైర్యాన్ని ఇచ్చి ఓదార్చింది. ఆ ప్రేమ
చిహ్నాలను చూసుకుంటూ వారు ఆ పగటి విరహాన్ని భరించగలిగారు.
విశేషాలు
మల్లినాథసూరి
వ్యాఖ్యానంలో వామనుని కావ్యాలంకార సూత్రాల ఆధారంగా 'బింబాధరాణామ్' అనే పదం శాకపార్థివాది
గణము నుండి మధ్యమపదలోపి సమాసంగా ఏర్పడిందని వివరించారు; అనగా బింబఫలము (దొండపండు) తో సమానమైన అధరము అని అర్థం. ఇక్కడ 'రాత్రి సంభోగ లక్ష్మి' ని, విరహంలో ఉన్న కాంతను ఓదార్చే ఒక నిపుణురాలైన 'సత్సఖి' (మంచి స్నేహితురాలు) తో
పోల్చడం జరిగింది. కాబట్టి ఇక్కడ సంపూర్ణమైన 'శ్రుతిపూర్ణోపమా అలంకారము' సిద్ధించింది. ఈ నవమ
సర్గలోని చివరి శ్లోకము 'మాలిని' వృత్తంలో వ్రాయబడింది. దీని లక్షణం 'ననమయయుతేయం మాలిణీ భోగిలోకైః'
- అనగా ప్రతి
పాదంలోనూ వరుసగా రెండు నగణములు, ఒక మగణము, రెండు యగణములు ఉంటాయి.
ముగింపు:
ఇతి
శ్రీమహామహోపాధ్యాయ కోలాచల మల్లినాథసూరి విరచిత, కిరాతార్జునీయ కావ్య వ్యాఖ్యానమైన 'ఘంటాపథం' నందలి నవమ సర్గ
సంపూర్ణముగా ముగిసింది.